ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 4, 2022, 8:56 AM IST

ETV Bharat / state

అక్షరాలతో సహవాసం ఎంతోమంది జీవితాల్ని మార్చింది... అదెలాగో తెలుసుకుందామా..?

Vijayawada Book Festival: చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. కాని ఒక మంచి పుస్తకం కొనుక్కో.. కందుకూరి వీరేశలింగం ఎప్పుడో చెప్పిన గొప్ప మాటలివి. అక్షరాలతో సహవాసం ఎంతోమంది జీవితాల్ని మార్చింది. వికాసమైన వ్యక్తిత్వం.. సంపూర్ణ జ్ఞానం.. మంచి నడవడికతో ఇతరులకు ఆదర్శంగా నిలిచేందుకు పుస్తకాలు దోహదం చేస్తున్నాయి. పుస్తక మహోత్సవం సందర్భంగా అక్షరాలు ఆదర్శంగా నిలిపిన స్ఫూర్తిమంతులు తమల్ని పుస్తకాలు ఎలా దిద్దాయో వివరించారు.

Book Festival in vijayawada
vijayawada book fair

Vijayawada Book Festival: విజయవాడ వాసులను పుస్తకాలు పిలుస్తున్నాయి. సుమారు రెండేళ్ల తర్వాత మొదలైన పుస్తక మహోత్సవంలో... సాహితీ ప్రియులు తమకు కావాల్సిన పుస్తకాల కోసం అన్వేషించారు. కాసమైన వ్యక్తిత్వం.. సంపూర్ణ జ్ఞానం.. మంచి నడవడికతో ఇతరులకు ఆదర్శంగా నిలిచేందుకు పుస్తకాలు దోహదం చేస్తాయని పలువురు సాహితీ ప్రియులు తెలిపారు. పుస్తక మహోత్సవం సందర్భంగా అక్షరాలు ఆదర్శంగా నిలిపిన స్ఫూర్తిమంతులు తమల్ని పుస్తకాలు ఎలా దిద్దాయో వివరించారు.

నాకు నేనే బాధ్యుడినని తెలుసుకున్నా..

37 ఏళ్ల వయసులో డా.డయ్యర్‌ రాసిన పుల్లింగ్‌ యువర్‌ ఓన్‌స్ట్రింగ్స్‌ (నిన్ను నువ్వు సరిగా సమీక్షించుకో) అనే పుస్తకం చదివాను. ఇతరులు ప్రశంసిస్తే పొంగిపోకుండా, విమర్శిస్తే కుంగిపోకుండా ఉండటం అలవాటయ్యింది. చేసే పనులు, తీసుకునే ప్రతి నిర్ణయానికి బాధ్యుడిని నేనే అన్న ఎరుక కగిలింది. ఇతరులను నిందించాల్సిన పనిలేదు. చదివి 40 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఉపయోగపడుతోంది. 40కి పైగా పుస్తకాలు, నిఘంటువులు రాయడానికి ఎంతో దోహదపడింది.-పెద్ది సాంబశివరావు, నిఘంటువు రచయిత, గుంటూరు

నా ఆలోచనా ధోరణిలో చాలా మార్పు..

విజయానికి ఐదుమెట్లు చదివాక నా ఆలోచనా ధోరణిలో చాలా మార్పు వచ్చింది. ఇప్పటికీ నేను వైద్యుడిగా ఎంత బిజీగా ఉన్నా.. కచ్చితంగా ఒక పుస్తకం పక్కనే ఉంచుకుని చదువుతూ ఉంటాను. జీవితంలో మంచి వ్యక్తులుగా మార్చేవి పుస్తకాలే. నేను ఒక వైద్యుడిగా, సైకాలజిస్ట్‌గా చెప్పేది ఒక్కటే.. ఏ రంగంలోనైనా జీవితంలో విజయం సాధించాలంటే పుస్తకాలతో పరిచయం ఉంటేనే ఉన్నత స్థానాలకు వెళ్లగలరు. అందుకే పుస్తకాలతో సహవాసం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంది.- డాక్టర్‌ ఇండ్ల రామసుబ్బారెడ్డి, సైకాలజిస్ట్‌

ఆయన పుస్తకాల వల్లే బోధన వైపు..

జాషువా రచనలు నన్ను బోధనా రంగం వైపు వచ్చేలా చేశాయి. ఆయన రచనల్లో మానవీయ స్పర్శ సమాజం పట్ల దృష్టికోణం మారేలా చేసింది. అందుకే.. నేను లిటరేచర్‌ చేయడానికి.. పాఠ్య పుస్తకాలు ఒక్కటే చాలవు. అధ్యాపకుడిగా పాఠాలు చెప్పేటప్పుడు లోతుగా పుస్తకాలను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే.. అన్ని రకాల పుస్తకాలూ చదవడం నాకు అలవాటుగా మారింది. ప్రస్తుతం పుస్తకాలను చదవడం చాలా తగ్గిపోయింది. దానివల్ల జరిగే నష్టం అంచనా వేయడం కూడా సాధ్యం కాదు.-గుమ్మా సాంబశివరావు, సాహితీవేత్త, తెలుగు అధ్యాపకులు

ఆ ఒక్క పుస్తకం చదివాక బోధనలో మార్పు..

నేను ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన ఆరంభంలోనే పగటికల పుస్తకం చదివాను.ఆ ప్రభావం వల్ల మా పాఠశాలలో విద్యావిధానంలోనూ అనేక మార్పులు చేశాను. పిల్లలు ఆడుతూ.. పాడుతూ విద్యను నేర్చుకోవాలనే పంథాలోనే తరగతులను నిర్వహిస్తున్నాం. 1932లో తొలిసారి ప్రచురితమైన ఈ పుస్తకం ఇప్పటికీ మన విద్యావిధానానికి సరిపోయేలా ఉంటుంది. ఆడుతూ పాడుతూ చదువుతూ.. ఆరోగ్యకరమైన అలవాట్లను చిన్నారులకు నేర్పించడం ఎలా అనేది ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. ప్రస్తుతం ఒత్తిడిమయ విద్యా విధానం పిల్లలను ఎంత మానసిక క్షోభకు గురిచేస్తుందో అర్థమవుతుంది. -వై.కృష్ణ, ప్రముఖ విద్యావేత్త, అభ్యాస విద్యాలయం ప్రిన్సిపాల్‌

‘నాకూ ఉందో కల’ నా కలల్ని మార్చేసింది..

ర్గీస్‌ కురియన్‌ ఆంగ్లంలో రాసిన పుస్తకం ‘ఐ టూ హ్యాడ్‌ ఏ డ్రీమ్‌’ పుస్తక తెలుగు అనువాదం ‘నాకూ ఉందో కల’ పుస్తకం నా కలల్ని సైతం మార్చేసింది. అనాసక్తిగానే పాల ఉత్పత్తి రంగంలో అడుగుపెట్టినప్పటికీ దేశంలోనే దానిని అత్యున్నత స్థాయికి ఎలా చేర్చారో వివరించారు. నచ్చినా, నచ్చకపోయినా ఒక పనిని మొదలు పెట్టినప్పుడు శిఖరాగ్ర స్థాయికి చేరటం మనందరి బాధ్యత అని చాటి చెప్పే ఆ పుస్తకం జీవిత పాఠ్యగ్రంథం వంటిది. ‘ఇకిగై’ అనే పుస్తకం(ఆంగ్లంలో ఉంది)లో నూరు వసంతాలు పూర్తి చేసుకుని చక్కగా మానసిక, శారీరక ఆరోగ్యంతో ఉన్న దాదాపు 50 మందికి పైగా పెద్దల జీవిత అనుభవాలు, ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. - యం.ఆర్‌.ప్రసన్నకుమార్‌,గ్రంథాలయశాఖ సంచాలకులు


ఇదీ చదవండి:VIJAYAWADA BOOK FAIR: విజయవాడలో పుస్తక మహోత్సవం.. కొలువుదీరిన లక్షలాది పుస్తకాలు

ABOUT THE AUTHOR

...view details