ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాయపాటికి బుజ్జగింపులు

గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ స్థానానికి తెదేపా అభ్యర్థి ఎంపిక... పార్టీలో దుమారం రేపుతోంది. వైకాపా అభ్యర్థికి ధీటుగా... భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్ రామకృష్ణను బరిలోకి దింపేందుకు చంద్రబాబు యోచించడం... సిట్టింగ్ ఎంపీ రాయపాటి అసంతృప్తికి కారణమైంది.

By

Published : Mar 14, 2019, 10:47 PM IST

రాయపాటితో మాట్లాడుతున్న నేతలు

గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ స్థానంపై స్పష్టమైన హామీ లభించకపోవడం... సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరావు అసంతృప్తి కారణమైంది. ఆయన అనుచరులతో సమావేశమై... సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పటికైతే... పార్టీ మారనని... అధినేతపై నమ్మకం ఉందని చెప్పారు. ఆదినుంచి నరసరావుపేట పార్లమెంటు సీటుపై చర్చలు సాగుతున్నాయి. వయసు రీత్యా రాయపాటికి ఈసారి టిక్కెట్ ఇవ్వకపోవచ్చనే ప్రచారం ఎప్పటినుంచో సాగుతోంది.

నరసరావుపేట పార్లమెంటు స్థానానికి బదులుగా... సత్తెనపల్లి అసెంబ్లీ సీటును రాయపాటి తనయుడు రంగారావుకు ఇవ్వొవచ్చనే ప్రచారం జోరుగా సాగింది. పార్టీ అధిష్ఠానం కూడా నరసరావుపేట ఎంపీగా సభాపతి కోడెలను పోటీ చేయించాలని భావించింది. దిల్లీ రాజకీయాలు తనకు పడవంటూ... పోటీ చేసేందుకు సభాపతి నిరాకరించారు. ఆయన కోరుకున్నట్లుగానే మళ్లీ సత్తెనపల్లి నుంచి పోటీకి దిగడానికి సుముఖత వ్యక్తం చేశారు.

అయితే రాయపాటికే మళ్లీ ఎంపీ స్థానం ఖరారు కావచ్చని అంతా భావించారు. ఈలోగానే భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్ రామకృష్ణ పేరు తెరపైకి వచ్చింది. ఈ విషయమై 3 రోజులుగా చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు. వైకాపా తరఫున విజ్ఞాన్ విద్యాసంస్థల ఛైర్మన్ లావు రత్తయ్య కుమారుడు... శ్రీకృష్ణదేవరాయలు బరిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అన్నివిధాలా పోటీకి సరితూగేలా... రామకృష్ణ అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

పోటీ వివాదం ముదురుతున్న తరుణంలో పార్టీ అధిష్ఠానం కీలక నేతలను రంగంలోకి దింపింది. రాయపాటిని బుజ్జగించే ప్రయత్నాలు చేపట్టింది. మంత్రులు నారా లోకేశ్...పుల్లారావు... రాయపాటితో విడివిడిగా మాట్లాడారు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవీఎస్ ఆంజనేయులు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరపప్రసాద్ రాయపాటి ఇంటికేళ్లి బుజ్జగించారు.

ఇదీ చందవండి...

'విశ్రాంతి' సూచనపై రాయపాటి అసంతృప్తి!

ABOUT THE AUTHOR

...view details