ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"దళితులపై దమనకాండ".. సామాన్యుడి నుంచి శాసనసభ్యుడి వరకూ బాధితులే

YCP LEADERS ATTACKS ON SC PEPOLES IN AP : రాష్ట్రంలో ఎస్సీలపై దౌర్జన్యాలు పెచ్చుమీరాయి. ప్రశ్నించడమే పాపమన్నట్లు దాడులకు పాల్పడుతున్నారు. కొన్ని చోట్ల హత్యలకు పాల్పడుతుండగా.. మరికొన్ని చోట్ల ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అధికారపార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆ వర్గం ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏకంగా ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు పెడుతున్న విచిత్ర పరిస్థితులు రాష్ట్రంలో నెలకొంటున్నాయి.

By

Published : Mar 28, 2023, 9:43 AM IST

YCP LEADERS ATTACKS ON SC PEPOLES IN AP
YCP LEADERS ATTACKS ON SC PEPOLES IN AP

YCP LEADERS ATTACKS ON SC PEPOLES IN AP : ఓ ఎస్సీ ఎమ్మెల్యేనే ఆంధ్రప్రదేశ్​లో అడుగు పెట్టాలంటే భయపడుతోందంటే ఇక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో.. ఇక్కడ ఆ వర్గాలు ఎలాంటి భయాలు ఎదుర్కొంటున్నారో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఎస్సీలపై దమన కొండ హద్దుల్లేకుండా సాగుతోంది. అణచివేత, హత్యలు, నేరాలు, దౌర్జన్యాలు, దాడులు, అక్రమ కేసులు బనాయింపు, వేధింపులు పెద్ద సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. ఎస్సీలపై కక్ష కట్టారా అన్నట్లు సాగుతున్న ఈ ఘటనల్లో అత్యధిక శాతానికి అధికార వైసీపీ నాయకులే బాధ్యులు. వారే నిందితులు కూడా. అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం పోలీసులు సైతం వారికి సహకరిస్తున్నారు. ఇవన్నీ భరించలేక బాధితులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తీవ్ర మానసిక క్షోభతో ప్రాణాలు విడుస్తున్నారు.

ఎస్సీ డ్రైవర్​ను చంపి.. డోర్​ డెలివరీ: వైసీపీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్సీ అనంతబాబు.. అతని వద్ద డ్రైవర్‌గా పని చేసే ఎస్సీ యువకుడు సుబ్రమణ్యాన్ని చంపేసి.. ఆ మృతదేహాన్ని దర్జాగా డోర్ డెలివరీ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అధికార పార్టీ నాయకుల ఇసుక అక్రమాలపై ప్రశ్నించిన పాపానికి ఎస్సీ యువకుడు ఇండుగుమల్లి వరప్రసాద్‌కు పోలీసు స్టేషన్లో శిరోముండనం చేశారు. కొవిడ్​ విజృంభిస్తున్న వేళ మాస్కులు లేకుండా వైద్యం ఎలా చేయాలని అడిగినందకు.. డాక్టర్​ సుధాకర్‌ను సస్పెండ్ చేశారు. చొక్కా విప్పి.. చేతులు వెనక్కి విరిచి, తాళ్లతో కట్టి లాఠీలతో కొట్టారు. మానసిక స్థితి బాగోలేదంటూ పిచ్చాసుపత్రిలో చేర్పించారు.

తీవ్ర మానసిక క్షోభకు గురైన ఆయన చివరికి ప్రాణాలొదిలారు. మాస్కు పెట్టుకోకుండా బయట తిరుగుతున్నారంటూ ఎస్సీ యువకుడు కిరణ్ కుమార్‌ను లాఠీలతో చితకబాది అతని మరణానికి కారణమయ్యారు. వైసీపీ ప్రభుత్వ తప్పిదాల్ని ప్రశ్నించినందుకు మాజీ న్యాయాధికారి రామకృష్ణపై చిత్తూరు జిల్లాకు చెందిన ఎస్సీ అక్రమ కేసులు బనాయించి తీవ్రంగా హింసించారు. అదే జిల్లాలో ఎస్సీ వైద్యురాలు అనితారాణిని వేధించి, అసభ్యపదజాలంతో దూషించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎస్సీలపై సాగుతున్న దమనకాండకు ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే.

పోలీసుల అండతో ఎస్సీలపై చిత్రహింసలు: కొంతమంది అధికార పార్టీ నాయకులు పోలీసులను అడ్డుపెట్టుకుని ఎస్సీలను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. వైసీపీ నాయకుల పైరవీలతో పోస్టింగులు దక్కించుకుని.. కీలకమైన స్థానాల్లో కొనసాగుతున్న కొందరు పోలీసు అధికారులూ ఎస్సీలపై ఆరాచకాలకు తెగబడుతున్నారు. ఆ అవమాన భారాన్ని భరించలేక పలువురు ఎస్సీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పంచాయతీ ఉపాధ్యక్షుడు పుప్పాల సత్యనారాయణ, ఆయన సోదరుడు గంగాధర్‌, ఎస్సై కిరణ్‌కుమార్‌ వేధింపులు భరించలేకపోతున్నానంటూ ఎస్సీ ఆక్వారైతు బూరగ నాగేశ్వరరావు లేఖ రాసి గత సంవత్సరం అక్టోబర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.

  • నాగేశ్వరరావు వద్ద పని చేసే సురేశ్‌.. పక్షులను బెదరగొట్టేందుకు నాటు తుపాకీ పేల్చుతూ గాయపడ్డాడు. అతనికి 10 లక్షలు చెల్లించాలంటూ సత్యనారాయణ, గంగాధర్ బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీస్​స్టేషన్‌కు పిలిపించి కొట్టారని కేసు నమోదైంది. పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన ఎస్సీ యువకుడు అలపు గిరీష్‌బాబు ఆత్మహత్య చేసుకున్నాడు. మున్సిపల్ ఎన్నికల్లో గిరీష్ అన్నయ్య ప్రవీణ్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో ఓ వైసీపీ నాయకుడు ఆ కుటుంబాన్ని లక్ష్యంగా చేసి ఓ కేసు పెట్టించారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో పోలీసులు వేధించారు.
  • నెల్లూరు జిల్లా కందమూరుకు చెందిన ఎస్సీ యువకుడు ఉదయగిరి నారాయణ గత సంవత్సరం జులైలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన్ను పోలీసులు చిత్రహింసలు పెట్టారని.. అది బయటపడకుండా ఆత్మహత్యగా చిత్రీకరించారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడి కుల సంప్రదాయాలకు భిన్నంగా పోలీసులు బలవంతంగా అంత్యక్రియలు చేయించారు. నెల్లూరు జిల్లా కావలోలి ఎస్సీ యువకుడు పూడి శ్రీహర్ష ఆత్మహత్యకు యత్నించగా స్థానికులు కాపాడారు. వైసీపీ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తన రేషన్‌ దుకాణాన్ని తొలగించారని.. కాళ్లుపట్టుకుని వేడుకున్నా కనికరించలేదని.. తన చావుకు ఎమ్మెల్యే, పోలీసులే కారణమంటూ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.
  • కావలికే చెందిన ఎస్సీ యువకుడు దుగ్గిరాల కరుణాకర్‌ 2022 ఆగస్టులో ఆత్మహత్య చేసుకున్నాడు. 20 లక్షల అప్పు చేసి చెరువులో చేపలు పెంచితే.. వైసీపీ నాయకుడు, శ్రీశైలం ట్రస్టు బోర్డు సభ్యుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, ఆయన అనుచరుడు సురేష్ రెడ్డి అడ్డుకుంటున్నారంటూ ఎస్పీకి లేఖ రాసి మరీ తనువు చాలించాడు. తల్లితో కలిసి జగదీశ్వర్ రెడ్డి ఇంటి కెళ్లి ఆయన కాళ్లు పట్టుకున్నా కనికరించలేదని లేఖలో వాపోయాడు.
  • శ్రీకాకుళం జిల్లా బూర్జ పోలీసు స్టేషన్‌లో ఎస్సీ యువకుడు మురపాక మహేష్ అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. ఇంటిని కూల్చివేశారంటూ అనంతపురం జిల్లా కుందిర్పి మండలం నిజవల్లికి చెందిన హనుమంతరాయుడు, అనితా లక్ష్మీ దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. తమ ఆధిపత్యాన్ని ప్రశ్నించినా, అడొస్తున్నారని భావించినా, అక్రమాలపై ఫిర్యాదు చేసినా, ఆహాన్ని దెబ్బతీసినా ఎస్సీలను తీసేస్తున్నారు. ఇలాంటి ఘటనల్లో పోలీసులు కఠినంగా వ్యవహరించట్లేదు. దీంతో కొన్ని రోజులు జైల్లో ఉండి బయటకొచ్చేస్తామని, తాము ఎస్సీలను చంపినా తమను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాతో అధికార పార్టీ నాయకులు రెచ్చిపోతున్నార
  • సీఎం జగన్ సొంత జిల్లాలోనే కడప బహుళార్థ పశువైద్యశాలలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎస్సీ అధికారి చిన్న అచ్చెన్నను ఇలాగే చంపేశారు. అచ్చెన్న కనిపించట్లేదంటూ అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఉపాధి హామీ పథకంలో అధికార పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ అధికారులకు ఫిర్యాదు చేసిన ప్రకాశం జిల్లా C.S.పురం మండలం ఏకునాంపురంకు చెందిన దాసరి వెంకటరమణయ్యను చంపేశారు. గుంటూరు జిల్లా పొన్నూరులో అంజి బర్నబాస్‌ను కొందరు అపహరించి హత్య చేశారు. దీని వెనుక వైసీపీ నాయకుల ప్రమేయం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి.
  • అనకాపల్లి జిల్లా పీఎల్​పురం ఎస్సీ కాలనీకి చెందిన వడ్లమూరి నాగేంద్రను కాళ్లు, చేతులూ కట్టేసి బావిలో పడేసి హత్య చేశారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం శృంగవృక్షంలో గ్రామదేవతల జాతర సందర్భంగా చోటుచేసుకున్న గొడవల్లో ఎస్సీలపై మరో వర్గం కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడింది. ఈ ఘటనలో నడిపల్లి రాము ప్రాణాలు కోల్పోయాడు. గుంటూరులో టీడీపీ కార్యకర్త పొత్తూరి వెంకట నారాయణపై వైసీపీ కార్యకర్తలు హత్యాయత్నం చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎస్సీ కౌన్సిలర్ మల్లికార్జున ఇంట్లోకి చొరబడి అతని తల్లితోపాటు సోదిరిపైనా దాడి చేశారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్‌ చేయకుండా కేవలం నోటీసులిచ్చి వదిలేశారు.

దళిత యువకుడు వీధి సుబ్రమణ్యం హత్య కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబు జైలు నుంచి బెయిలుపై విడుదలయ్యాక వైసీపీ శ్రేణులే భారీ ర్యాలీతో బ్రహ్మరథం పట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగు పాల్పడ్డారంటూ ఎస్సీ మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని వైసీపీ తాజాగా సస్పెండ్ చేసింది. ఆ వెంటనే వైసీపీ శ్రేణులు ఆమె కార్యాలయంపై దాడికి పాల్పడ్డాయి. సామాజిక మాధ్యమాల్లో ఆమెను, ఆమె కుటుంబసభ్యుల్ని కించపరుస్తూ, అసభ్యకరంగా చిత్రీకరిస్తూ విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. వైసీపీ మద్దతున్న నాయకులు ఎస్సీలపై ఎంతటి నేరానికి పాల్పడినా వారిని ఉపేక్షిస్తున్నారు.

వైసీపీకి ఎదురు తిరిగితే ఎవరైనా సరే డోంట్​ కేర్​: వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే చాలు ఆ నాయకులు ఎస్సీలైనా వారిపై దాడికి పాల్పడుతున్నారు.. అని చెప్పడానికి ఈ రెండు ఘటనలే నిదర్శనం. రాష్ట్రంలో పలు సంఘటనల్లో బాదితులైన ఎస్సీలపైనే పోలీసులు రివర్స్‌ కేసులు పెడుతున్నారు. ఎస్సీలు బాధితులైన కొన్ని ఘటనల్లో అసలు అట్రాసిటీ సెక్షన్లే వర్తింపజేయట్లేదు. మరోవైపు ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు బనాయిస్తుండటం అంతకంటే దారుణం. దశాబ్దాల క్రితం ప్రభుత్వం తమకు కేటాయించిన అసైన్డ్‌ భూములను ప్రభుత్వమే లాక్కుంటుంటే ప్రశ్నించిన ఎస్సీలపైనే కేసులు పెడుతున్నారు. అట్రాసిటీ చట్టాన్ని కక్షసాధించేందుకు, రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులకు వైసీపీ వినియోగిస్తోంది. తన పేరిట తప్పుడు పత్రాలు సృష్టించి, ధాన్యం కొనుగోళ్లలో కొందరు అక్రమాలకు పాల్పడ్డారంటూ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన ఎస్సీ రైతు గాలి జూపాల్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. తిరిగి అతని పైనే కేసు పెట్టారు.

అక్రమాల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన తర్వాత అతనిపై వేధింపులు మరింత పెరిగాయి. మూడు రాజధానులకు మద్దతుగా చేపట్టిన కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న వారిని అడ్డుకుని కులం పేరుతో దూషించారంటూ మంగళగిరి గ్రామీణ పోలీసులు 2020 అక్టోబరులో 11 మంది అమరావతి రైతులపై అట్రాసిటీ కేసు పెట్టారు. వీరులో అయిదుగురు ఎస్సీలు ఉన్నా....కేసుపెట్టి 18 రోజులు జైల్లో ఉంచారు. కులం పేరుతో దూషించినట్లు తాను ఫిర్యాదే ఇవ్వలేదని ఫిర్యాదుదారే న్యాయస్థానంలో అఫిడవిట్ వేసినా పోలీసులు పట్టించుకోలేదు. పులివెందులలో హత్యాచారానికి గురైన ఎస్సీ మహిళా కుటుంబానికి న్యాయం చేయాలంటూ డీఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన టీడీపీ నేతలు వంగలపూడి అనిత, M.S.రాజుపై అట్రాసిటీ కేసు పెట్టారు. వీరిద్దరూ ఎస్సీలే అయినా వీరిపైనా అట్రాసిటీ కేసు పెట్టారు.

అనంతపురం జిల్లా గుత్తిలో ఎస్సీ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ గోపీనాథ్‌పై వైసీపీ నాయకులు దాడి చేసి దుర్భాషలాడారు. విశాఖలో ఎస్సీ యువకుడు వర్రి శ్రీకాంత్‌పై సెల్‌ఫోన్ దొంగతనం అభియోగం మోపి శిరోముండనం చేశారు. అనంతపురం జిల్లా వెలిగొండలో కుళాయి నీరు రాలేదని ప్రశ్నించిన చిన్న యన్నప్ప కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం పాతచెదుళ్లలో రమేష్ కుటుంబంపై వైసీపీ నాయకులు వీరంగం సృష్టించారు.

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడు వెంకటేశ్వరనగర్ దళిత కాలనీ వాసులపై యువకులు కర్రలు, ఆయుధాలతో దాడి చేశారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బోయకొండ లో వైసీపీ నాయకులు, వారి అనుచరులు ఎస్సీ మహిళల జుట్టు పట్టుకుని ఈడ్చేశారు. కాళ్లతో తన్ని, కర్ర లతో కొట్టారు. అనంతపురం జిల్లా లత్తవరంలో ఎస్సీ రైతు కుటుంబంపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. తమ భూమిలో పట్టాలు పంపిణీ ఎలా చేస్తారని ప్రశ్నించినందుకు దాడి చేశారు.

కలెక్టర్​ ఆదేశించిన అధికారుల్లో లేని చలనం: బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెంలోని తన ఇంటికెళ్లే మార్గంలో మట్టి గుట్టలు పోసి నడవటానికి వీలులేకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎస్సీ ఉపాధ్యాయిని గొట్టిపాటి సుధారాణి ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందనలో ఆమె ఫిర్యాదు చేశారు. తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ డీపీవోను ఆదేశించినా.. సమస్య పరిష్కారం కాలేదు. తన ఇంటికి వెళ్లే మార్గంలో మంచాలు వేసుకుని రాకపోకలకు ఇబ్బంది పెడుతున్నారని ఆమె ఆరోపించారు. ఇప్పుడు ఏకంగా లారీతో మట్టి తెప్పించి గుట్టలుగా పోశారన్నారు. తన ఇంట్లోకి వెళ్లే మార్గం లేక మూడురోజుల పాటు వేరే వాళ్ల ఇంట్లో తలదాచుకున్నట్లు సుధారాణి తెలిపారు. కలెక్టర్‌ ఆదేశించినా అధికారుల్లో చలనం లేదని ఆమె వాపోయారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details