ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కలలు కన్నాడు... సాకారం కోసం కృషి చేసి... విజేతగా నిలిచాడు

మనం ఇక్కడ ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతుంటే.. సరిహదుల్లో వణికే చలిలో సైనికులు ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారు. తీవ్రవాదులు దేశంలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. తమ ప్రాణాలను లెక్కచేయకుండా దేశానికి, ప్రజలకు రక్షణగా నిలుస్తున్నారు. అలాంటి సాహసం, ధైర్యంతో కూడిన రక్షణ రంగంలో ఉద్యోగం చేయాలని ఆ యువకుడు చిన్నప్పటి నుంచి కలలుగన్నాడు. ఎంతో శ్రమించి ఆ కలను సాకారం చేసుకున్నాడు. 22 ఏళ్లకే లఫె్టినెంట్ ‌గా ఎంపికై నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచారు... విజయవాడకు చెందిన గరిమెళ్ల తరుణ్‌ చౌదరి. అతని గురించి ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

By

Published : Dec 27, 2020, 2:24 PM IST

Army lieutenant
విజేత

దేశంలో కీలకమైన రక్షణ రంగంలో సైనికాధికారిగా ఎంపికై తరుణ్‌ చౌదరి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఆయన తండ్రి జి.శివనాగేశ్వరరావు కూడా మాజీ సైనికుడే. తల్లి శ్యామల మొగల్రాజపురంలోని సిద్ధార్థ పబ్లిక్‌ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్నారు. శివనాగేశ్వరరావు 1983 నుంచి 2009 వరకు జమ్ము, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల సుబేదార్‌గా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేశారు. దీంతో తరుణ్‌ చదువు వివిధ రాష్ట్రాల్లో కొనసాగింది. ఒకటి, రెండు తరగతులు ఝాన్సీలో, మూడు, నాలుగు తరగతులు రాజస్థాన్‌లోని నాసిరాబాద్‌, ఐదో తరగతి విజయవాడ కేంద్రీయ విద్యాలయం, ఆరు నుంచి ఇంటర్మీడియట్‌ వరకు విజయనగరంలోని కోరుకొండ సైనిక పాఠశాలలో చదివారు. 2015లో యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్ష రాసి, నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ(ఎన్‌డీఏ)కి ఎంపికై బీఎస్సీ చదివారు. డెహ్రుడూన్‌లో ఇండియన్‌ మిలటరీ అకాడమీ(ఐ.ఎం.ఏ)లో కఠోర శిక్షణ పొందారు. 22 ఏళ్లకే మీరట్‌ కంటోన్మెంట్‌లో లఫె్టినెంట్‌ హోదాలో (సైనికాధికారిగా) ఇటీవలే పోస్టింగ్‌ పొందారు.

కఠోర సాధనతో..

సైనికాధికారి కావాలనే లక్ష్యానికి అనుగుణంగా తరుణ్‌ చిన్నప్పటి నుంచి అడుగులు వేశారు. కోరుకొండ సైనిక పాఠశాలలో ఆరో తరగతి నుంచే ప్రతి రోజూ ఉదయం 5.30 లేచి వ్యాయమాలు చేయడం, పరుగు తీయడం అలవాటుగా మార్చుకున్నారు. ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌, బ్యాడ్మింటన్‌ తదితర ఆటల పోటీల్లో చురుగ్గా పాల్గొనేవారు. పాఠశాల, జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచేవారు. ఇదే స్ఫూర్తి, పట్టుదలతో 2015 సంవత్సరంలో యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన సైనికాధికారి పోటీ పరీక్షలకు హాజరయ్యారు. అందులో సత్తా చాటి ఎన్‌డీఏకి ఎంపికయ్యారు. ఓ వైపు బీఎస్సీ చదువుతూనే సైనికాధికారిగా నిర్వర్తించాల్సిన విధులపై అధ్యాపకులు చెప్పిన పాఠ్యంశాలను శ్రద్ధగా విన్నారు. సైన్యంలో ఉన్నత హోదా కలిగిన లఫె్టినెంట్‌ కావడానికి శ్రమించారు. అనేక లిఖిత, మౌఖిక పరీక్షల్లో ప్రతిభ, నైపుణ్యాన్ని చాటి శిక్షణకు ఎంపికయ్యారు. ఫైరింగ్‌, గుర్రపు స్వారీ, విధినిర్వహణలో అనుసరించాల్సిన అంశాలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమాల్లో ఆసక్తిగా పాల్గొనేవారు. చివరకు తన కల సాకారం చేసుకుని నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

తండ్రి స్ఫూర్తితో..

తండ్రి శివనాగేశ్వరరావు, శిక్షణ కళాశాలలోని లెప్టినెంట్‌ హోదాలో ఉన్న ప్రిన్సిపల్‌, సీనియర్‌ విద్యార్థులనే స్ఫూర్తిగా తీసుకున్నాను. ఆసక్తి, పట్టుదలే నన్ను ముందుకు నడిపించాయి. రక్షణ శాఖలో కొలువు అంటే కుటుంబ సభ్యులను వదిలి దూరంగా ఉంటామనే అపోహను యువత వీడాలి. వారితో కలిసి ఉండేలా అవకాశాలు ఉన్నాయి. విధినిర్వహణలో ఎదో జరుగుతుందోమోననే భయాన్ని వీడాలి. ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని, దేశభక్తిని పెంపొందించుకోవాలి. కొద్ది రోజుల్లో లెప్టినెంట్‌గా బాధ్యతలు చేపడతాను. ఏ ఆపరేషన్‌ జరిగినా విజయవంతంగా నిర్వహించాలనేది లక్ష్యం. దేశభద్రత, ప్రజల రక్షణే మా విధి.

- తరుణ్‌ చౌదరి

అన్నిభాషల్లోనూ..

తరుణ్‌ వివిధ రాష్ట్రాల్లో చదవడంతో మాతృభాష తెలుగుతో పాటు హిందీ, తమిళం, ఆంగ్లం ఆనర్గళంగా మాట్లాడతారు. సైనికాధికారులకు శిక్షణ కార్యక్రమంలో వివిధ దేశాల భాషలను నేర్పుతారు. తరుణ్‌ మన మిత్రదేశమైన రష్యన్‌ భాష నేర్చుకున్నారు.

ఇదీ చదవండి: మార్కెట్​లోకి విడుదల కానున్న సన్నరకం వరి వంగడం

ABOUT THE AUTHOR

...view details