విజయవాడకు చెందిన విజయ్ ఫోన్ కు ఓ నంబర్ నుంచి కాల్ వచ్చింది. మీకు రూ.రెండు కోట్లు లాటరీ తగిలిందని అవతలి వ్యక్తి చెప్పాడు. మీకు వేరే చరవాణి నుంచి ఫోన్ వస్తుంది. అప్పుడు ఈ నంబర్ తెలపండి అని చెప్పి పెట్టేశాడు. అసలు తాను లాటరీ టికెట్ కొనకపోయినా.. ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో కూడా తెలియకపోయినా.. అదేదీ ఆలోచించకుండా విజయ్ ఎగిరి గంతేశాడు. కొద్ది రోజుల్లోనే కోటీశ్వరుడు అయిపోతానని కలలు కన్నాడు.
ఈ విషయంపై ఎవరితోనూ చర్చించలేదు. అంతలోనే అతనికి ఫోన్ వచ్చింది. లాటరీ సొమ్ము అందాలంటే ఫార్మాలిటీస్ కింద తాము సూచించిన బ్యాంకు ఖాతాలో కొంత రుసుం వేయాలనేది సారాంశం. అలా రూ.20 వేలతో ప్రారంభమైన చెల్లింపులు రూ.2 లక్షలు వరకు చేరాయి. చివరకు మోసపోయాయని గ్రహించిన విజయ్... లబోదిబోమంటూ పోలీసులకు ఆశ్రయించాడు. అతడి చేతికి ఒక్కపైసా సొమ్ము ఇప్పటివరకు తిరిగి అందలేదు.
కొన్ని నెలల కిందట గుంటూరు జిల్లా అచ్చంపేటకు చెందిన ఓ బ్యాంకు అధికారి ఇదే తరహాలో మోసపోయారు. అతను మెయిల్కు ఓ సందేశం వచ్చింది. ‘మీకు రూ.కోటి లాటరీ తగిలింది' అని దాని సారాంశం. దీనికి ఆశపడిన ఆయన వారు చెప్పిన బ్యాంకు ఖాతాలో రూ.10వేలు వేశారు. తర్వాత మరో రూ.10వేలు జమచేశారు. ఆ తర్వాత మోసాన్ని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. ఇలాంటి సంఘటనలు విజయవాడ, గుంటూరు పరిధిలో తరచూ వెలుగుచూస్తున్నా.. మోసపోతున్న వారు పెరుగుతూనే ఉన్నారు.
ముమ్మాటికీ అత్యాశే..!:
తొలినాళ్లలో ఎక్కువగా నైజీరియన్ నేరగాళ్లే ఈ మోసాలకు పాల్పడేవారు. ప్రస్తుతం ఎల్లలు దాటి అన్ని రకాల వాళ్లు ఇందులో ఉన్నారు. విజయవాడలో తరచూ ఇలా లాటరీల పేరిట మోసాలకు వలేస్తున్నారు. బాధితుల అత్యాశే ఇందుకు కారణమని పోలీసులు విశ్లేషిస్తున్నారు. సెల్ఫోన్కో లేక మెయిల్కో లాటరీ గెలిచిన సందేశం వచ్చినట్లు మిత్రులతో బాధితులు పంచుకోకపోవటం వల్లే నైజీరియన్లు సులభంగా మోసం చేయగలుగుతున్నారు.
బాధితులు నిండా మునిగేవరకు విషయం బయటకు పొక్కడం లేదు. తాము పంపే సందేశాలకు తిరిగి సమాధానమిచ్చే వారిని అత్యాశపరులుగా గుర్తిస్తూ మోసగాళ్లు బుట్టలో వేస్తున్నారు. అనంతరం ‘టాక్స్ క్లియరెన్స్’, ‘యాంటీ టెర్రరిస్ట్ ఫండ్’, ‘ఆర్బీఐ టాక్స్ పేయింగ్’.. ఇలా ఏ పేరు మదిలో మెదిలితే ఆ పేర్లతో డబ్బులు దండుకుంటున్నారు.