మండుటెండలో లక్ష్యం వైపు పరుగెడుతున్న మహిళ పేరు సుఫియా. రాజస్థాన్లోని అజ్మేర్లో సుఫియా పుట్టి పెరిగింది. డిగ్రీ వరకూ చదివిన సుఫియా.. తర్వాత పదేళ్లపాటు ఓ ప్రైవేటు విమానయాన సంస్థలో పనిచేశారు. ఫిట్నెస్కు అత్యంత ప్రాధాన్యమిచ్చే ఆమె.. అందుకు పరుగుని మార్గంగా ఎంచుకున్నారు. క్రమంగా పరుగుపై మమకారం పెంచుకున్నారు. తర్వాత పరుగే ఆమె ఆశ, శ్వాసగా మారింది. ప్రస్తుతం మిషన్ ఫర్ హోప్ పేరిట దేశవ్యాప్త పరుగు చేపట్టారు. గతేడాది డిసెంబర్ 16 దిల్లీలో ఈ పరుగును ప్రారంభించారు. 135 రోజుల్లోనే 6వేల కిలోమీటర్లు పయనించి.. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలైన ముంబై, చెన్నై నగరాలను చుట్టి తిరిగి దిల్లీలో అడుగుపెట్టాలనేది సుఫియా సంకల్పం.
స్వర్ణ చతుర్భుజిగా పిలుచుకునే జాతీయ రహదారులపై ఆమె పరుగు తీస్తున్నారు. ప్రస్తుతం రాజధాని ప్రాంతమైన గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సుఫియా పరుగు సాగుతోంది. మిషన్ ఫర్ హోప్ పేరుతో చేస్తున్న ఈ పరుగు ద్వారా శాంతి, సమానత్వం, మానవత్వం అనే సందేశాల్ని ప్రజలకు చేరవేస్తున్నారు సుఫియా. సమానత్వ భావన లేకపోవటం వల్ల జరుగుతున్న ఘటనలు, మానవత్వం లేకుండా కొందరు ప్రవర్తిస్తున్న తీరు ఇవన్నీ సమాజానికి, దేశానికి మంచిది కాదనేది సుఫియా అభిప్రాయం. వీటన్నింటి నుంచి బయటపడి రేపు బాగుంటుందనే ఆశతో ముందుకెళ్లాలని సూచిస్తున్నారు.
'ఎక్కువ మందిని కలవడమే ఈ మిషన్ ఉద్దేశం. నా పరుగు ద్వారా ప్రతి ఒక్కరికి శాంతి, మానవత్వంపై మంచి సందేశం ఇవ్వడమే లక్ష్యం. ఎందుకంటే దేశంలో పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలియాల్సిన బాధ్యత ఉంది. ఒకరికొకరు గౌరవించుకోవాలి. అందుకే ఈ సందేశాన్ని దేశమంతా విస్తరిస్తాం.' - సుఫియా, రన్నర్