Retired Professor Haragopal : విద్యావ్యవస్థ బలోపేతంతోనే సామాజిక మార్పు ఉంటుందని హరగోపాల్ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ విశ్రాంత అధ్యాపకులు జి.హరగోపాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో విద్యావ్యవస్థ గతంలో మాదిరిగా లేదని అన్నారు. మహనీయుల అలోచనకు సంపూర్ణ వ్యతిరేకంగా విద్యావ్యవస్థ తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. కొనసీమ జిల్లా రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన జాతీయ సెమీనార్లో.. ముఖ్య అతిథిగా పొఫెసర్ జీ హరగోపాల్ సతిసమేతంగా పాల్గొన్నారు. పాలకొల్లు డీఎన్ఆర్ ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపల్ శోభారాణి ఆధ్వర్యంలో ఈ సెమినార్ను ఏర్పాటు చేశారు.
విశ్రాంత అద్యాపకులు హరగోపాల్ ప్రసంగిస్తూ.. దేశంలో సంపదతో పాటు జీడిపీ పెరుగుతున్న పాలకులు విద్యారంగ విధ్వంసానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అంబేడ్కర్ ఆలోచన విధానాలకు సంపూర్ణ వ్యతిరేకంగా.. విధ్వంసం జరుగుతోందని అన్నారు. అంబేడ్కర్ దృష్టిలో విద్య కీలకమైన ప్రధానంశామని వివరించారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు గ్రాంట్లు లేవని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు లేవని, ఆ దిశగా విద్యార్థులకు ప్రొత్సాహకాలు లేవన్నారు. యూనివర్సిటీ సిబ్బందికి సరైన సమయానికి జీతాలు కూడా అందటం లేదని తెలిపారు. గత సంవత్సరం ప్రభుత్వం విద్యకు కేటాయించిన బడ్జెట్లో కనీసం 40 శాతం కూడా ఖర్చు చేయలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు.. రాష్ట్ర ప్రభుత్వాల తీరు కూడా అలాగే ఉందని ఎద్దేవా చేశారు.