YSRCP Government Not Sanction houses to Tribals: జగన్ తాను అండగా ఉంటానంటే నమ్మి గెలిపించిన గిరిజనులు ప్రస్తుతం ఆయనను నమ్మె స్థితిలో లేరు. తమ నియోజకవర్గాల్లో ఆయన పార్టీనే గెలిపించారు. అధికారంలోకి వచ్చాక అందర్నీ మోసం చేసినట్లే వారినీ ముంచేశారు జగన్. తాను మాత్రం ప్యాలెస్ల మీద ప్యాలెస్లు కట్టుకున్న జగన్, గిరిజనులకు గూడు మాత్రం కల్పించలేకపోయారు.
లక్షల్లో స్థలాలిచ్చాం. ఇళ్లు కట్టిస్తున్నామని ప్రచారం చేసుకోవడం తప్ప అత్యంత వెనుకబడిన వర్గాలైన ఆదివాసీలు రాష్ట్రంలో ఉన్నారని, వారికి సొంతగూడు కల్పించాలని ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదు. గత కొన్నేళ్లుగా గిరిజన ప్రాంత నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీనీ గెలిపిస్తున్నా ఆ విశ్వాసాన్నీ చూపించలేదు. సొంత గూడు కల్పించాలని నాలుగేళ్లుగా మొత్తుకుంటున్నా కనీస స్పందన లేదు.
సమస్యలకు నిలయాలుగా జగనన్న కాలనీలు - కనీస వసతుల్లేకుండా ఎలా ఉండాలంటూ లబ్ధిదారుల ఆగ్రహం
రాష్ట్రంలోని 11 జిల్లాల పరిధిలోని 52 వేల మంది పీవీటీజీలకు పక్కా గృహమే లేదని కేంద్రం తేల్చింది. రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్నంగా సర్వే నిర్వహిస్తే ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి పీఠమెక్కిన తర్వాత జగన్ సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్క ఇల్లూ మంజూరు చేయలేదు. పైగా గిరిజనులను ఉద్ధరించేసినట్టు డాంబికాలు మాత్రం పలుకుతున్నారు.
"ఆదివాసీ ప్రాంతాల్లో పక్కా ఇళ్లు లేక వారు పూరి గుడిసెల్లో, పెంకుటిళ్లలో, రేకుల షెడ్లలో జీవనం సాగిస్తున్నారు. సరైన ఇంటి వసతి లేక రాత్రి పూట నిద్రిస్తున్న సమయాల్లో పాముకాటుకు గురై మరణించిన ఘటనలున్నాయి." -రాధాకృష్ణ, సీపీఎం నాయకుడు
అట్టహాసంగా ఇళ్లకు శంకుస్థాపన - పూర్తి చేయకుండానే మధ్యలో నిలిపివేత
జిల్లాల విభజన వేళ గిరిజనులకు ప్రత్యేకంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కేటాయించినట్టు గొప్పలు చెప్పారు. కానీ, నాలుగున్నరేళ్లుగా అక్కడ సొంత ఇల్లు లేని అభాగ్యులకు ఒక్క ఇల్లూ మంజూరు చేయలేదు. ఈ జిల్లా పరిధిలో పాడేరు, అరకు, రంపచోడవరం నియోజకవర్గాలు ఉన్నాయి. 6 నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 17 వేల ఇళ్లు మంజూరు చేసేంత వరకు వారి గోడు వినేవారే లేరు. ఈ పథకం కింద మంజూరైంది కూడా కొంతమందికే. ఇంకా అక్కడ దాదాపుగా 32 వేలమంది సొంతింటి కోసం ఇప్పటికీ ఎదురుచూస్తున్నారంటే ఆదివాసీలపై జగన్కు ఎంత మమకారం ఉందో అర్థమవుతోంది.
ప్రతికూల పరిస్థితుల మధ్యే ఆదివాసీలు జీవనం సాగిస్తుంటారు. వాటిని గుర్తించిన గత టీడీపీ ప్రభుత్వం సొంతిల్లు కట్టుకునేందుకు వీరికి అదనపు సాయాన్ని మంజూరు చేసింది. అప్పట్లో గ్రామీణ పేదల కోసం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాన్ని అమలు చేసి ఇంటి నిర్మాణం కోసం ఎస్టీలకు అదనపు ఆర్థిక సాయాన్ని అందించింది. ఇందులోనూ ఆదివాసీలకు మరింత తోడ్పాటునిచ్చింది.
టిడ్కో లబ్ధిదారులకు షాక్ ఇస్తున్న బ్యాంకర్లు - ఇళ్లు అప్పగించకముందే రుణ వాయిదా నోటీసులు
మైదాన ప్రాంతాల్లో నివసించే ఎస్టీలకు 2 లక్షలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే వారికి 2.25 లక్షలు, ఆదివాసీలకు 2.5 లక్షల సాయాన్ని అందించింది. సాధారణ వర్గాలకు అందే సాయంతో పోలిస్తే లక్ష రూపాయలు అదనంగా ఇచ్చింది. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో గ్రామీణుల కోసం గృహనిర్మాణ పథకాన్నే అమలు చేయలేదు. ప్రస్తుతం అమలయ్యే పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వానివే.