ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 1, 2020, 6:15 PM IST

ETV Bharat / state

వికేంద్రీకరణ బిల్లు ఆమోదం... వైకాపా నేతల సంబరాలు

వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపటంతో... రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పలుచోట్ల దివంగత నేత వైయస్ రాజశేఖర్​రెడ్డి విగ్రహానికి పాలాభిషేకాలు చేశారు.. కొన్నిచోట్ల సీఎం ఫోటోకు క్షీరాభిషేకాలు నిర్వహించారు.

ycp leaders celebrations
వైకాపా నేతల సంబరాలు

కర్నూలు జిల్లాలో ..

కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటును హర్షిస్తూ... నంద్యాల శ్రీనివాసనగర్​లోని దివంగత నేత రాజశేఖరరెడ్డి విగ్రహానికి పార్లమెంటు సభ్యుడు పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి పాలాభిషేకం చేశారు. పాలన వికేంద్రీకరణతో రాయలసీమ ప్రాంతానికి ఎంతో మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కర్నూలుకు న్యాయరాజధాని రావటం వల్ల ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని... కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్​ అన్నారు. మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయటాన్ని స్వాగతించారు.. ఈ ప్రాంతవాసులకు ఉపాధి అవకాశాలు వస్తాయని... ఎన్నో భవనాలు నిర్మిస్తారని... తాగునీటి సమస్య పరిష్కారానికి గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మించే అవకాశం ఉందని ఎంపీ వివరించారు. వికేంద్రీకరణ బిల్లు ఆమోదానికి హర్షం వ్యక్తం చేస్తూ.. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్​ఖాన్ సహా కార్యకర్తలు ఇతర వైకాపా నేతలు, కొండారెడ్డి బురుజు వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.

తూర్పు గోదావరి జిల్లాలో..

వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించటంతో.. తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం... ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వైకాపా కార్యాలయం నుంచి.. పి. గన్నవరం మూడు రోడ్ల జంక్షన్ వరకు బాణాసంచా కాల్చి, డప్పులు వాయిస్తూ.. ర్యాలీ చేశారు.

విశాఖ జిల్లాలో..

మూడు రాజధానులకు ఆమోదం తెలిపిన గవర్నర్​కు ధన్యవాదాలు తెలియజేస్తూ విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్ని ప్రాంతాలకు సమాన అభివృద్ధి కోసం జగన్ ప్రభుత్వం తీసుకున్న.. 3 రాజధానుల నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యమైనదని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అన్నారు. సీఎం జగన్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో.. రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గవర్నర్ నిర్ణయాన్ని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ స్వాగతించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా మాకవరపాలెంలో మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైయస్ రాజశేఖర్​రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో అన్ని వర్గాల ప్రజల నుంచి ఆనందం వ్యక్తమవుతోందని అన్నారు.

ప్రకాశం జిల్లాలో..

మూడు రాజధానులు, సీఆర్​డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలపటంపై ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలోని వైకాపా నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైయస్​ రాజశేఖర్​రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఆర్​డీఏ బిల్లు రద్దు చేయడం, మూడు రాజధానుల బిల్లు ఆమోదించడం శుభపరిణామమన్నారు.

అనంతపురం జిల్లాలో..

రాయలసీమ ప్రాంతంమైన కర్నూలులో హైకోర్టు ఏర్పాటును స్వాగతిస్తూ అనంతపురం జిల్లా హిందూపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయడంతో... రాయలసీమ ప్రాంత అభివృద్ధి చెందుతుందని అన్నారు.

గవర్నర్ మూడు రాజధానులకు ఆమోదం తెలపటంతో అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో ఎమ్మెల్యే తిప్పేస్వామి, వైకాపా నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైయస్​ఆర్ కూడలిలో టపాసులు కాల్చి, వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు.

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర విద్యా సంస్కరణ సీఈఓ ఆలూరి సాంబశివారెడ్డి, వైకాపా నేతలు సంబరాలు జరుపుకున్నారు. మూడు రాజధానుల బిల్లు ఆమోదం తెలిపిన సందర్భంగా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

చిత్తూరు జిల్లాలో..

కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుతో.. రాయలసీమ అభివృద్ధి చెందుతుందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. మూడు రాజధానుల బిల్లుగవర్నర్ ఆమోదంపై తిరుపతిలో వైకాపా నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. అనంతరం తుడా కార్యాలయం ఎదుట ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు.

విజయనగరం జిల్లాలో..

విజయనగరం జిల్లా సాలూరులో గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. ఎమ్మెల్యే రాజన్న దొర ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బోసుబొమ్మ కూడలి వద్ద దివంగత నేత వైయస్ రాజశేఖర్​ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా చేసి.. ఉత్తరాంధ్రకు ప్రత్యేక శోభను తీసుకువచ్చారని విజయనగరం జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ ఫోటోలకు పాలాభిషేకం చేశారు. బీసీ సంక్షేమ నాయకులు మాట్లాడుతూ.. నిరుద్యోగ సమస్య తీరుతుందనీ.. దీని వలన విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల ప్రాంత వాసులకు ఇది గొప్ప వరమన్నారు.

ఇదీ చదవండి:మాణిక్యాలరావు మృతి పట్ల రాజకీయ ప్రముఖుల దిగ్భ్రాంతి

ABOUT THE AUTHOR

...view details