గుంటూరు జిల్లా నడికుడి స్టేట్ బ్యాంక్ చోరీ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 21న బ్యాంకుకు కన్నం వేసి 77 లక్షల రూపాయలు చోరీ చేశారు. పోలీసులు వెంటనే స్పందించటంతో పాటు.. ఆధునిక సాంకేతికత ఉపయోగించి దొంగలను పట్టుకున్నట్లు గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు.
నడికుడి ఎస్బీఐ చోరీ కేసులో నిందితులు అరెస్ట్.. రూ.77 లక్షలు స్వాధీనం - గుంటూరు జిల్లాలో బ్యాంకు వార్తలు
వారిపై గతంలో ఎలాంటి నేరచరిత్ర లేదు. అయితే ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధల నుంచి బయటపడేందుకు యూట్యూబ్ వీడియోలు చూసి దొంగతనానికి పాల్పడ్డారు ఆ యువకులు. ఏకంగా బ్యాంకుకే కన్నం వేశారు. నడికుడి స్టేట్ బ్యాంక్లో చోరీకి పాల్పడి ఏకంగా 77 లక్షల రూపాయలను ఎత్తుకెళ్లారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని డబ్బును స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరూ తెలంగాణ రాష్ట్రానికి చెందినవారిగా పోలీసులు తెలిపారు.
![నడికుడి ఎస్బీఐ చోరీ కేసులో నిందితులు అరెస్ట్.. రూ.77 లక్షలు స్వాధీనం sbi bank robbery case in Guntur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9692571-372-9692571-1606548010709.jpg)
తెలంగాణాలోని మిర్యాలగూడకు చెందిన కేదారి ప్రసాద్, వినయ్ రాములుని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీరిద్దరికీ గతంలో ఎలాంటి నేరచరిత్ర లేదని.. అయితే యూట్యూబ్ వీడియోలు చూసి దొంగతనానికి పాల్పడ్డారని వివరించారు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల నుంచి బయటపడేందుకు దొంగతనం చేసినట్లు నేరస్తులు చెప్పినట్లు తెలిపారు. దొంగతనం చేసిన వారు పట్టుబడకుండా సిసి టీవి వైర్లు కత్తిరించటం, మాస్కులు ధరించటం, ఘటనా స్థలంలో కారం చల్లటం వంటి జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దొంగలను పట్టుకోవటంతో పాటు చోరీ చేసిన రూ.77 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. దేశంలో అత్యధిక మొత్తం బ్యాంకు దొంగతనాల్లో ఇదీ ఒకటన్నారు.
ఇదీ చదవండి:వైకాపా పాలనలో ప్రజలపై పన్నుల మోత: యనమల