Supreme Court On MLAs Poaching Case: తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు తమకు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ బి.వి.నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కె.వి.విశ్వనాథన్ వాదనలు వినిపించారు.
ఏడేళ్లలోపు శిక్షపడే కేసుల్లో 41(ఏ) నోటీసు ఇవ్వకుండా నిందితులను అరెస్టు చేయకూడదని సుప్రీంకోర్టు ఉత్తర్వులున్నా అందుకు విరుద్ధంగా అరెస్టు చేశారని కె.వి.విశ్వనాథన్ తెలిపారు. ఫిర్యాదుదారులు నిఘా బృందానికి కాకుండా సాధారణ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ట్రాప్ చేశారని ధర్మాసనానికి తెలిపారు. దర్యాప్తుపై స్టే కోరుతూ భారతీయ జనతా పార్టీ హైకోర్టును ఆశ్రయించిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం దర్యాప్తుపై స్టే విధించాలని ఓ పార్టీ ఎందుకు పిటిషన్ దాఖలు చేసిందని, హైకోర్టు ఎలా విచారణకు స్వీకరించిందని ప్రశ్నించింది.
తాము నలిగిపోతున్నాం:భాజపా పిటిషన్కు, తమకు సంబంధం లేదని నిందితుల తరఫు న్యాయవాది విశ్వనాథన్ స్పష్టం చేశారు. భాజపా, తెరాసల పోరులో తాము నలిగిపోతున్నామని, ఎవరో పిటిషన్ దాఖలు చేస్తే తమను నిందిస్తున్నారని ధర్మాసనానికి తెలిపారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి భాజపా ఎవరని ప్రభుత్వ న్యాయవాది లూథ్రా ప్రశ్నించారు. ఈ దశలో జస్టిస్ బి.ఆర్.గవాయ్ జోక్యం చేసుకున్నారు. పిటిషన్ దాఖలుకు ఆ పార్టీకి ఉన్న అర్హత ఏమిటని హైకోర్టు ప్రశ్నించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.