ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 3, 2020, 10:05 PM IST

ETV Bharat / state

చంద్రబాబు హైదరాబాద్‌ వాసి.. పవన్‌ కల్యాణ్‌ అజ్ఞాతవాసి: శ్రీదేవి

చంద్రబాబు హైదరాబాద్‌ వాసి.. పవన్‌ కల్యాణ్‌ అజ్ఞాతవాసి అని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి విమర్శించారు. జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్‌కు ఉన్న పరిజ్ఞానం కూడా పవన్‌ కల్యాణ్‌ కు లేదని ఎద్దేవా చేశారు. కాషాయంతో దోస్తీ కట్టిన పవన్‌ కళ్యాణ్‌.. మళ్లీ సైకిల్‌పైనే మనసు పారేసుకున్నాడన్నారు.

tadikonda mla undavalli sridevi comments on pawan
tadikonda mla undavalli sridevi comments on pawan

రాజధాని మార్చేస్తున్నారని.. రాజధాని ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని పవన్ కళ్యాణ్ జ్ఞానం లేని మాటలు మాట్లాడుతున్నారని శ్రీదేవి మండిపడ్డారు. ప్రశ్నించేందుకు పార్టీ పెట్టిన పవన్‌ కళ్యాణ్.. పేదలకు, దళితులకు, సామాన్యులకు అండగా ఉన్న వైకాపాను మాత్రమే ప్రశ్నిస్తున్నారని.. పేద రైతుల భూములు కాజేసిన చంద్రబాబును మాత్రం ప్రశ్నించడం లేదన్నారు. రాజధాని మారడం లేదని కేవలం అభివృద్ధి వికేంద్రీకరణ దృష్ట్యా మాత్రమే మూడు ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారన్నారు. పవన్‌ రైతులను, జనసేన కార్యకర్తలను కూడా మోసం చేస్తున్నారన్నారు.

చంద్రబాబు వదిలిపెట్టిన పనులు పూర్తి చేయాలంటే లక్షల కోట్లు అప్పు చేయాల్సి వస్తుందని.. రాజధాని రైతులకు సీఎం న్యాయం చేస్తుంటే రైతులను రెచ్చగొట్టడం సరికాదని చెప్పుకొచ్చారు. సీఎం వైఎస్‌ జగన్‌ అడగకుండానే రైతులకు కౌలు 15 ఏళ్లు పెంచారని.. కూలీలకు రూ.2,500 నుంచి రూ.5,000 వరకు పరిహారం పెంచారన్నారు. సీఎం నిర్ణయానికి హర్షించాల్సింది పోయి చంద్రబాబు, లోకేశ్​‌లు చెప్పినట్లు పవన్‌ మాట్లాడటం సరికాదన్నారు. సుమారు 4500 ఎకరాల భూములు బినామీల పేరుతో, తెల్ల రేషన్‌కార్డు దారులతో కొనుగోలు చేయించారని ఆరోపించారు. ఎస్సీల భూములను చంద్రబాబు కాజేస్తే..ఆ భూములు తిరిగి ఎస్సీలకు సీఎం వైఎస్‌ జగన్‌ ఇప్పించారని.. ఈ విషయాలపై పవన్‌ ఎందుకు మాట్లాడటం లేదన్నారు.

ఇవాళ జనసేన పార్టీ ఎమ్మెల్యే కూడా సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలకు మద్దతు తెలిపారన్నారు. చంద్రబాబు హయంలో జరిగిన అక్రమాలను పవన్ ఎందుకు ప్రశ్నించలేదని ఉండవల్లి శ్రీదేవి అడిగారు. గతంలో పాడేరు నుంచి పోటీ చేస్తానని పవన్ అన్న మాటలు జనం మరిచిపోలేదని.. అదో పెద్ద జోక్​గా గిరిజనం చెప్పుకుంటున్నారన్నారు. జనసేన పార్టీ ఎందుకు పెట్టారో తెలియని పరిస్థితిలో పవన్‌ ఉన్నారని.. ప్రశ్నించడం కోసం అంటూ పార్టీ పెట్టి ఆరు నెలలకోసారి ఒక ప్రశ్న వేసి తర్వాత కనిపించని పవన్‌ మూడు రాజధానులు ఎలా ఇస్తారని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

కరోనా కట్టడిలో దేశానికి ఆదర్శంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ఉందని.. ఏపీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల అమలులో సీఎం వైఎస్‌ జగన్‌ రాజీ పడలేదని.. ఆయన సంక్షేమ పాలన చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని శ్రీదేవి అన్నారు.

ఇదీ చదవండి:అప్పు తీర్చలేదని మహిళను ట్రాక్టర్‌తో తొక్కించిన వైకాపా నాయకుడు

ABOUT THE AUTHOR

...view details