ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 14, 2020, 5:39 AM IST

ETV Bharat / state

మాచర్ల పురపాలక పీఠం వైకాపా వశం..!

పల్నాడులో ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల ఘట్టమే పుర నామినేషన్లలోనూ పునరావృతమైంది. మాచర్ల పురపాలక సంఘం నామినేషన్ల ప్రక్రియలో హైడ్రామా జరిగింది. అధికార వైకాపా మినహా ఇతర పార్టీల అభ్యర్థులెవరూ నామినేషన్ వేసేందుకు ముందుకు రాలేదు. చివరిరోజు చివరి నిమిషంలో నలుగురు సభ్యులు తాము తెలుగుదేశం అభ్యర్థులమంటూ నామినేషన్లు వేసేందుకు వచ్చారు. వాటిల్లో మూడు మాత్రమే అధికారులు స్వీకరించడం అనుమానాలకు తావిస్తోంది.

YCP Got Macherla Municipal Chairman post
మాచర్ల పురపాలక పీఠం వైకాపా వశం..!

మాచర్ల పురపాలక పీఠం వైకాపా వశం..!

స్థానిక సంస్థల ఎన్నికలు పల్నాడు ప్రాంతంలో మళ్లీ పాతకాలం నాటి పెత్తందారి వ్యవస్థను గుర్తుచేస్తున్నాయి. మాచర్ల నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్లు అధికారపక్షం బెదిరింపులతో 71 స్థానాల్లో 69 ఏకగ్రీవమయ్యాయి. పురపాలక ఎన్నికల్లోనూ అదే తంతు కొనసాగింది. మొత్తం 31 వార్డుల్లో చివరి నిమిషం వరకు కేవలం వైకాపా అభ్యర్థులే నామపత్రాలు దాఖలు చేశారు. తెలుగుదేశం, జనసేన, భాజపా, వామపక్షాలకు చెందిన అభ్యర్థులు ఎవరూ ముందుకు రాలేదు.

తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి చలమారెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆయన బయటకు రాలేదు. మరో 5 నిమిషాల్లో నామినేషన్ల గడువు ముగియనుండగా... తెదేపా సభ్యులమంటూ నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు. వారు కేవలం నామపత్రాలు మాత్రమే అధికారులకు అందజేశారు. నగదు డిపాజిట్, ఎన్​వోసీ, బీ-ఫారం ఏమీ లేవు. ఓ వ్యక్తి ఎలాంటి వివరాలు లేకుండా కేవలం పేరు రాసి నామపత్రం అందజేశాడు. అతని నామినేషన్​ను అధికారులు పక్కన పెట్టేశారు. మిగతా ముగ్గురివి స్వీకరించారు.

వైకాపా వ్యూహాత్మకంగానే చివరి నిమిషంలో కొందరితో నామినేషన్లు వేయించినట్లు భావిస్తున్నారు. అన్ని వార్డులు ఏకగ్రీవమైతే ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశముందని గ్రహించే ఈ పనిచేసినట్లు తెలుస్తోంది. నామినేషన్ల పరిశీలన సమయంలో అన్ని రకాల పత్రాలు లేని కారణంగా ఆ మూడింటినీ తిరస్కరించే అవకాశముంది. 31 వార్డులు వైకాపా వశం కానున్నాయి. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగిందని స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు.

మాచర్లలో తెలుగుదేశం తరఫున నామినేషన్లు వేసిన వారెవ్వరూ తమ పార్టీ సభ్యులు కాదని... ఆ పార్టీ నేత చలమారెడ్డి తెలిపారు. అధికార పార్టీ నేతలు భయభ్రాంతులకు గురిచేయడం వల్లే తమ అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారని పేర్కొన్నారు. ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా సృష్టించిన అలజడి కారణంగానే పుర ఎన్నికల్లోనూ పోటీకీ ఎవరూ ముందుకు రాలేదని స్థానిక ప్రజలు అంటున్నారు.

ఇదీ చదవండీ... చిత్తూరు జిల్లా రేణిగుంట పోలీస్​స్టేషన్ వద్ద ఉద్రిక్తత

ABOUT THE AUTHOR

...view details