ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పల్నాటి సీమలో పోరాట కెరటం 'కోడెల'

చేయి తిరిగిన సర్జన్​గా ఎందరి ప్రాణాలనో నిలిపిన ఆయనే... ఆ తర్వాత నాయకుడిగానూ.. ఎంతో మందికి అండగా నిలబడ్డారు. పల్నాటి ప్రాంతంలో అన్యాయాలకు ఎదురొడ్డి నిలిచారు. తెదేపాలో అగ్రనేతగా ఎదిగారు. ఆయనే డాక్టర్ గారు అని అందురూ పిలుచుకునే కోడెల శివప్రసాదరావు...! సామాన్య కుటుంబం నుంచి వచ్చి అసామాన్యుడిగా ఎదిగిన డాక్టర్ కోడెల అనూహ్యంగా తనువు చాలించారు.

By

Published : Sep 16, 2019, 4:17 PM IST

Published : Sep 16, 2019, 4:17 PM IST

Updated : Sep 16, 2019, 5:02 PM IST

kodela shivaprasad


కోడెల శివప్రసాదరావు....రాష్ట్రంలో పరిచయం అక్కర్లేని పేరు. గుంటూరు జిల్లా రాజకీయాల్లో కీలకనేత..! మనిషి బక్కపలుచగా ఉన్నా గుండె ధైర్యం మెండుగా ఉన్న నాయకుడు. పల్నాడులోని ప్రత్యేక రాజకీయ పరిస్థితులకు ఎదురు నిలిచిన తిరుగులేని నేత...! సామాన్య రైతు కుటుంబంలో పుట్టి.. అంచెలంచెలుగా ఎదిగి.. నవ్యాంధ్రప్రదేశ్ ప్రప్రథమ సభాపతి స్థానాన్ని అందుకున్నారు. తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లోకి వచ్చి, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవులు చేపట్టిన ఆయన... అనూహ్య పరిస్థితిల్లో లోకాన్ని వీడారు. చివరి రోజుల్లో రాజకీయ ఒత్తిడి, కుటుంబ సభ్యులపై వచ్చిన అవినీతి ఆరోపణలు తనపై నమోదైన కేసులతో తీవ్ర మానసిక సంఘర్షణకు లోనయ్యారు. అనూహ్యంగా సోమవారం చనిపోయారు. రాజకీయ వేధింపులతో బలవన్మరణానికి పాల్పడ్డారనే కుటుంబసభ్యులు చెబుతున్నారు.

వైద్యుడిగా వచ్చి.. నాయకుడిగా ఎదిగి..

గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లకుంటలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో 1947 మే 2న కోడెల జన్మించారు. ప్రాధమిక విద్య సొంతఊరిలో పూర్తి చేసిన కోడెల.. విజయవాడ లయోలాలో పీయూసీ చదివారు. గుంటూరు మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తిచేశారు. వారణాసిలో పీజీ చేసిన కోడెల...నరసరావుపేటలో ఆస్పత్రిని ప్రారంభించి పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన వైద్యం అందించారు. పల్నాడు ప్రాంతంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుగా గుర్తుకు వచ్చేది నరసరావుపేటలోని కోటే. ఆయన హస్తవాసి గొప్పదని పేరు రావడంతో చుట్టుపక్కల గ్రామాల్లో కోడెలకు మంచి పేరు వచ్చింది. ఎన్టీఆర్ పిలుపుతో 1983లో వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1983 నుంచి 2004 వరకు వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన గుంటూరు జిల్లాలో తిరుగులేని నేతగా నిలిచారు. రెండు సార్లు అపజయం ఎదురవడంతో 2014లో సత్తెనపల్లి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.

పల్నాటి ఫైర్​బ్రాండ్

చూడటానికి బక్కపలుచగా.. మాటల్లో మృదువుగా కనిపించే కోడెల.. రాజకీయాల్లో మాత్రం పల్నాటి పౌరుషం చూపించారు. పల్నాడులోని ప్రత్యేక రాజకీయ పరిస్థితులను, ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొన్నారు. యువనేతగా పల్నాటి పౌరుషాన్ని చూపిన ఆయన వయసు పెరిగే కొద్దీ పెద్దరికాన్ని నిలుపుకున్నారు. గుంటూరు జిల్లాలో పార్టీకి పెద్దదిక్కుగా మారారు. రాష్ట్రంలో కీలకనేతగా ఎదిగారు. యువనేతగా ఉన్న కాలంలోనే ఎన్నీఆర్ ప్రభుత్వంలో రాష్ట్ర హోంశాఖ వంటి కీలకపదవులు చేపట్టారు. చంద్రబాబు హయాంలో పంచాయతీరాజ్, భారీ నీటి పారుదల, ఆరోగ్య శాఖమంత్రిగా పనిచేశారు. కోడెల మొదటి నుంచి దూకుడైన నేతగానూ పేరొందారు. ఆ దూకుడే ఆయన్ను కార్యకర్తలకు కూడా దగ్గర చేసింది. సీనియర్ నేతగా మారాక కాస్త తగ్గినప్పటికీ అవసరం వచ్చినప్పుడు ఎందాకైనా వెళతారన్న దానికి మొన్నటి ఎన్నికలే తాజా ఉదాహరణ. మొన్నటి ఎన్నికల్లో ఓ పోలింగ్ బూత్​లో తమ కార్యకర్తలను అడ్డుకుంటున్నారని తెలిసి.. కోడెల స్వయంగా అక్కడికి వెళ్లిపోయారు. ఆయనపై దాడి కూడా జరిగింది.

నవ్యాంధ్ర తొలి సభాపతి

ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభకు ఆయన సభాపతిగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ నూతన శాసనసభ నిర్మాణాన్ని పర్యవేక్షించారు. అమరావతిలో మహిళా పార్లమెంట్ నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు.

స్వచ్చ సంకల్పం

కోడెల శివప్రసాదరావు సత్తెనపల్లికి మారిన తర్వాత.....ఆ నియోజకవర్గం రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. స్వచ్చ ఆంధ్రప్రదేశ్​లో భాగంగా డాక్టర్ కోడెల శివ ప్రసాద రావు తన నియోజకవర్గంలో లక్ష మరుగుదొడ్లు నిర్మించి, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, శ్మశానవాటికలు, స్వచ్ఛ భారత్‌ వంటి కార్యక్రమాల్లో చొరవ చూపించి నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలిపారు. సత్తెనపల్లి చెరువును ట్యాంకుబండ్‌గా మార్చి అతిపెద్ద NTR విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిగ్రామానికి తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. కోడెలకు సాంప్రదాయాలంటే మక్కువ. పల్లెలంటే ఇష్టం. దైవభక్తి కూడా ఎక్కువే. అందుకే తన నియోజకవర్గ పరిధిలోని కోటప్పకొండ ఆలయ అభివృద్ధిలో కోడెల ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది.

వివాదాలు

దూకుడు స్వభావం ఆయన్ను కార్యకర్తలకు దగ్గర చేసినా....కొన్ని వివాదస్పద అంశాలు అయన్ను రాజకీయంగా ఇరుకునపెట్టాయి. పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా ఉన్నకాలంలో 1999 ఆగస్టు 30న ఆయన ఆసుపత్రిలో పేలిన నాటుబాంబులు రాష్ట్రవ్యాప్తంగా సంచనలం సృష్టించాయి. అయితే ఈ ఘటనతో ఆయనకు ఎలాంటి సంబంధంలేదని సీబీఐ క్లీన్‌చిట్‌ ఇచ్చింది. సభాపతిగా ఉన్న కాలంలో అప్పటి ప్రతిపక్ష వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాలో చేరినా.. వారిపై కోడెల చర్యలు తీసుకోలేదని వైకాపా ఆరోపణలు చేసింది. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చాక కోడెలపైనా.. ఆయన కుటుంబసభ్యులపైనా ఆరోపణలు తీవ్రమయ్యాయి. కోడెలతో పాటు... ఆయన కుమారుడు శివరాం, కుమార్తె విజయలక్ష్మిపైనా కేసులు నమోదయ్యాయి. తనను వ్యక్తిగతంగా వేధిస్తున్నారంటూ కోడెల ఆవేదన చెందారు.

అనూహ్య మరణం

ఈ క్రమంలోనే ఆయనకు కొన్ని రోజుల కిందట స్వల్ప గుండెపోటు వచ్చింది. గుంటూరులో చికిత్స అనంతరం ఆయన హైదరాబాద్​లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇవాళ హఠాత్తుగా ఆయన అనుమానస్పద స్థితిలో చనిపోయారు. మొదట గుండెపోటు అని ప్రచారం జరిగినా.. కుటుంబసభ్యులు ఇది బలవన్మరణం అని ఫిర్యాదు చేశారు. స్వయంగా వైద్యుడైన కోడెల కొన్ని ఇంజక్షన్లు మోతాదుకు మించి తీసుకోవడం వల్లే గుండెపోటు వచ్చిందని ప్రచారం జరుగుతోంది. వైకాపా ప్రభుత్వ వేధింపుల వల్లే కోడెల చనిపోయారని కుటుంబసభ్యులు, తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు.

Last Updated : Sep 16, 2019, 5:02 PM IST

ABOUT THE AUTHOR

...view details