Southwest Monsoon: నైరుతీ రుతుపవనాలు క్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం కర్ణాటక, తమిళనాడులోని వవిధ ప్రాంతాలకు విస్తరించినట్టు భారత వాతావరణ విభాగం తెలియచేసింది. రాగల 24 గంటల్లో బంగాళాఖాతంతో పాటు ఈశాన్య రాష్ట్రాలు, సిక్కీ, పశ్చిమబెంగాల్ తదితర ప్రాంతాలకూ విస్తరించనున్నట్టు తెలియచేసింది. కర్ణాటక, తమిళనాడులోని అన్ని ప్రాంతాలకూ విస్తరించిన అనంతరం ఒకటీ రెండు రోజుల్లో రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణాలకూ రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు అవుతున్నట్టు ఐఎండీ తెలిపింది. అటు ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, సిక్కీంరాష్ట్రాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదు అయ్యే సూచనలు ఉన్నట్టు తెలిపింది.
కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉష్ణగాలుల ప్రభావం 24 గంటల్లో తగ్గుముఖం పట్టే అవకాశముందని ఐఎండీ తెలియచేసింది. మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్రతుపాను బిపర్ జోయ్ గంటకు 9 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతున్నట్టు ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం ముంబైకి 630 కిలోమీటర్లు, గోవాకు 700కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాగల 24 గంటల్లో ఇది క్రమంగా గుజరాత్ తీరం వైపునకు కదులుతుందని స్పష్టం చేసింది. 24 గంటల అనంతరం ఇది వాయువ్య దిశగా కదులుతుందని తెలిపింది. దీంతో పశ్చిమతీర ప్రాంత రాష్ట్రాల్లో ఈ నెల 15 తేదీ వరకూ చేపలవేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరికలు జారీచేసింది.
ఈ నెల 10వ తేదీన నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కేరళలోని మిగిలిన భాగాలు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మొత్తం భాగాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలు, వాయువ్య బంగాళాఖాతం లోని కొన్ని ప్రాంతాల్లోకి వాయువ్య బంగాళాఖాతం మరియు ఈశాన్య రాష్ట్రాలలోని చాలా ప్రాంతాల లోకి మరింత ముందుకు సాగాయి.