ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP Employees Protests: 'చర్చల పేరిట తప్పుదోవ పట్టించేందుకు ప్రభుత్వం కుట్ర'

By

Published : Jan 27, 2022, 3:30 PM IST

Updated : Jan 27, 2022, 4:26 PM IST

AP govt Employees Stage Protests: రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు చేపట్టిన ఉద్యమాన్ని ఉద్ధృతం చేశాయి. కొత్త పీఆర్సీ జోవోలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆ దిశగా నిర్ణయం తీసుకుంటనే ప్రభుత్వంతో చర్చలకు వెళ్తామని పీఆర్సీ సాధన సమితి నేతలు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే మరోవైపు సర్కార్ వెనక్కి తగ్గటం లేదు.. తాజాగా ఉద్యోగుల జీతాలు, పింఛన్ల బిల్లులను ప్రాసెస్‌ చేయాలని ఆర్థికశాఖ మరోసారి సర్క్యులర్‌ జారీ చేసింది.

AP govt Employees Stage Protests Against PRC GOs
AP govt Employees Stage Protests Against PRC GOs

AP govt Employees Stage Protests : పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సమ్మె నోటీసు ఇచ్చిన ఉద్యోగ సంఘాలు ఉద్యమాన్ని ఉద్ధృతం చేశాయి. పీఆర్సీ సాధన సమితి నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాలు నిరసనలు కొనసాగిస్తున్నాయి. విజయవాడ గాంధీనగర్‌లోని ధర్నాచౌక్‌, గుంటూరులో కలెక్టరేట్‌ ఎదురుగా ఉద్యోగులు రిలేదీక్షలు చేపట్టారు. మెరుగైన పీఆర్సీ ఇవ్వడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల జారీ చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలన్నారు.

తప్పుదోవ పట్టించేందుకు కుట్ర - బండి శ్రీనివాసరావు

"చర్చలకు పిలిచినా ఉద్యోగులు రావట్లేదని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. చర్చల పేరిట తప్పుదోవ పట్టించేందుకు ప్రభుత్వం కుట్ర. 12సార్లు చర్చలకు వెళ్లినా మిశ్రా కమిటీ నివేదిక ఇవ్వలేదు. ప్రభుత్వం 3 నెలలుగా ఆశ చూపుతూ వెనక్కి వెళ్తోంది. ఉద్యోగుల ఆప్షన్ తీసుకున్నాకే పీఆర్సీ అమలు చేయాలి. జీతాలు తీసుకోవట్లేదనే నెపం పెట్టాలని ప్రభుత్వం యోచన. ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు ఆగిపోనున్నాయి. డిమాండ్లపై ప్రభుత్వ వైఖరి చెప్పే వరకు చర్చలకు వెళ్లేది లేదు" - బండి శ్రీనివాసరావు, ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు

చిత్తశుద్ధి ఉంటే జోవోలను రద్దు చేయండి - బొప్పరాజు

PRC GOs issue in ap: కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయుల రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. పీఆర్సీ సాధన సమితి రాష్ట్ర నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, శివారెడ్డి దీక్షలను ప్రారంభించారు. తాము ప్రభుత్వంతో చర్చలకు రావడం లేదంటూ మంత్రులు కమిటీ పదేపదే చెప్పడాన్ని నేతలు తీవ్రంగా ఖండించారు. మూడు రోజుల క్రితమే తాము తొమ్మిది మంది సభ్యులతో ఓ కమిటీని చర్చలకు పంపించామని స్పష్టం చేశారు. ఆ కమిటీ ద్వారా తమ డిమాండ్లను లిఖితపూర్వకంగా తెలియజేశామన్నారు. వాటిపై ఏం చర్యలు తీసుకున్నారో ప్రభుత్వం చెప్పకుండా తమపై నిందారోపణలు మోపడం తగదన్నారు. ఉద్యోగులపై ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ చీకటి జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

జీవోలు అన్యాయం - వెంకట్రామిరెడ్డి

పీఆర్సీ, ఇతర అపరిష్కృత సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చొరవ చూపాలని.. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యుడు వెంకట్రామిరెడ్డి కోరారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోల వల్ల ప్రతి ఉద్యోగి బాధపడుతున్నారని.. అందుకే ఉద్యోగులందరూ రోడ్ల మీదకు వచ్చి పోరాడుతున్నారని గుర్తు చేశారు. ఇవి అన్యాయమైన జీవోలని వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు. పీఆర్సీ అంటే జీతాలు పెంచాలే తప్ప తగ్గించడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం పీఆర్సీని ప్యాకేజr మాదిరిగా చూస్తుందని.. పీఆర్సీకి ఏదీ ప్రత్యామ్నాయం కాదని వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. గుంటూరు కలెక్టరేట్ ఎదుట పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని పీఆర్సీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులతో కలిసి వెంకట్రామిరెడ్డి సందర్శించారు.

సచివాలయ ఉద్యోగుల నిరసన..

పీఆర్సీ జీవోలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సచివాలయ ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఆందోళన చేశారు. సచివాలయంలోని మూడో బ్లాక్ నుంచి అవుట్ గేట్ వరకూ ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. పీఆర్సీ జీవోలను వెనక్కు తీసుకోకుండా ఆందోళనలు విరమించేది లేదని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పారు. ఏపీ సచివాలయ ఉద్యోగులతో పాటు హైకోర్టు ఉద్యోగులు కూడా నల్లబ్యాడ్జీలు ధరించి కోర్టు ప్రాంగణంలో నిరసన తెలిపారు.

చర్చలకు ఆహ్వానం.. వేచి చూసిన మంత్రులు

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న పీఆర్సీ సాధన సమితి నేతలను ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. సచివాలయంలో మధ్యాహ్నం 12గంటలకు చర్చలకు రావాలని పిలిచింది. పీఆర్సీపై ప్రభుత్వ కమిటీతో చర్చలకు రావాలని కోరింది. స్టీరింగ్‌ కమిటీలోని 20మంది సభ్యులు చర్చలకు రావాలని పేర్కొంది. ఈ మేరకు సాధారణ పరిపాలనాశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ నేతలను ఆహ్వానించారు. ఈ మేరకు మంత్రులు.. ఉద్యోగ సంఘ నేతల కోసం ఎదురు చూశారు.

ప్రాసెస్ చేయాల్సిందే.. మరోసారి సర్క్యులర్..

కొత్త పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులు ఉద్యమిస్తున్నా.. మరోవైపు రాష్ట్ర సర్కార్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా ఉద్యోగుల జీతాలు, పింఛన్ల బిల్లులను ప్రాసెస్‌ చేయాలని ఆర్థికశాఖ మరోసారి సర్క్యులర్‌ జారీ చేసింది. కొత్త పీఆర్సీకి అనుగుణంగానే జీతాలు, పింఛన్ల బిల్లులు ఉండాలని సూచించింది. ఈ మేరకు సాయంత్రంలోగా బిల్లులు అప్‌లోడ్‌ చేయాలని డీడీవోలకు గడువు విధించింది. గడువులోగా బిల్లుల ప్రక్రియ చేపట్టకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు రేపటిలోగా బిల్లులు ప్రాసెస్‌ చేసి, ఫిబ్రవరి 1 నాటికి జీతాలు వచ్చేలా చూడాలని ఆదేశించింది.

ఇదీ చదవండి :TDP LEADERS MEET GOVERNOR: 'కొడాలి నానిని మంత్రి వర్గం నుంచి తొలగించండి'

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

మహిళపై గ్యాంగ్​రేప్.. జుట్టు కత్తిరించి, చెప్పుల దండతో ఊరేగింపు..!

Last Updated : Jan 27, 2022, 4:26 PM IST

ABOUT THE AUTHOR

...view details