Nara Lokesh Fires on CM Jagan: సీఎం జగన్పై తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ నేత చనిపోతే పెడనకు హెలికాఫ్టర్లో వెళ్లి పరామర్శించిన ముఖ్యమంత్రి జగన్.. బాపట్ల జిల్లా రేపల్లెలో 10వ తరగతి చదువుతున్న బాలుడిని కిరాతకులు నిలువునా సజీవ దహనం చేస్తే వెళ్లాలనిపించలేదా అని నారా లోకేశ్ నిలదీశారు. ఆ బాధిత తల్లికి ప్రభుత్వం నుంచి చిన్నపాటి ఓదార్పు ఇవ్వలేకపోవడమే జగన్ మానవీయతా అని ధ్వజమెత్తారు.
Nara Lokesh Condemns TDP Activist Arrest : అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నట్లు లోకేశ్ తెలిపారు. సామాజిక మాధ్యమాలలో వైసీపీ ప్రభుత్వ అవినీతి, అరాచకాలని ప్రశ్నిస్తున్నాడనే కక్ష కట్టి మరీ తప్పుడు కేసు పెట్టారని మండిపడ్డారు. ఏ తప్పూ చేయని కేడర్కి పార్టీ అండగా ఉంటుందని.. అక్రమ కేసులని ధైర్యంగా ఎదుర్కొంటుందని హామీ ఇచ్చారు.
Atchennaidu Condemns the TDP Activist Arrest: కొంతమంది పోలీసులు వైఎస్సార్సీపీకి తొత్తులుగా పని చేస్తూ.. చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని తెలుగుదేశెం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. రాజమండ్రి బొమ్మూరు పోలీస్ స్టేషన్లో న్యాయం చేయమన్నందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారిని పోలీసులు కొట్టడం దారుణమని దుయ్యబట్టారు. అనంతపురం జిల్లా కూడేరులో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు పార్టీ కార్యకర్త చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారిని వేధించిన పోలీసులపై డీజీపీ చర్యలు తీసుకోవాలని.. అక్రమంగా అరెస్ట్ చేసిన టీడీపీ కార్యకర్త చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
TDP Leader Varla Ramaiah on Law and Order: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. తన అక్కను అల్లరి చేయొద్దని ప్రశ్నించిన పదవ తరగతి విద్యార్థి అమర్నాథ్ను పట్టపగలే పెట్రోల్ పోసి తగులబెడితే శాంతి భద్రతలు ఉన్నట్లా అని ప్రశ్నించారు. శాంతి భద్రతలు స్వయంగా పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రికి ఏమైనా నైతిక విలువలుంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Vangalapudi Anitha on Acid Attack in Eluru: ఏలూరులో మహిళపై యాసిడ్దాడి చేసిన ఘటనలో నిందితులను దిశ చట్టం ప్రకారం 21 రోజుల్లో శిక్షించే దమ్ము ప్రభుత్వానికి ఉందా ?అని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితప్రశ్నించారు. ఏలూరులో యాసిడ్ దాడికి గురైన మహిళను పరామర్శించేందుకు మణిపాల్ హాస్పిటల్కి వచ్చిన ఆమెను మొదట పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం బాధితురాలి బంధువులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలిని కలిసేందుకు అనుమతి కోరామని.. అనుమతివ్వగానే మరోసారి వచ్చి కలుస్తామని అనిత తెలిపారు. ప్రస్తుతం బాధితురాలు ఐసీయూలో చికిత్స పొందుతుందని తెలిపారు. దాడిలో ఓ కంటిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెను పూర్తి స్థాయిలో ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. ఆడవాళ్లని రక్షించ లేని దుర్మార్గ ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.