Tension at Vijayawada Ilapuram Hotel: విజయవాడలోని హొటల్ ఐలాపురం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్ర మహిళా కమిషనర్ను కలిసేందుకు వెళ్తున్న తెలుగుదేశం పార్టీ మహిళా, జనసేన వీర మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో.. మహిళలపై జరుగుతున్న దాడులువివరించేందుకు ఐలాపురం హోటల్కు బయలుదేరిన మహిళా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈక్రమంలో వంగలపూడి అనిత, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే సమావేశానికి అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. మహిళలపై దాడులు, సోషల్ మీడియాలో మహిళలపై వేధింపులపై సమావేశం జరుగుతుంటే తమకు అనుమతి ఎందుకు లేదంటూ టీడీపీ, జనసేన వీర మహిళా నేతలు ప్రశ్నించారు. తాము శాంతియుతంగానే వెళ్లి మహిళలు ఎదుర్కొన్న సమస్యలు మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని చెబుతున్నా పోలీసులు అనుమతించట్లేదని మండిపడుతున్నారు. దీంతో తెలుగుదేశం-జనసేన మహిళా నేతలు హోటల్ బయట నిరసన తెలుపుతున్నారు.
TDP And Janasena Leaders Fires on Vasireddy Padma: ఈ క్రమంలో టీడీపీ మహిళా నాయకురాలు వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని పెట్టుకుని మహిళా కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ "సోషల్ మీడియా - మహిళలపై దాడి" అంశంపై సమావేశం పెట్టుకున్నారా అని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. తాము కూడా వినతి పత్రం ఇస్తామంటే హాల్ నిండిపోయింది అని సమాచారం ఇవ్వటమేంటని ప్రశ్నించారు. హాల్ నిండిపోతే వాసిరెడ్డి పద్మ కిందకి వచ్చి తమ వినతిపత్రం తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ విజ్ఞాపన తీసుకోకుండా ఇక్కడి నుంచీ కదిలేది లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలకు ప్రాతినిధ్యం లేకుండా వాసిరెడ్డి పద్మ ఎలా సమావేశం నిర్వహిస్తారని జనసేన మహిళా నాయకురాలు సౌజన్య నిలదీశారు. జనసేన తరఫున మహిళా కమిషన్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.