ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 18, 2023, 2:19 PM IST

ETV Bharat / state

రక్షించాల్సినవాళ్లే కబళిస్తే ప్రజలే ప్రజాస్వామ్యాన్ని నిలబెడతారు: యనమల

TDP LEADER YANAMALA FIRES ON POLICE : జగన్ దుశ్చర్యలకు పోలీసుల వత్తాసు శోచనీయమని టీడీపీ సీనియర్​ నాయకులు యనమల రామకృష్ణుడు అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన పోలీసులే బాధ్యత విస్మరిస్తారా? అని నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని పోలీసులే చెరబట్టడమా అని మండిపడ్డారు. రక్షించాల్సినవాళ్లే కబళిస్తే ప్రజలే ప్రజాస్వామ్యాన్ని నిలబెడతారన్నారు.

TDP LEADER YANAMALA FIRES ON POLICE
TDP LEADER YANAMALA FIRES ON POLICE

TDP LEADER YANAMALA FIRES ON POLICE : జగన్ నిరంకుశ విధానాలు రాష్ట్రంలో సివిల్ వార్​కు దారి తీసేలా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. రేపు సివిల్ వార్ వస్తే దానికి జగన్ రెడ్డే ప్రధాన కారకుడని ఆరోపించారు. జగన్ రెడ్డి దుశ్చర్యలకు పోలీసుల వత్తాసు శోచనీయమన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన పోలీసులే ఇలా చేయడం దారుణమని మండిపడ్డారు. చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లా పర్యటన రెండు రోజులు ప్రశాంతంగా జరిగిందన్న యనమల.. ఈ 2 రోజుల్లో ఎక్కడా ఉద్రిక్తత తలెత్తలేదని తెలిపారు.

3 వ రోజు అనపర్తిలో ఎందుకిలా దురాగతానికి పాల్పడ్డారని నిలదీశారు. అక్కడో చట్టం, ఇక్కడో చట్టమా అని ప్రశ్నించారు. అక్కడ ప్రశాంతంగా జరిగితే, ఇక్కడ ఉద్రిక్తత వస్తుందా అంటూ దుయ్యబట్టారు. ప్రజలే ప్రజాస్వామ్య రక్షకులు అని.. రక్షించాల్సిన వాళ్లే కబళిస్తే ప్రజలే ప్రజాస్వామ్యాన్ని నిలబెడతారన్నారు. నిన్న అనపర్తిలో అదే జరిగిందన్న యనమల.. ప్రజలే రక్షకభటుల్లా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారన్నారు. చంద్రబాబు పర్యటనను ప్రజలే విజయవంతం చేశారని తెలిపారు. సివిల్​వార్​లు, తిరుగుబాట్లు కొత్తేమీ కాదని.. ప్రపంచంలో అనేక చోట్ల వచ్చాయని గుర్తు చేశారు. అణిచివేత పెరిగితే ప్రజలే తిరగబడతారని యనమల రామకృష్ణుడు హెచ్చరించారు.

అసలేం జరిగిందంటే: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు మూడో రోజు పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. అనపర్తి పర్యటనకు ముందుగా అనుమతి ఇచ్చిన పోలీసులు.. ఆ తర్వాత అనుమతి లేదని తెలిపారు. అయితే పోలీసుల ఆంక్షల నేపథ్యంలో చంద్రబాబు అనపర్తి పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. పర్యటన నిమిత్తం అక్కడికి వచ్చిన చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. కాన్వాయ్​ వెళ్లకుండా పోలీసులు రోడ్డుపై వాహనాలు పెట్టడంతో రోడ్డుపై బైఠాయించారు. అప్పటికీ పోలీసులు కాన్వాయ్​ని వదిలిపెట్టకపోవడంతో 8 కిలోమీటర్లు కాలినడకనే అనపర్తి చేరుకున్నారు. చంద్రబాబు వెంట టీడీపీ శ్రేణులు నడిచారు. మధ్యలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడక్కడ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్​ చేసినా.. ఎక్కడా వెనక్కి తగ్గని బాబు అనపర్తి చేరుకున్నారు.

కాలినడకన బయల్దేరిన చంద్రబాబు సుమారు గంటా 15 నిమిషాలు ఎక్కడా ఆగకుండా 8 కిలోమీటర్లు నడిచారు. ఆయనను పోలీసులు అడుగడుగునా అడ్డుకునేందుకు యత్నించగా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, పార్టీ శ్రేణులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో చంద్ర దండు ప్రకాష్ నాయుడు, పలువురు నాయకులు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వారిని అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రకాష్​ని మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం తరలించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details