ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Garden in School: ఈ విద్యాలయం.. ఓ నందనవనం..!

By

Published : Aug 5, 2021, 7:59 PM IST

జీవితంలో స్థిరపడ్డాక పూర్వవిద్యార్థులందరూ కలసి తాము చదివిన పాఠశాలకు ఏదైనా చేయటం మనం చూస్తూనే ఉన్నాం. కానీ జీవిత పాఠాలు నేర్చుకునే ప్రారంభదశలోనే పాఠశాలను ఓ బృందావనంలా మార్చిన విద్యార్థులను చూడాలంటే గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం బేతపూడి వెళ్లాల్సిందే. అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేసే ఎంతోమంది పెద్దలకు... వారు సృష్టించిన పచ్చదనం ఎన్నో పాఠాలు నేర్పుతోంది. ఆ అందమైన చదువులమ్మ లోగిలి... మనసుకు హాయినీ, ఆహ్లాదాన్నీ పంచుతోంది.

Bethapudi Government School
బేతపూడి ప్రభుత్వ పాఠశాల

బేతపూడి ప్రభుత్వ పాఠశాల

చిన్నప్పుడు చాలా మంది విద్యార్థులకు చదువంటే చిరాకు.. పాఠశాలకు వెళ్లాలంటే పెద్ద యుద్ధమే చేస్తారు. బడి చుట్టూ చెత్తాచెదారం, మురికినీరు ఉంటే.. చదవాలన్న కోరిక ఉన్నా వెళ్లాలనిపించదు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం బేతపూడిలోని ప్రభుత్వ పాఠశాల 2017 వరకు ఇలాగే ఉండేది. ఆ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు.. ప్రభుత్వం బాగు చేసే వరకు వేచి ఉండలేదు. తామే రంగంలోకి దిగి ఆ పాఠశాలను నందనవనంలా మార్చారు.

ఆయన కృషి ఎనలేనిది..

ఈ పాఠశాల అందంగా మారటం వెనుక.. ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌ కృషి ఉంది. గతంలో నార్నేపాడు పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయునిగా రాష్ట్రపతి అవార్డు పొందిన శ్రీనివాస్.. 2017 ఆగస్టులో ప్రధానోపాధ్యాయునిగా ఇక్కడికి బదిలీపై వచ్చారు. విధులు ప్రారంభించిన వెంటనే పాఠశాల పరిశుభ్రతపై దృష్టి పెట్టారు. తల్లిదండ్రులు, గ్రామస్థులతో మాట్లాడి... పాఠశాలకు అవసరమైనవన్నీ సమకూర్చారు. దాదాపు నాలుగేళ్లు శ్రమించి.. విద్యార్థుల సహకారంతో.. పాఠశాలను బృందావనంగా మార్చారు.

చదువులమ్మకు పచ్చని తోరణం, నిత్య పుష్పమాలను ప్రకృతే స్వయంగా అందించేలా ప్రాంగణాన్ని మార్చారు. కూరగాయలు పెంచి.. అలా వచ్చిన ఆదాయాన్ని మళ్లీ పాఠశాలకే ఖర్చు చేస్తున్నారు. భూగర్భ జలాల పరిరక్షణకు ఈ పాఠశాల ఓ పెద్ద పాఠంలా మారింది. భూతాపాన్ని తగ్గించడమెలాగో ఇక్కడి వాతావరణం నేర్పుతుంది. ఉల్లాసంగా పనిచేసేందుకు ఈ వాతావరణం సహకరిస్తుందని ఉపాధ్యాయులు తెలిపారు.

ఉపాధి పాఠాలకు ఉపకరిస్తోంది..

మొక్కలు పెంచటం తమకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని.. ఉపాధి పాఠాలు ఇక్కడే నేర్చుకునేందుకు ఉపకరిస్తోందని విద్యార్థులు చెబుతున్నారు. పాఠశాలకు గైర్హాజరవ్వాలని ఎప్పుడూ అనిపించదని తెలిపారు. ఇకపై పర్యావరణ పాఠాల్ని.. విద్యార్థుల ఇళ్లకూ విస్తరించాలని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. పిల్లలకు మొక్కలు ఇచ్చి ఇంటి వద్దే పెంచేలా ప్రోత్సహిస్తామన్నారు.

ఇదీ చదవండి:

Sreevari temple in Visakha: ఆధ్యాత్మిక సౌరభం.. సాగర తీరాన శ్రీవారి ఆలయం

ABOUT THE AUTHOR

...view details