ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు రంగం సిద్ధమైంది. ఎంసెట్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఉపాధి అవకాశాలు బాగా లభించే కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఉత్తమ ర్యాంకర్లలో అత్యధికులు సీఎస్ఈలో చేరేందుకే మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది కొత్తగా సీఎస్ఈలో కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ అంశాలతో ప్రత్యేక కోర్సులు డిజైన్ చేసి కళాశాలల్లో ప్రవేశపెట్టారు. వీటిలో ప్రవేశాలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి పచ్చజెండా ఊపింది.
ప్రాంగణ ఎంపికల్లో ఎక్కువగా సాఫ్ట్వేర్ కంపెనీలే ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. ప్రతిభావంతులకు ఆకర్షణీయమైన వేతనాలు చెల్లిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాప్ ర్యాంకర్లు తొలుత సీఎస్ఈ, ఆ తరువాత ఈసీఈ కోర్సులో చేరటానికి ఇష్టపడుతున్నారు. పరిశ్రమల్లో యాంత్రికత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆటోమేషన్కు ప్రాధాన్యం ఏర్పడింది. సాఫ్ట్వేర్ రంగంలో కోడింగ్, ప్రోగ్రామింగ్ కన్నా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ), క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ భద్రత, కృత్రిమ మేధ, డేటా సైన్స్ విభాగాల్లో భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా ఈ విభాగాల్లో నిపుణులు లభించటం లేదని నాస్కామ్ సర్వేలో తేలింది.
పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా..
ఇప్పటి ఇంజినీరింగ్ మూడు, నాలుగు సంవత్సరాల్లో విడిగా నిర్వహించే శిక్షణ తరగతులు, సర్టిఫికేషన్ కోర్సుల వల్ల విద్యార్థులకు ప్రాథమిక అవగాహన మాత్రమే వస్తోందని ఉపాధి అవకాశాలు సాధించే స్థాయిలో పరిజ్ఞానం సంపాదించలేకపోతున్నారని నిపుణుల అధ్యయనంలో స్పష్టమైంది. ఈ నేపథ్యంలో బీటెక్లో ఈ కొత్త సబ్జెక్టులతో కోర్సులు ప్రారంభిస్తే నాలుగేళ్లలో విద్యార్థులు బాగా నేర్చుకోవటంతో పాటు పరిశ్రమల అవసరాలకు సరిపడా నైపుణ్యాలు సాధిస్తారని ఉన్నత విద్యామండలి సూచించింది. విజ్ఞాన్, కేఎల్సీ డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల, వీవీఐటీ, ఆర్వీఆర్అండ్జేసీ, నరసరావుపేట తదితర ఇంజినీరింగ్ కళాశాలల్లో సీఎస్ఈలో భాగంగా డేటా సైన్స్, కృత్రిమ మేధ, సైబర్ భద్రత కోర్సులను ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించారు. ప్రతి కోర్సులో 30 నుంచి 60 సీట్లు మంజూరు చేశారు. కొత్త కోర్సులతో పాటు వ్యవసాయ ఇంజినీరింగ్(ఏజీ బీటెక్), పుడ్సైన్స్(బీటెక్) కోర్సులపైన విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. కొత్త కోర్సులు ప్రవేశపెట్టటంతో పాటు అందుకు అనుగుణంగా అధ్యాపకులు, ఆచార్యుల్లో బోధనా నైపుణ్యాలు పెంపొందించాల్సిన బాధ్యత ఉన్నత విద్యామండలిపై ఉంది.