ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Driver Subramanyam: మా కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయి: సుబ్రహ్మణ్యం భార్య

By

Published : May 24, 2022, 3:29 PM IST

Updated : May 25, 2022, 5:43 AM IST

Subramanyam Murder Case: కాకినాడ జిల్లా గొల్లల మామిడాడలోని సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని దళిత సంఘాల నేతలు పరామర్శించారు. తన కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయని సుబ్రహ్మణ్యం భార్య అపర్ణ వాపోయారు. పథకం ప్రకారమే హత్యచేసిన ఎమ్మెల్సీ ఉదయభాస్కర్​ను పోలీసులు ఎందుకు రక్షిస్తున్నారని అఖిలపక్షం నేతలు ప్రశ్నించారు.

డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని పరామర్శించిన దళిత నాయకులు
Dalit leaders visit Subramaniam family

డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని పరామర్శించిన దళిత నాయకులు

Driver Subramaniam murder case: ఇటీవల హత్యకు గురైన వైకాపా ఎమ్మెల్సీ ఉదయభాస్కర్(​అనంతబాబు) మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని దళిత నాయకులు పరామర్శించారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలోని సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లి ఆ కుటుంబసభ్యులను ఓదార్చారు. తన కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయని సుబ్రహ్మణ్యం భార్య అపర్ణ వాపోయారు. ఎమ్మెల్సీ అనంతబాబును వైకాపా నుంచి బర్తరఫ్‌ చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. సుబ్రహ్మణ్యం కేసును సీబీఐకి అప్పగించాలని.. ఎమ్మెల్సీ అనంతబాబులను తక్షణమే బర్తరఫ్ చేయాలని ఎస్సీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు.

దళిత యువకుడిని హత్యచేసిన అనంతబాబుపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండు చేశారు. పెదపూడి మండలం జి.మామిడాడలో సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను అఖిలపక్ష నాయకులతో కలిసి ఆయన మంగళవారం పరామర్శించారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ.. కుటుంబాన్ని పోషించే యువకుడిని కిరాతకంగా చంపడం దారుణమన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండు చేశారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో జూన్‌ 2న సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులతో గవర్నర్‌ను కలుస్తామన్నారు. తెదేపా నాయకుడు, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ.. వైకాపా పాలనలో దళితులపట్ల అరాచకాలు మితిమీరుతున్నాయని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ, పోలీసులపై తమకు నమ్మకం లేదని.. కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండు చేశారు. న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు, కాంగ్రెస్‌ నాయకుడు కె.వినయ్‌ కుమార్‌, రైతు సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య, దళిత హక్కుల పోరాట సమితి సభ్యుడు కె.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

మా కుటుంబానికి రక్షణ కావాలి:సుబ్రహ్మణ్యం భార్య అపర్ణ: ‘ఎమ్మెల్సీ అనంతబాబువల్ల మా కుటుంబానికి హాని ఉంది. ఆయనను బర్తరఫ్‌ చేసి కఠినంగా శిక్షించాలి. పోస్టుమార్టం సమయంలో పోలీసులు నన్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. నా చేతులపై కొట్టారు. అనంతబాబు బెయిలుపై బయటకు వచ్చి మా కుటుంబాన్ని చంపేస్తారనే భయం ఉంది. పోలీసులు మాకు న్యాయం చేస్తారనే నమ్మకం లేదు. మాకు రక్షణ కల్పించి కేసును సీబీఐకి అప్పగించి, అనంతబాబుకు ఉరిశిక్ష వేసేలా చర్యలు తీసుకోవాలి.’

భయపెడుతున్నారు: సుబ్రహ్మణ్యం తండ్రి సత్తిబాబు:‘ఎమ్మెల్సీ అనంతబాబు 19వ తేదీ అర్ధరాత్రి మా కుటుంబాన్ని తీవ్రంగా భయపెట్టారు. మా అబ్బాయి మృతి విషయంలో ఆయన చెప్పేదంతా కట్టుకథ. అనంతబాబు ఉండే అపార్టుమెంటులో నేను పదేళ్లు పని చేశాను. అపార్టుమెంటు గేటుకు, రోడ్డుకు చాలా దూరం ఉంటుంది. కారు నుంచి గేటువద్ద పడిపోయాడన్నది అబద్ధం.’
మా అమ్మను బెదిరించారు: సుబ్రహ్మణ్యం తమ్ముడు నవీన్‌: ‘ప్రమాదం జరిగిందని ఎమ్మెల్సీ అనంతబాబు చెప్పిన ప్రదేశానికి వెళ్లి చూస్తే అక్కడ ప్రమాదం జరిగిన ఆనవాళ్లేవీ లేవు. ప్రమాదానికి గురైన మోటారుబైకు ఏదని ఆయనను అడిగితే.. బండిని ఆటోలో పంపేశానన్నారు. తమ తల్లిని పక్కకు తీసుకెళ్లి ఖర్చులకు రూ.2లక్షలు ఇస్తానని చెబుతూ.. ‘చిన్నబ్బాయి కూడా ఉన్నాడు, ఆలోచించుకోండి’ అని బెదిరించారు.’

సీబీఐకి అప్పగించాలి: ముప్పాళ్ల
రాజమహేంద్రవరం నేరవార్తలు: ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ కారు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణ నిజాయతీగా జరగాలంటే సీబీఐకి అప్పగించాలని ఏపీ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు డిమాండ్‌ చేశారు. కాకినాడ ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు నిందితుడిని కాపాడేందుకు కృషి చేస్తున్నట్లు తెలుస్తోందని వ్యాఖ్యానించారు. దళిత, ప్రజాసంఘాల ఉద్యమాల తర్వాతే పోలీసుల్లో కదలిక వచ్చిందనే విషయం అందరికీ తెలుసన్నారు. ఈ కేసులో స్థానిక పోలీసులు విచారణ జరిపితే నిందితులు తప్పించుకోవడం ఖాయమని, వెంటనే కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండు చేశారు.

All Parties on Subramanyam Murder Case: పక్కా పథకం ప్రకారమే డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను ఎమ్మెల్సీ అనంతబాబు హత్యచేస్తే.. పోలీసులు ఎందుకు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నరని అఖిలపక్షం నేతలు ప్రశ్నించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని వైకాపా మినహా ఇతర పార్టీల నేతలు కాకినాడ కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. ఈ ఘటనపై జూన్‌ 2న చలో రాజ్‌భవన్‌ నిర్వహిస్తామని వెల్లడించారు.

వాచ్​మెన్​ ఏమన్నారంటే..?: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో మరో ట్విస్ట్ ఏర్పడింది. హత్యకు గురైన అపార్టుమెంట్‌ వద్ద సీసీ కెమెరా దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈనెల 19న రాత్రి 10.30 సమయంలో అపార్టుమెంట్ వద్ద గొడవ జరగలేదని దృశ్యాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు పోలీసులు మాత్రం.. గొడవలో సుబ్రహ్మణ్యం కింద పడిపోవడం వల్లే చనిపోయాడని చెబుతున్నారు. రాత్రి 12 గంటలకు అనంతబాబు హడావుడిగా భార్యతో తిరిగి వచ్చినట్లు దృశ్యాలు రికార్డయ్యాయి. మళ్లీ ఒంటిగంటకు తిరిగి వెళ్లిపోయినట్లు సీసీ కెమెరా దృశ్యాలు ఉన్నాయి.

మరోవైపు సుబ్రహ్మణ్యం మృతి చెందాడని చెబుతున్న అపార్ట్​మెంట్​ వద్ద వాచ్​మెన్​గా పని చేస్తున్న శ్రీను.. అసలు గొడవే జరగలేదని చెబుతుండటం అశ్చర్యానికి గురి చేస్తోంది. అనంతబాబు మూడో అంతస్తులో ఉండేవారని అపార్టుమెంట్‌ వాచ్‌మెన్‌ శ్రీను తెలిపారు. చనిపోయిన సుబ్రహ్మణ్యంకు తాను బాబాయి అవుతానని చెప్పారు. పుట్టినరోజు వేడుకలు అపార్ట్​మెంట్​ వద్ద జరగలేదని స్పష్టం చేశారు. ఎస్పీ చెప్పినట్టు ఇక్కడ ఎలాంటి గొడవ జరగలేదని.. ప్రమాదంలో చనిపోయాడని సుబ్రహ్మణ్యం తండ్రి నాకు ఫోన్ చేసి చెప్పారని వివరించారు. అదే సమయంలో అనంతబాబు కంగారుగా వెళ్లిపోయారని డ్రైవర్​ చెప్పుకొచ్చారు. అనంతబాబుతో ఆయన భార్య కూడా ఉన్నారని తెలిపారు. సాయంత్రం 4 గంటలకు భార్యతో వెళ్లి అర్ధరాత్రి వచ్చారని చెప్పారు. పోలీసులు ఎవరూ తమ దగ్గరకు రాలేదని అపార్టుమెంట్‌ వాచ్‌మెన్‌ శ్రీను స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

Last Updated : May 25, 2022, 5:43 AM IST

ABOUT THE AUTHOR

...view details