YSRCP Govt Removed 4 Lakhs Pensions in AP: ఎక్కడ నెగ్గాలోకాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పోడు. ఇదీ ఓ సినిమా డైలాగ్. సీఎం జగన్ ఈ డైలాగ్ను రీమిక్స్ చేసేశారు. ఎప్పుడు పెంచాలో కాదు. ఎలా తగ్గించాలో తెలిసినోడే మోసగాడని తన చర్యల ద్వారా చెప్పకనే చెప్పారు. పింఛన్ పెంచుకుంటూ పోతానని పాదయాత్రలో నమ్మబలికిన జగన్ గద్దెనెక్కాక లబ్దిదారుల సంఖ్యను కత్తిరించుకుంటూ వెళ్లారు. వందో, వెయ్యోకాదు ఏకంగా 4 లక్షల పింఛన్లను పీకేశాడు కోతల రాయుడు జగన్. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన వివిధ వర్గాలకు ఇచ్చిన పింఛన్లను ఆపేసి, కొత్త దరఖాస్తులను పెండింగ్లో పెట్టి రివర్స్లో సంక్షేమానికి తానే బొడ్డుకోసి పేరుపెట్టినట్లు ఫోజులు కొడుతున్నారు.
బటన్లు నొక్కుతున్నాం, లెక్కలేనంత సంక్షేమం ఇస్తున్నాం, బస్సులకొద్దీ జనాల్ని తరలించి, బారికేడ్ల మధ్య కుక్కి, వారికి జగన్ చెప్పే నిర్బంధ ప్రసంగం ఇదే. మరి ఏనాడైనా ఆయన నొక్కిన స్టాప్ బటన్ల గురించి చెప్పారా. దీనిపై ఆయనే కాదు, ప్రభుత్వ అధికారులెవరూ నోరు తెరవరు. ఇప్పటిదాకా సామాజిక పింఛన్లు ఎన్ని తీసేశారని, సమాచార హక్కు చట్టం ద్వారా అడిగితే, సెర్ప్ అధికారుల నుంచి దాటవేత ధోరణి తప్ప సరైన సమాధానం రాలేదు.
వృద్ధులను, వికలాంగులను చేయి పట్టుకుని నడిపిస్తామన్న జగన్ - రోడ్డున పడేశారు
లబ్దిదారుల నిరీక్షణే తప్ప మంజూరు లేదు : పింఛన్లు తీసేయకపోతే ఈ దాపరికం ఎందుకు. అదే జగన్ మార్క్ అసలు సిసలు సంక్షేమం. జగన్ ఏలుబడిలో దాదాపు 4 లక్షలకుపైనే పింఛన్లు తీసేశారని అంచనా. ఇకకొత్త పింఛన్లు జగన్ దయ లబ్దిదారుల ప్రాప్తం. జనవరి నెలలో దాదాపుగా లక్ష మంది దరఖాస్తుదారులకు పింఛను మంజూరు చేయకుండా తొక్కిపెట్టారు. 50 వేలమంది హెచ్ఐవీ రోగులు రెండేళ్లుగా పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారు. దాదాపు లక్ష మంది అభయహస్తం పింఛన్ల కోసం ఏడాదిగా నిరీక్షిస్తున్నారు. కానీ మంజూరు చేసేందుకు జగన్కు మనసొప్పడంలేదు.
పింఛనర్లకు జగన్ చేసిన వంచెన అంతా ఇంతా కాదు. ఏకంగా ఆరు దశల నిబంధనలు తెచ్చిపెట్టారు. తెలుగుదేశం హయాంలో ఒకే కుటుంబంలో రేషన్కార్డుపై ఇద్దరు పింఛనుదారులున్నా ఇద్దరికీ పింఛన్ అందజేశారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇలా కేటగిరీ పింఛన్లకూ పరిమితి పెట్టలేదు. కానీ, జగన్ ప్రభుత్వంలో కుటుంబానికి ఒకటే పింఛన్ విధానం తీసుకువచ్చారు. ఒకే బియ్యంకార్డుపై రెండు పింఛన్లు ఉండకూడదనే, ఉత్తర్వు తెరపైకి తీసుకువచ్చి వేల సంఖ్యలో పింఛన్లు తొలగించారు. ఇలా మిగుల్చుకున్న జగన్ పింఛన్ పెంచారా. పింఛనర్ల సంఖ్యను తుంచారా.
సామాజిక పింఛన్లు నిలిపేస్తే రహదారులను అద్దంలా తీర్చిదిద్దొచ్చు : వైసీపీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి
ఎప్పటి పింఛన్ అప్పుడే తీసుకోవాలి లేకపోతే మర్చిపోవాలి: ఏ నెల పింఛను ఆ నెలే తీసుకోవాలనేది పింఛనర్ల మెడకు జగన్ చుట్టిన మరో నిబంధన. చంద్రబాబు హయాంలో ఏ కారణాలతోనైనా, ఒక నెల పింఛన్ తీసుకోకపోతే, ఆ మరుసటి నెలలో పాతది కూడా కలిపి ఇచ్చేవారు. రెండు నెలలు వరుసగా తీసుకోలేకపోయినా, మూడు నెలలది కలిపి ఒకేసారి ఆ తర్వాతి నెలలో అందించేవారు. కానీ జగన్ రాజ్యంలో ఆరునూరైనా ఏ నెలది ఆనెలే తీసుకోవాలి. ఈనెల పింఛన్ తీసుకోలేకపోతే, ఆ తర్వాతి నెలో దాని గురించి మర్చిపోవడమే.
పింఛన్ పైసలనూ మిగుల్చుకుంటున్నారు : ఒకనెల తీసుకపోతే మరుసటి నెలలో ఒక నెల పింఛనే ఇస్తారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారిని వలస జీవులుగా పేర్కొంటూ ఇంకొన్ని పింఛన్లు తొలగించారు. ఇలా ఎక్కడికక్కడ కోతలు వేసి వందశాతం పింఛను పంపిణీ చేస్తున్నట్లు లెక్కలు చూపించుకుంటున్నారు. కానీ, ప్రతి నెలా ఎంతో కొంత పింఛను మొత్తాన్ని మిగుల్చుకుంటున్నారు.
ONLINE CHEATING IN KANIGIRI : ఈడబ్లూటీ యాప్తో వైసీపీ ఆన్లైన్ మోసం.. పింఛన్లు సైతం స్వాహా..