తెదేపాకు మెజారిటీ ఉన్నా దుగ్గిరాల ఎంపీపీ పీఠం వైకాపాకే దక్కింది. ఆ పార్టీ ఎంపీటీసీ సభ్యురాలు దానబోయిన సంతోష రూపవాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో రెండుసార్లు కోరం లేక వాయిదా పడిన ఎంపీపీ ఎన్నిక మూడోసారి పటిష్ఠ పోలీసు బందోబస్తు నడుమ ప్రశాంతంగా ముగిసింది. తెదేపా, జనసేనలకు వైస్ఎంపీపీ పదవులు దక్కాయి. కోఆప్షన్ పదవి కూడా తెదేపాకే లభించింది.
దుగ్గిరాలలో మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. 9 చోట్ల తెలుగుదేశం గెలిచింది. వైకాపా 8 సీట్లు, ఒకచోట జనసేన విజయం సాధించాయి. అయితే ఎంపీపీ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. తెలుగుదేశం నుంచి గెలిచిన వాళ్లలో బీసీ మహిళ ఒకరు మాత్రమే ఉండగా.... ఆమెకు సంబంధిత ధృవీకరణ పత్రం జారీ కాలేదు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం కోర్టుకు వెళ్లడంతో... కొన్ని నెలల పాటు ఎన్నిక వాయిదా పడింది. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. వైకాపా నుంచి ఎంపీపీ పదవి ఆశించిన దుగ్గిరాల-2 ఎంపీటీసీ పద్మావతి.... తెలుగుదేశం మద్దతుతో బరిలోకి దిగాలని భావించారు. ఈ విషయాన్ని గుర్తించిన వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.... నిన్నే ఆమెను తనవెంట తీసుకెళ్లారు. ఇవాళ ఎన్నిక సమయానికి కూడా ఆమెను తీసుకురాలేదు. ఈ పరిస్థితుల్లో వైకాపా అభ్యర్థి మాత్రమే నామినేషన్ వేయడంతో... ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నాకు బీసీ సర్టిఫికేట్ ఇవ్వలేదు: ముస్లిం మైనారిటీ మహిళకు ఎంపీపీ పదవి దక్కకుండా అధికార పార్టీ ఎమ్మెల్యే కుట్రపన్నారని తెదేపా తరుఫున దుగ్గిరాల వైస్ఎంపీపీగా ఎన్నికైన షేక్ జాబీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులందరికీ బీసీ సర్టిఫికేట్ ఉన్నప్పుడు.. తాను ఏ విధంగా బీసీ కాకుండా పోతానాని ప్రశ్నించారు. నామినేషన్ దాఖలు నుంచి ఎన్నిక వరకు అధికార పార్టీ అనేక ఇబ్బందులకు గురిచేసిందని జనసేన తరుఫున వైస్ఎంపీపీగా ఎన్నికైన సాయి చైతన్య మండిపడ్డారు. ఎన్నో ఇబ్బందులు, ఒత్తిళ్లకు అధిగమించి తాను వైస్ ఎంపీపీ దక్కించుకున్నానన్నారు.