Telangana budget sessions 2023-24 : తెలంగాణ శాసనసభలో బీఏసీ సమావేశ నిర్ణయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సభ్యులకు వెల్లడించారు. ఈ నెల 6వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. 8వ తేదీన బడ్జెట్పై సాధారణ చర్చ జరగనుందని.. వాటికి ప్రభుత్వం సమాధానం ఇస్తుందని పేర్కొన్నారు. 9, 10, 11 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ.. 12న ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ జరగనున్నట్లు కేసీఆర్ సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. ఇంకా ఏమైనా అంశాలు మిగిలి ఉంటే బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం: అంతకు ముందు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఇవాళ తెలంగాణ శాసనసభ, శాసనమండలిలో చర్చ జరుగుతోంది. రెండు సభల్లోనూ ఇవాళ ప్రశ్నోత్తరాలను రద్దు చేసి నేరుగా చర్చలోకి వెళ్లారు. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తీర్మానాన్ని ప్రతిపాదించగా.. మరో శాసనసభ్యుడు వివేకానంద గౌడ్ బలపరిచారు. మండలిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదించగా.. మరో ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ బలపరిచారు. ఆ తర్వాత అన్ని పక్షాల నేతలు చర్చల్లో పాల్గొన్నారు.