గత ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులను వైకాపా ప్రభుత్వం కావాలనే పెండింగ్లో పెట్టిందని ఆంధ్రప్రదేశ్ పంచాయత్ పరిషత్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ముల్లంగి రామకృష్ణా రెడ్డి అన్నారు. మాజీ సర్పంచులైన తాము కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఎన్నికైనట్లు ఆయన తెలిపారు. వైకాపా ప్రభుత్వం తెదేపాపై కక్ష సాధింపు ధోరణితో బిల్లులు చెల్లించడంలేదన్నారు.
బిల్లులు చెల్లించే యోచనలో ప్రభుత్వం లేదని రామకృష్ణా రెడ్డి అన్నారు. మాజీ సర్పంచులంతా కలిసి పెండింగ్ బిల్లుల కోసం హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశామన్నారు. ఈ వ్యాజ్యంపై కోర్టులో విచారణ జరుగుతుందన్నారు. పంచాయతీ అభివృద్ధి పనులు చేసేటప్పుడు అన్ని స్థాయిల అధికారులు పరిశీలించి బిల్లులు చెల్లించేందుకు అనుమతి ఇచ్చినా ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా రాలేదని ఆయన చెప్పారు.