ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాడు ఊదర గొట్టారు - నేడు ఊసెత్తడం లేదు - hospitals problams

YSRCP government Neglects hospitals construction: నాడు -నేడు పేరిటి ప్రభుత్వాసుపత్రులు నిర్మిస్తున్నట్లు అప్పట్లో ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయలేదు. అరకొరగా ప్రారంభించినా మధ్యలోనే పనులను వదిలేశారు. చచ్చీచెడీ ఒకటీ రెండు ఆసుపత్రులను పూర్తి చేసినా, ఆ ఆసుపత్రులు పూర్తి కాలే పోవడంతో రేకుల షెడ్డుల్లోనే రోగులకు వైద్యసేవలు చేయాల్సిన పరిస్థితులపై ప్రత్యేక కథనం.

YSRCP government Neglects hospitals construction
YSRCP government Neglects hospitals construction

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 2, 2024, 10:05 AM IST

YSRCP government Neglects hospitals construction: నాడు-నేడు పేరిట ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలు పూర్తిగా మార్చేస్తున్నామంటూ ఊదరగొట్టారు. అత్యాధునిక సౌకర్యాలు, కార్పొరేట్ వైద్యమంటూ ఆకాశానికెత్తేశారు. కానీ నాలుగున్నరేళ్లు ఎదురు చూసినా ఏ ఒక్క దవాఖానా పేదలకు అందుబాటులోకి రాలేదు. కొన్నిచోట్ల పనులే ప్రారంభించ లేదు, కొన్నిచోట్ల అరకొరగా చేసి మధ్యలోనే వదిలేశారు. చచ్చీచెడీ ఒకటీ, రెండు పూర్తి చేసినా, ఆ ఆస్పత్రులను ప్రారంభించడం లేదు. అందుబాటులో కొత్త భవనాలు ఉన్నా రేకుల షెడ్డుల్లోనే రోగులకు చికిత్స అందించాల్సిన దుస్థితి.

ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలు సమూలంగా మార్చేస్తున్నాం, పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందిస్తాం, గతంలో, ప్రస్తుతం ఉన్న భవనాలు ఎలా ఉన్నాయో ఫొటోల ద్వారా ప్రదర్శిస్తామంటూ ముఖ్యమంత్రి జగన్ ఎక్కడికి వెళ్లినా ఊదరగొట్టేవారు. కానీ క్షే‌త్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఆస్పత్రుల నిర్మాణాలు ఏళ్లతరబడి సాగుతున్నాయి. కొద్దోగొప్ప పూర్తయిన భవనాలను వినియోగించడం లేదు. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారులు వాటిని అప్పగించడం లేదని తెలుస్తోంది. విద్యుత్ సరఫరా కల్పించకపోవడం వల్ల వైద్య సేవలు అందుబాటులోకి రానికి కొన్నయితే..అధికారులూ, నాయకుల అలసత్వంతో ఆగిపోయినవి మరికొన్ని..ఇరుకైన అద్దె గదుల్లో, పాత భవనాల్లోనే వైద్యులు రోగులకు చికిత్స అందిస్తున్నారు. రోగ నిర్థారణ పరీక్షలు చేయలేక, పారా మెడికల్‌ సిబ్బంది అవస్థలు పడుతున్నారు.

శ్రీకాకుళం జిల్లా లావేరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణం పూర్తయినప్పటికీ, సేవలు మాత్రం ప్రారంభం కాలేదు. నాడు-నేడు కింద 1.77 కోట్ల వ్యయంతో 2020 డిసెంబరులో శంకుస్థాపన జరగ్గా.. అతికష్టంపై మూడేళ్లకు పూర్తిచేశారు. గుత్తేదారుకు ఇంకా 70లక్షలు చెల్లించాల్సి ఉండటంతో భవనం అప్పగించడంలో తీవ్రజాప్యం జరుగుతోంది. దీంతో పాత భవనంలోని చిన్న గదిలోనే వైద్యసేవలు అందిస్తున్నారు. ఒకే గదిలోనే 14 మంది వైద్య ఆరోగ్య సిబ్బంది పనిచేస్తున్నారు. అక్కడే మందులు ఇవ్వడం, రోగనిర్థారణ పరీక్షలు సైతం నిర్వహిస్తున్నారు. వర్షం వస్తే దీని లోపలకి నీరు ఊరుతుంది. దీనికి ఆనుకుని దుకాణాన్ని తలపించే రేకుల షెడ్డులో రోగులకు చికిత్స అందిస్తున్నారు. గోడలు కూడా లేక.. రైటింగ్‌ బ్యానర్లను అడ్డంగా పెట్టి.. గదిగా మార్చారు. మండలం పరిధిలోని 14 పంచాయతీలకు చెందిన సుమారు 35వేల మందికి ఈ రేకుల షెడ్డే ఆధారం. ఖరీదైన వైద్య పరికరాలు కాపాడలేకపోతున్నామని వైద్య సిబ్బంది వాపోతున్నారు.

Covid Hospitals: ఆ ఆసుపత్రుల్లో కొవిడ్ బాధితులకు 50 శాతం పడకలు

ఆస్పత్రుల దుస్థితిపై ప్రసార మాధ్యమాల్లో కథనాలు వచ్చినప్పుడు అధికారులు హడావుడి చేయడం, ఆ తర్వాత మర్చిపోవడం పరిపాటిగా మారింది. పల్నాడు జిల్లా విజయపురిసౌత్‌ కమ్యునిటీ ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేక చెట్టుకిందే సెలైన్ ఎక్కించడం, గాయలైన వారికి డ్రెస్సింగ్ చేయడం వంటివి ఆరుబయటే చేస్తున్నారు. దీనిపై గతేడాది నవంబర్ 4న ఈనాడులో కథనం రావడంతో అక్కడే నిర్మాణంలో ఉన్న ఆస్పత్రి భవనాన్ని పూర్తి చేసి డిసెంబరులో ప్రారంభిస్తామని అధికారులు ప్రకటించారు. కానీ ఇప్పటికీ చెట్టు కిందనే వైద్యం అందిస్తున్నారు. కొత్త భవనంలో పనులు పూర్తికాకపోవడంతో ఇంకా అందుబాటులోకి రాలేదు.

నిర్మాణాలు పూర్తిగాక అందుబాటులోకి రాని ఆస్పత్రులు కొన్నయితే, పూర్తయినా మరికొన్ని ఆస్పత్రులు ప్రారంభానికి నోచుకోవడం లేదు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని ఆరిపాక, తవ్వవానిపాలెం ఉప ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణాలు పూర్తయినా ఇంకా ప్రారంభించలేదు. కర్నూలు జిల్లా లక్ష్మీపురంలో పట్టణ ఆరోగ్య కేంద్రం భవనాన్ని అతి కష్టంపై నిర్మించినప్పటికీ వైద్యసేవలు మాత్రం అందుబాటులోకి రాలేదు. ఓర్వకల్లు మండలం హుసేనాపురం పీహెచ్​సీ కేంద్రానికి అనుబంధంగా కొత్త నిర్మాణాన్ని 1.85 కోట్లతో ఈ మధ్యనే పూర్తిచేశారు. కానీ, బల్లలు, కుర్చీలు రాలేదు. దీనివల్ల శిథిలావస్థలో ఉన్న పాత భవనంలోనే రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఆదోని ప్రాంతంలోని పెద్దహరివాణంలో పీహెచ్​సీ భవనాన్ని 1.30 కోట్లతో ఆరునెలల కిందట పూర్తిచేశారు. కానీ ఇప్పటివరకు వినియోగంలోనికి రానందున ఆ భవన ఆవరణలోనికి పశువులు, పందులు వస్తున్నాయి. ప్రస్తుతం పాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

AArogyasri Bills Pending in Several Hospitals: ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులకు గ్రహణం.. వైద్య సేవలకు వెనకడుగు వేస్తున్న ఆసుపత్రులు...

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఎస్సీకాలనీలోని పట్టణ ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని ఈ ఏడాది ఆగస్టులో 11న ప్రారంభించారు. విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్, ర్యాంప్, ప్రహరీ నిర్మాణం పూర్తికాకపోవడంతో, అద్దె భవనంలోనే కార్యకలాపాలు నడుస్తున్నాయి. తగిన స్థలం లేక, వైద్య పరికరాలు, ఇతర సామగ్రిని బయటకు తీయకుండా అలాగే ఉంచారు.

ఆలూరు సామాజిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో నాడు-నేడు కింద భవనం నిర్మాణ పనులు పూర్తయి 5 నెలలు గడిచినప్పటికీ, ఇప్పటివరకు వినియోగంలోనికి రాలేదు. విద్యుత్తు సరఫరా ఏర్పాటు చేయకపోవడంతో, పాత భవనంలోనే వైద్యులు అరకొర సౌకర్యాల మధ్య రోగులకు చికిత్స అందిస్తున్నారు. అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం మల్లెల గ్రామంలో వైస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 6 లక్షల వ్యయంతో ఆరోగ్య ఉప కేంద్రాన్ని నిర్మించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ప్రారంభించకుండా పక్కనపడేయటంతో.. నిరుపయోగంగా ఉన్న ఈ భవనం అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారింది. ఇక్కడి ప్రజలు కిలోమీటర్ల మేర ప్రయాణంచేసి, బి.కొత్తకోటలోని ఆస్పత్రికి వస్తున్నారు.

కేంద్రమే ఆసుపత్రులు నిర్మించి ఇస్తామన్నా - ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం

ABOUT THE AUTHOR

...view details