ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AB Leave Petition: ఏబీ వెంకటేశ్వరరావు అనుబంధ పిటిషన్‌ తోసిపుచ్చిన హైకోర్టు

By

Published : Jul 5, 2023, 9:43 AM IST

Senior IPS Officer AB Leave Petition: ఆర్జిత సెలవులపై విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలంటూ సీనియర్‌ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను సాంకేతిక కారణాలు చూపుతూ హైకోర్టు తోసిపుచ్చింది.

high
high

Senior IPS Officer AB Leave Petition:ఆర్జిత సెలవులపై విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలంటూ సీనియర్‌ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను సాంకేతిక కారణాలు చూపుతూ హైకోర్టు తోసిపుచ్చింది. అనుమతి నిరాకరిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్‌ చేయాలని అనుబంధ పిటిషన్లో కోరకుండా విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని మాత్రమే కోరారని గుర్తు చేసింది. సీఎస్‌ ఉత్తర్వులను సస్పెండ్‌ చేస్తేనే తదనంతర పర్యావసానంగా విదేశాలకు అనుమతిచ్చే వ్యవహారం ఉత్పన్నమవుతుందని తెలిపింది. అనుబంధ పిటిషన్​ను కొట్టేస్తున్నట్లు, విచారణను ఈ నెల 7కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది శరత్​ చంద్ర వెంటనే స్పందిస్తూ.. తాము దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లో చోటుచేసుకున్న సాంకేతిక పొరపాటు కారణంగా పిటిషనర్‌ వ్యక్తిగత స్వేచ్ఛపై ప్రభావం పడుతోందన్నారు. లోపాన్ని సరిదిద్దుకొని వెంటనే అనుబంధ పిటిషన్‌ దాఖలు చేస్తానని మధ్యాహ్నం విచారణ చేయాలని కోరారు. అందుకు అనుమతిచ్చిన హైకోర్టు.. మధ్యాహ్నం విచారణ జరిపి బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం జడ్జ్​ జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌ ఆదేశాలిచ్చారు.

ఆర్జిత సెలవులపై 41 రోజులు విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని చేసిన అభ్యర్థనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం వాదనలు పూర్తి కావడంతో మంగళవారం నిర్ణయాన్ని ప్రకటిస్తామని న్యాయమూర్తి వెల్లడించారు. సాంకేతిక కారణాలు చూపుతూ మంగళవారం అనుబంధ పిటిషన్ను తోసిపుచ్చారు. మరోవైపు అనుమతి నిరాకరిస్తూ సీఎస్‌ జారీ చేసిన మెమోను సస్పెండ్‌ చేసి తనను విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని పిటిషనర్‌ తాజాగా దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై బుధవారం విచారణ జరుపుతామని తెలిపారు.

సోమవారం వాదనలు ఇలా: ఆర్జిత సెలవులపై తాను 41 రోజులు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో అత్యవసర వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై న్యాయవాది శరత్‌చంద్ర వాదనలు వినిపించారు. పిటిషనర్‌ విజ్ఞప్తిని సీఎస్‌ తిరస్కరించారని.. శాఖాపరమైన విచారణ 2021 నుంచి పెండింగ్‌లో ఉందని కోర్టుకు నివేదించారు. దాన్ని కారణంగా చూపుతూ పిటిషనర్‌ అభ్యర్థనను తిరస్కరించడానికి వీల్లేదని కోర్టుకు తెలిపారు.

దరఖాస్తు చేసిన 21 రోజుల్లో నిర్ణయం వెల్లడించని కారణంగా అనుమతి లభించినట్లు భావిస్తున్న తరుణంలో.. అందుకు భిన్నంగా ఈఎల్‌ సెలవులు మంజూరు చేయకపోవడం సరికాదని న్యాయవాది వాదనలు వినిపించారు. ఏ నిబంధనలను కారణంగా చూపుతూ సెలవులు నిరాకరించారో అవి పిటిషనర్‌కు వర్తించవని న్యాయవాది తెలిపారు. సీఎస్‌ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి పిటిషనర్‌ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును న్యాయవాది కోరారు.

మరోవైపు హోం శాఖా తరఫు న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్‌పై క్రమశిక్షణ చర్యలు, క్రిమినల్‌ కేసు పెండింగ్‌లో ఉన్నాయని.. అనుమతి ఇవ్వాలా లేదా అనేది సంబంధిత అధికారుల విచక్షణాధికార పరిధిలోని వ్యవహారం అని అన్నారు. సీఎస్‌ ఉత్తర్వులపై ఏదైనా అభ్యంతరం ఉంటే కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్​ను ఆశ్రయించాలి కానీ.. హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు. వ్యాజ్యానికి విచారణ అర్హత లేదని కోర్టుకు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details