టాటా ఏస్-లారీ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలైన ఘటన గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలో జరిగింది. సత్తెనపల్లి సమీపంలోని గరికపాడుకు చెందిన రవి, అదే గ్రామానికి చెందినే నాగరాజు తాము పండించిన మిరపకాయల్ని గుంటూరు శీతల గిడ్డంగిలో నిల్వ ఉంచి తిరుగుపయనమయ్యారు. వారితో పాటు సత్తెనపల్లి రూరల్ ఠాణాలో హోంగార్డుగా పనిచేస్తున్న కృష్ణ నాయక్ తోడయ్యాడు. మేడికొండూరు మండలం పాలడుగు అడ్డరోడ్డు వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనం ముందు టైరు పంచర్ అయ్యి, అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ గాయపడ్డారు. ప్రథమ చికిత్స నిమిత్తం క్షతగాత్రుల్ని సత్తెనపల్లి ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. కృష్ణ నాయక్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలిస్తుండగా మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నామని మేడికొండూరు సీఐ ఆనందరావు తెలిపారు.
పాలడుగు అడ్డరోడ్డు వద్ద టాటా ఏస్-లారీ ఢీ, ఒకరు మృతి - guntur news updates
టాటా ఏస్-లారీ ఢీ కొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగులో జరిగింది.

గుంటూరు జిల్లా పాలడుగులో రోడ్డు ప్రమాదం