ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బెదిరించి సంపాదించాలనే.. అమాయకుడి హత్య - mangalagiri dsp news

ఓ సారి బెదిరించడం ద్వారా డబ్బు సంపాదించిన ఆ వ్యక్తి.. మరోసారి మరింత మొత్తంలో డబ్బు రాబట్టాలంటే.. ఎవరిదైనా చెయ్యి నరికి చూపెట్టి, తీవ్రంగా భయపెట్టడం ద్వారా అనుకున్నది సాధించాలనుకున్నాడు. అయితే ఈ క్రమంలో ఓ అమాయకుడ్ని కిరాతకంగా చంపేసి, అతని చెయ్యిని నరికి తీసుకెళ్తూ నల్లపాడు పోలీసులకు పట్టుబడ్డాడు. మార్చి 30వ తేదీ రాత్రి.. గుంటూరు జిల్లా పెదకాకాని మండల పరిధిలోని రామచంద్రాపాలెం రోడ్డులో జరిగిన దారుణ హత్యకు సంబంధించిన వివరాలను మంగళగిరి డీఎస్పీ దుర్గాప్రసాద్‌ వెల్లడించారు.

mangalagiri dsp revealing details of the murder
హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ

By

Published : Apr 7, 2021, 8:56 AM IST

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం, పుచ్చకాయలపల్లికి చెందిన శెట్టి గాలయ్య పొలం పనులు చేసుకుంటూ ఉండేవాడు. ఇతను మద్యం, ఇతర వ్యసనాలకు బానిసయ్యాడు. గతంలో మావోయిస్టులు తమ ప్రాంతంలోని లక్షాధికారులను గుర్తించి, బెదిరింపు లేఖలు పంపి, డబ్బు రాబట్టారని ఎవరి ద్వారానో తెలుసుకున్నాడు. తాను కూడా అలాగే చేయాలని భావించి, ఓ ఆసామిని తీవ్రంగా బెదిరిస్తూ వారి ఇంటి ఆవరణలో ఓ లేఖ పడేశాడు. తాను చెప్పినట్టు రూ.లక్ష నగదును సంకేత స్థలంలో ఉంచకపోతే చంపేస్తానంటూ అందులో హెచ్చరించాడు. సదరు ఆసామి ఈయన లేఖలో పేర్కొన్నట్టే రూ.లక్ష నగదును సంకేత స్థలంలో ఉంచారు. అలా అయాచితంగా వచ్చిన డబ్బుతో జల్సా చేసిన గాలయ్య పైసలు అయిపోగానే గుంటూరు పరిసర ప్రాంతాలకు వచ్చి పొలం పనులు చేసుకోవడం ఆరంభించాడు.

ఈ క్రమంలో ఆర్నెల్ల క్రితం పరిచయమైన ప్రకాశం జిల్లా నడిగడ్డ గ్రామానికి చెందిన ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆమె తన కుమార్తెకు బంగారు వస్తువులు చేయించాలని పట్టుబట్టింది. ఓ వైపు అతనికి అప్పులు పెరిగిపోవడం, మరో వైపు ఆ మహిళ ఒత్తిడి కారణంగా అక్కడ ఉండలేక పనులు చేసుకునేందుకు గుంటూరు జిల్లా నరసరావుపేట చేరుకున్నాడు. మళ్లీ ఎవరినైనా బెదిరించి ఆమేరకు డబ్బు రాబట్టాలని భావించాడు. ఈ సారి ఎవరి చెయ్యినైనా నరికి తీసుకెళ్లి, దాన్ని చూపి, ఆసామి నుంచి అధికంగా డబ్బు రాబట్టాలనే రాక్షస ఆలోచన వచ్చింది.

ఈ సమయంలోనే కృష్ణాజిల్లా బాపులపాడు మండలం, ఓగిరాల గ్రామానికి చెందిన చిన మారయ్య ఆయనకు పరిచయమయ్యాడు. ఈయన నరసరావుపేటలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద చెరకు రసం అమ్ముకుని జీవిస్తుంటాడు. మారయ్య అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఎలాగైనా అతన్ని అంతమొందించి, అతని చెయ్యి నరికి తీసుకెళ్లి, పెద్దారవీడులోని ఆసామికి చూపి అధిక మొత్తంలో రాబట్టాలని పథకం వేశాడు గాలయ్య. గత నెల 30వ తేదీ రాత్రి మారయ్యకు ఏవో మాయమాటలు చెప్పి అతన్ని తనతో పెదకాకాని మండల పరిధిలోని రామచంద్రాపాలెం రోడ్డులోకి తీసుకొచ్చాడు.

అక్కడ గాలయ్య, మారయ్యలిద్దరూ పూటుగా మద్యం తాగారు. మత్తులో ఉన్న మారయ్యను అక్కడున్న సరిహద్దు రాయితో కొట్టి చంపి, వెంట తెచ్చుకున్న కత్తితో అతని చెయ్యిని తెగ నరికి, ఓ సంచిలో వేసుకొని వెళ్తున్న గాలయ్యను అనుమానంతో ఆపారు నల్లపాడు పోలీసులు. అతని వద్దనున్న సంచిని పరిశీలించిన వారికి అందులో నరికిన చెయ్యి కన్పించింది. అతనుపయోగించిన కత్తిని, ఆ చెయ్యిని వారు స్వాధీనం చేసుకున్నారని డీఎస్పీ చెప్పారు. త్వరితగతిన కేసును ఛేదించిన ఇన్‌ఛార్జి సీఐ వాసు, ఎస్సై వినోద్‌కుమార్‌, పీఎస్సై కోటేశ్వరరావు, సిబ్బందిని ఆయన అభినందించారు.

ఇదీ చదవండి:జొన్న చేలో శవం.. సంచిలో చెయ్యి.. ఏంటా మిస్టరీ.. !?

ABOUT THE AUTHOR

...view details