గుంటూరు జిల్లా నకరికల్లు మండలం చీమలమర్రు వద్ద ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు భారీగా గోవా మద్యాన్ని పట్టుకున్నారు. నరసరావుపేట ఎక్సైజ్ సూపరిండెంట్ చంద్రశేఖరరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...మినీ లారీలో అక్రమంగా గోవా మద్యం తరలిస్తున్నారన్న సమాచారంతో వాహన తనిఖీలు చేపట్టి మద్యాన్ని గుర్తించామన్నారు. 100 కేసుల్లో 12 లక్షల విలువ చేసే 2,640 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న గుంటూరు జిల్లా ఈపూరు మండలం కొచ్చెర్ల గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ అశోక్, ప్రకాశం జిల్లా కురిచేడుకు చెందిన మరో నిందితుడు శ్యామ్ ప్రసాద్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు. మరో ఇద్దరు నిందితులు కొచ్చర్లకు చెందిన రమేష్, ప్రకాశం జిల్లా కామేపల్లికి చెందిన నరేశ్లు పరారీలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. వారి కోసం గాలింపుచర్యలు చేపట్టామన్నారు.