కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని ఆయకట్టుకు జులై తొలి వారంలో సాగునీరు ఇవ్వడానికి జలవనరులశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. జులై నెలలో నార్లు పోసుకుని నాట్లు వేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకు అనుగుణంగా నీటి విడుదలకు జలవనరులశాఖ ప్రణాళిక రూపొందించింది. కృష్ణానదికి వరదలు వచ్చి బ్యారేజీకి నీరు చేరేటప్పటికీ ఆలస్యమవుతుందని గుర్తించిన జలవనరులశాఖ గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా ప్రకాశం బ్యారేజీకి తరలిస్తున్నారు. బ్యారేజీకి వచ్చిన నీటిని ప్రస్తుతం కృష్ణా తూర్పు డెల్టాకు విడుదల చేస్తున్నారు. గోదావరి నదిలోనూ రోజువారీగా సగటున 20వేల క్యూసెక్కులకు మించి ప్రవాహం లేకపోవడంతో పట్టిసీమ పంపులను పూర్తిస్థాయిలో వాడుకొనే పరిస్థితి లేదు గోదావరి డెల్టాకు 15వేల క్యూసెక్కుల వరకు నీటిని తీసుకుంటున్నారు. మిగిలిన నీటిలో పట్టిసీమ ద్వారా సగటున 4500 క్యూసెక్కులు పంపు చేస్తున్నారు.
గోదావరిలో నీటి ప్రవాహం పెరిగితే పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో ఉన్న 24 పంపులు వినియోగించి 8వేల క్యూసెక్కులకుపైగా నీటిని పంపింగ్ చేసుకోవచ్ఛు గోదావరి పరివాహక ప్రాంతంలో పూర్తిస్థాయిలో వర్షాలు లేకపోవడంతో ప్రవాహం ఆశించినంతగా లేదు. జులై తొలి వారానికి గోదావరిలో నీటి ప్రవాహం పెరుగుతుందన్న అంచనాతో జలవనరులశాఖ కృష్ణా పశ్చిమ డెల్టాలో సాగునీటి విడుదలకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం పట్టిసీమ నుంచి వస్తున్న నీటిని కృష్ణా తూర్పు డెల్టాలో సాగునీటి అవసరాలకు విడుదల చేస్తుండగా మిగిలిన నీటిని పశ్చిమ డెల్టాలో తాగునీటి అవసరాలకు విడుదల చేయాలని నిర్ణయించారు. శుక్రవారం 700 క్యూసెక్కులు పశ్చిమ డెల్టా కాలువలకు విడుదల చేయనున్నట్లు జలవనరులశాఖ వర్గాలు తెలిపాయి.