YSRCP Government Neglected Best Available School Scheme : గత ఇరవై సంవత్సరాలకు పైగా దళిత బిడ్డలకు.. విద్యను అందించిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకానికి వైసీపీ ప్రభుత్వం చరమగీతం పాడింది. ఆ పథకం ఇప్పటి వరకు ఎంతో మంది పేద విద్యార్థులను ఉన్నాతాధికారులుగా, వారిని మహోన్నత స్థాయికి తీసుకెళ్లింది. పేదలకు తోడ్పాటును అందించిన ఈ పథకాన్ని.. సీఎం జగన్ ఒక్క సంతకంతో నిలిపివేశారు.
'మట్టినుంచి గట్టిగా పెరిగిన ఈ మొక్కలు.. మహావృక్షాలై ప్రపంచానికే ఫలాలు అందిచాలని కోరుకుంటున్నాను. పేద పిల్లలు ఏ ఒక్కరు కూడా పేదరికం వల్ల చదువులకు దూరం కాకుడదని.. మన ప్రభుత్వం గట్టిగా నిర్ణయించింది. మన పిల్లలందరూ అన్ని రంగాలలో ఎదగాలి. నాయకత్వ లక్షణాలు పెంచే విధంగా మన చదువులన్నీ ఉండాలి. మణిక్యాలన్ని మట్టిలోనే పుడతాయి.' అని జూన్ 20, 2023న ఇంటర్, పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ విద్యాలయాల విద్యార్థుల్ని సత్కరించేందుకు ఏర్పాటు చేసిన 'ఆణిముత్యాలు' కార్యక్రమంలో సీఎం జగన్ ఇలా అన్నారు.
క్షేత్రస్థాయిలో జగన్ మాటలకు విరుద్ధంగా: ఈ మాటలు వింటే పేద పిల్లల విద్య కోసం జగన్ ఎంతగా తపిస్తున్నారో అనుకుంటున్నారా. వారి ఉన్నతికి ఎంత అకుంఠిత దీక్ష కనబరుస్తున్నారోనని ఆలోచిస్తున్నారా. ఇక బయటపడేది వజ్రాలేనని భావిస్తున్నారా. అయితే ఒక్కసారి ఈ విద్యార్థి సంఘం నాయకుడు క్షేత్రస్థాయి పరిస్థితిపై వ్యక్తం చేస్తున్న ఆవేదననూ ఒక్కసారి చదవండి.
"చాలా మంది దళిత బిడ్డలు ఐఏఎస్ సాధించటానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం సహాయపడింది. గతంలో ఉన్న పథకాలను తొలగించటం సరైంది కాదు. సీఎం జగన్ అధికారంలోకి రాకముందు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని చెప్పారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం ద్వారా ఎంతో మంది విద్యార్థులు పల్లెల నుంచి పట్టణాలకు వచ్చారు. ఉన్నత కోర్సులను అభ్యసించారు. ఇప్పుడు ఇలాంటి పథకం అందుబాటులో లేకపోవటంతో.. డ్రాప్ అవుట్స్ సంఖ్య ఈ మధ్య కాలంలో పెరిగింది."-అశోక్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి
Education Syllabus Changes in AP: 'ఇదేంటి జగన్ మామా..?' పాఠశాల సిలబస్ మార్పుపై విద్యార్థుల్లో అయోమయం
నాణేనికి వెనక వైపు దాగున్న అసలు నిజం : ముఖ్యమంత్రి జగన్ సభల్లో చెప్పే మాటలన్నీ.. నాణేనికి ఒకవైపు మాత్రమే అనే విషయం విద్యార్థి సంఘం నాయకుడి మాటల వల్ల ఇట్టే అర్థమవుతుంది. అమ్మఒడి, విద్యాదీవెన, విద్యావసతి వంటి పిల్లలతో మమేకమయ్యే ఏ కార్యక్రమంలోనైనా ఆయన మాటలు ఇలానే చాలా బాగుంటాయి.
సామాజిక అస్పశ్యతను తొలగించి విద్యాభివృద్ధికి పాటుపడిన కందుకూరి వీరేశలింగం పంతులు వలె.. అట్టడుగు వర్గాల విద్యా కోసం తాను శ్రమిస్తున్నట్లు మాట్లాడతారు. కానీ నాణేనికి రెండో వైపు ఇంకోలా ఉంది. నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ గంభీరంగా చెబుతూనే.. వారికి మంచి విద్య అందే అవకాశాల్ని కాలదన్నుతున్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ బీఎస్ పథకమే అందుకు నిలువెత్తు నిదర్శనం.
Prathidwani పాఠశాల విద్య వ్యవస్థతో జగన్ సర్కారు చెలగాటం..!
రెండు దశాబ్దాలకుపైగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం కింద.. దళిత, గిరిజన బిడ్డలకు అందుతున్న ప్రోత్సాహానికి జగన్ అధికారం చేపట్టగానే పాతరేశారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2020లో మెమో ద్వారా పథకాన్ని నిలిపేస్తున్నట్లు ఆదేశిస్తూ.. తన ప్రభుత్వ కలం పోటును ఎస్సీ, ఎస్టీ బిడ్డలపైనే వేశారు. 1995లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన పథకాన్ని జగన్ అధికారంలోకి వచ్చి నిలిపేశారు.
తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చిందనే కక్షతోనే ఎస్సీ, ఎస్టీలకు మేలు చేసే మంచి పథకాన్ని నిర్వీర్యం చేశారు. ఈ పథకం కింద ప్రభుత్వమే ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను గుర్తించి జిల్లాల వారీగా బాగా పేరున్న కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలకు ఎంపిక చేసి వాటిలో చదివించేది.
Education Migrants: ఉన్నత విద్యను గాలికొదిలేసిన ప్రభుత్వం.. పైచదువుల కోసం పొరుగురాష్ట్రాల బాటలో..
విద్యార్థులు కోరుకున్న పాఠశాల్లో చదివే అవకాశం ఉండేది. ఇలా 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఈ పథకాన్ని అమలు చేశారు. ఎస్సీ విద్యార్థులను 1, 5 తరగతుల్లో.., ఎస్టీ విద్యార్థులను 3, 5, 8 తరగతుల్లో ఎంపిక చేసేవారు. డే స్కాలర్స్గాగానీ, రెసిడెన్షియల్గాగానీ విద్యార్థులు ఏది కోరుకుంటే ఆ సౌకర్యాన్ని ప్రభుత్వాలు సమకూర్చాయి. మొదట్లో ఒక్కో విద్యార్థిపై 2 వేల నుంచి 3 వేల రూపాయల వరకు ప్రభుత్వం ఖర్చు చేసేది. జగన్ అధికారంలోకి రాక ముందు వరకు ఈ పథకం కింద లక్షల మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఆదరువు లభించింది.