ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 28, 2023, 8:46 AM IST

ETV Bharat / state

ధాన్యం సేకరణపై సీఎం ఒక మాట.. అధికారులది ఒక బాట.. రైస్‌మిల్లర్లకు ఎర్రతివాచీ!

RICE MILLERS : ధాన్యం సేకరణలో ఈ సంవత్సరం కొత్త విధానం తెచ్చామని, మిల్లర్ల ప్రమేయం లేకుండా చేశామని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్​ రెడ్డి ఘనంగా చెబుతుండగా అదే మిల్లర్లకు పౌర సరఫరాలశాఖ ఎర్ర తివాచీ పరచి మరీ ఆహ్వానిస్తోంది. రైతుల నుంచి ధాన్యాన్ని తీసుకెళ్లడం నుంచి బియ్యంగా మార్చి నేరుగా రేషన్ దుకాణాలకు సరఫరా చేసే వరకు.. బాధ్యతంతా రైస్ మిల్లర్లకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రబీ నుంచే గంపగుత్తగా కట్టబెట్టాలని భావిస్తోంది.

millers
millers

ధాన్యం సేకరణపై సీఎం ఒక మాట.. అధికారులది ఒక బాట.. రైస్‌మిల్లర్లకు ఎర్రతివాచీ!

RICE MILLERS : ధాన్యం అమ్ముకోవాలంటే ఇప్పటికే నానా అవస్థలు పడుతూ, క్వింటాలు 200 రూపాయల నుంచి 300 రూపాయల వరకూ నష్టపోతున్న రైతుల భవిష్యత్తును.. ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం మిల్లర్ల చేతిలో పెట్టబోతోంది. నూతన విధానంలో భాగంగా.. 9 జిల్లాల్లో బియ్యం సరఫరాకు టెండర్లు పిలిచింది. వారికి సర్వీస్ ప్రొవైడర్ అనే కొత్త పేరు పెట్టింది. ఈ విధానంలో పొలాల వద్దకు వచ్చి ధాన్యాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత.. మిల్లర్లపైనే ఉంటుంది.

రైతులకు గోనె సంచులు సమకూర్చడం నుంచి వాహనాలు ఏర్పాటుస కూలీలు అంతా మిల్లర్లే చూసుకోవాలి. రైతు భరోసా కేంద్రాల్లో నాణ్యతా పరీక్షలు నిర్వహించి.. అక్కడి నుంచి వేబ్రిడ్జికి తీసుకెళ్లి కొనుగోలు సిబ్బంది, రైతుల సమక్షంలో తూకం వేయించాలి. ధాన్యాన్ని మిల్లుకు తీసుకెళ్లాక నెల రోజుల లోపు మర ఆడించి బియ్యంగా మార్చాలి. కస్టమ్ రైస్ మిల్లింగ్ ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధం చేసిన బియ్యాన్ని గోదాముకు తరలించాలి. తహసీల్దారు ఇచ్చే తరలింపు ఉత్తర్వులకు అనుగుణంగా చౌక ధరల దుకాణాలకు 24 గంటల్లోగా రవాణా చేయాలి.

100 కోట్ల టర్నోవర్​ ఉండాలనే నిబంధన: ఈ విధానంలో టెండరు దక్కించుకునే మిల్లరు.. గత రెండు సంవత్సరాల్లో కనీసం 100 కోట్ల రూపాయల మేర టర్నోవర్ చేసి ఉండాలనే నిబంధన పెట్టారు. 5 వేల నుంచి 7వేల టన్నుల సామర్థ్యంతో కూడిన రైస్ మిల్ ఉండాలని స్పష్టం చేశారు. తమ సంస్థ, డైరెక్టర్లు, భాగస్వాముల పేరుతో కనీసం.. 5 సొంత వాహనాలు ఉండాలని..నిబంధనలు పెట్టడంతో పెద్దవారు తప్పితే చిన్న చిన్న వాళ్లకు ఇందులో పాల్గొనడం కష్టమేనని మిల్లర్లు అభిప్రాయపడుతున్నారు. జిల్లాకు ఒకరికి బాధ్యతలు అప్పగించడం ద్వారా సేకరణ విధానాన్ని కేంద్రీకృతం చేస్తూ, గుత్తాధిపత్యానికి తెరతీస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రశ్నార్ధకంగా 5వేల మంది కూలీల ఉపాధి: ప్రస్తుతం రెండు దశల్లో గోదాములు, రవాణా వ్యవస్థలు ఉన్నాయి. బియ్యాన్ని గోదాములకు తరలించి నిల్వ చేస్తారు. వాటిని ప్రతి నెలా మండల స్థాయి నిల్వ కేంద్రాలకు చేరవేస్తున్నారు. అక్కడి నుంచి చౌక ధరల దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. కొత్త విధానంలో బియ్యాన్ని గోదాముల్లో నిల్వ చేయాల్సిన బాధ్యత రైస్ మిల్లరుదే. అక్కడి నుంచి చౌకధరల దుకాణాలకు పంపిస్తారు. మధ్యలో మండల స్థాయి నిల్వ కేంద్రాలు ఉండవు. అక్కడ కూలీల అవసరమూ ఉండదు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 268 మండల స్థాయి గోదాముల్లో పని చేసే 5వేల మంది ఉపాధి ప్రశ్నార్ధకంగా మారనుందని రాష్ట్ర పౌరసరఫరాల మండల స్థాయి గోదాముల హమాలీల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

అతి పెద్ద సమస్యగా రేషన్​ బియ్యం రీసైక్లింగ్​:రేషన్ బియ్యంలో రీసైక్లింగ్ అతి పెద్ద సమస్య. కార్డుదారుల నుంచి కొని.. వాటినే రీసైక్లింగ్ చేసి సీఎంఆర్ కింద పౌరసరఫరాల సంస్థకు అందిస్తున్న పరిస్థితి ఉంది. కొందరు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇప్పుడు మిల్లరు చేతికే మొత్తం వ్యవహారాన్ని అప్పగించడం ద్వారా.. ఇది మరింత పెరుగుతుందనే మాట వినిపిస్తోంది. రీసైక్లింగ్ బియ్యాన్ని నేరుగా మిల్లు నుంచి డీలర్లకు పంపేందుకు వీలుంటుంది. డీలర్లు, ఎండీయూలతో అవగాహన కుదుర్చుకోవడం ద్వారా కేటాయించిన మేరకు కాకుండా.. బియ్యాన్ని తగ్గించి పంపవచ్చు. అంతా మిల్లరు చేతిలో పనే. అధికారుల పర్యవేక్షణ ఉంటుందని చెబుతున్నా..అదంతా కాగితాలకే పరిమితమవుతుందని డీలర్లు చెబుతున్నారు.

పెద్దలకు ఎదురు చెప్పగలరా: ధాన్యం సేకరణలోనూ మిల్లర్ల పాత్ర కారణంగానే రైతులు పెద్దఎత్తున నష్టపోతున్నారు. తేమ, నూక పేరుతో బస్తాకు 200రూపాయల నుంచి 300 రూపాయలు కోత పెడుతున్నారు. ఇప్పుడు వారినే నేరుగా పొలాల వద్దకు తీసుకొస్తున్నారు. ధాన్యం తీసుకెళ్లడం నుంచి మిల్లింగ్ చేసి బియ్యం ఇచ్చే వరకు మొత్తం వ్యవహారమంతా ఒకరికే అప్పగించడం ద్వారా.. మిల్లరుకు పెద్ద పీట వేస్తున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో.. ధాన్యం సేకరణ వ్యవహారమంతా కేంద్రీకృతం చేసి.. ఎంపిక చేసిన కొందరికి, అదీ అధికార పార్టీ కనుసన్నల్లోని వారికి అప్పగించేందుకు ఇది తొలిఅడుగుగా కొందరు మిల్లర్లే చెబుతున్నారు. వైకాపాలోని కొందరు పెద్దల ప్రమేయంతోనే ఇదంతా జరుగుతోందని.. ఈ విధానం అమలులోకి వస్తే.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ అక్రమాలకు మరింత ఊతమిచ్చినట్లు అవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో కొన్నిదశాబ్దాలుగా పౌరసరఫరాల సంస్థ గోదాములపైనే ఆధారపడ్డ హమాలీల ఉపాధి ప్రశ్నార్థకం కానుంది. అయితే దీనిపై పూర్తిగా అధ్యయనం చేశాకే ముందుకెళ్తామని.. అప్పటి వరకు టెండర్లు నిలిపేయాలని నిర్ణయించినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details