AP Govt Not Using Water Properly for Agriculture: గోదావరి, పెన్నా నదుల అనుసంధానం తొలిదశ ప్రాజెక్టుగా 6,020.15 కోట్లతో చంద్రబాబు ప్రభుత్వంలో చేపట్టిన పనులకు జగన్ ప్రభుత్వం బ్రేక్ వేసింది. గోదావరి వరద జలాలను పోలవరం కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజికి మళ్లించి.. వైకుంఠపురం వద్ద నుంచి ఆ నీటిని ఎత్తిపోసి సాగర్ కాలువకు మళ్లించే పథకాన్ని చంద్రబాబు నాయుడు రూపకల్పన చేశారు. ప్రతి సంవత్సరం గోదావరి వరద సమయంలో 73 టీఎంసీల జలాలను ఇలా సాగర్ ఆయకట్టుకు మళ్లించవచ్చని ఎత్తిపోతలకు రూపకల్పన చేశారు.
చింతలపూడి ఎత్తిపోతల పంపుహౌస్ ద్వారా ఆ నీటిని పోలవరం కుడి కాలువకు మళ్లించి ప్రకాశం బ్యారేజికి తరలించాలనేది ప్రణాళిక. ఈ నాలుగేళ్లలో ఆ పథకం పూర్తి చేసి ఉంటే ఈ ఏడాది సాగర్ ఆయకట్టు రైతుల పంట పండేది. లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చేది. కానీ వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచీ నిర్లక్ష్యం చేసింది. ఈ ఏడాది కరవు కమ్మేయడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. అదే సమయంలో గోదావరిలో వేల టీఎంసీల నీరు వృథాగా పోయింది.
కరవు తాండవం.. పట్టించుకోని పాలకులు.. వలసలే దిక్కు అంటున్న రైతులు
ఎన్నో ఏళ్లుగా కృష్ణా నది నీళ్లు దిగువకు రావడం లేదు. ఎగువ రాష్ట్రాలను దాటి తెలుగు రాష్ట్రాలకు నీరు చేరకపోవడంతో ఎక్కడో దిగువన ఉన్న సాగర్, కృష్ణా డెల్టా ఆయకట్టుల రైతులు తీవ్ర వేదనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో రైతుల వెతలు తీర్చేలా గోదావరి నీటిని కృష్ణా డెల్టా ఆయకట్టుకు మళ్లించేలా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మించారు. దీని వల్ల ఎన్నో ఏళ్ల సంవత్సరాల రైతులు ప్రయోజనం పొందారు.
ఈ సంవత్సరం కూడా కృష్ణా డెల్టాను పట్టిసీమ ఎత్తిపోతలే ఆదుకుంది. పట్టిసీమ తరహాలోనే సాగర్ కుడి కాలువ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని చంద్రబాబు తలపోశారు. ఈ మేరకు 73 టీఎంసీలు మళ్లిస్తే సాగర్ కుడి కాలువ కింద 9.61 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి సమస్య తీరేది. కానీ జగన్ అధికారంలోకి రాగానే తగినన్ని నిధులు ఇవ్వకుండా.. భూసేకరణ సమస్య పరిష్కరించకుండా పథకాన్ని అటకెక్కించారు.