Kakatiya sand box program in Nizamabad: తెలంగాణ ఆవిష్కరణలకు కేంద్రంగా మారుతోంది. అనేక అంకుర పరిశ్రమలు, ఐటీ, సాంకేతిక సంస్థలు ఈ గడ్డమీద ప్రాణం పోసుకుంటున్నాయి. అయితే ఈ సంస్థలన్నీ హైదరాబాద్కే పరిమితం అవుతూ వస్తుండగా, ఉత్తర తెలంగాణాలో కూడా వాటికి సంబంధించిన ప్రతిభా సామర్థ్యాలను ప్రోత్సహించడం సహా రైతులకు ఆధునిక పద్ధతుల్లో శిక్షణ, మహిళల సాధికారత కల్పన అనే ఉద్దేశంతో ఏర్పాటైన స్వచ్ఛంద సంస్థ కాకతీయ సాండ్ బాక్స్. కళాశాల విద్యార్థులకు సాంకేతిక కోర్సులు, నైపుణ్య శిక్షణ, కమ్యూనికేషన్ స్కిల్స్ సహా అనేక కోర్సుల్లో ఈ సంస్థ శిక్షణనిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్థులకు కూడా స్కిల్ ఇన్ విలేజ్ కింద ఆంగ్లబోధనతో పాటు జీవితంలో ఎదిగేందుకు అవసరమైన శిక్షణను అందిస్తోంది. మహిళలు స్వయం ఉపాధి సాధించేలా తర్ఫీదు ఇవ్వడం సహా అన్నదాతలకు ఆధునిక సాగు పద్ధతులు నేర్పిస్తూ ఖర్చులు తగ్గి దిగుబడి పెంచేలా తన వంతు కృషి చేస్తోంది కాకతీయ సాండ్బాక్స్.
గ్రామీణ ఆర్థికాభివృద్దికి కృషి చేస్తోంది: ఉత్తర తెలంగాణను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు 2013లో రాజురెడ్డి, సామా ఫణీంద్ర అనే ఇద్దరు కలిసి కాకతీయ సాండ్బాక్స్ను నిజామాబాద్ లో స్థాపించారు. కర్ణాటక హుబ్లీలోని దేశ్పాండే ఫౌండేషన్ స్ఫూర్తితో దీనిని స్థాపించారు. కాకతీయ సాండ్ బాక్స్లో మొత్తం 270 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. నాలుగు అంశాల్లో ఈ సంస్థ పలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వ్యవసాయం, స్కిల్లింగ్, మైక్రో ఎంటర్ ప్రెన్యూర్షిప్లో శిక్షణ సహా స్టార్టప్లను ప్రోత్సహిస్తున్నారు. ప్రతి అంశంలోనూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామీణ ఆర్థికాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు.
విద్యార్థులకు ఆంగ్లంపై పట్టు వచ్చేలా కృషి:కాకతీయ సాండ్బాక్స్ గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం స్కిల్ ఇన్ విలేజ్ అనే కార్యక్రమం నిర్వహిస్తోంది. పాఠశాల దశలోనే ఇంగ్లీషు మీద మంచి పట్టు సాధించేందుకు దీన్ని చేపట్టారు. అయిదు నుంచి ఎనిమిది తరగతుల విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంగ్లంతో పాటు కమ్యునికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ను పెంపొందించడం దీని ఉద్దేశం. ప్రస్తుతం 20 పాఠశాలల్లో దీన్ని నిర్వహిస్తున్నారు. దీని కోసం సిద్ధిపేట, నిజామాబాద్ జిల్లాలోని పది చొప్పున గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలను ఎంచుకున్నారు. వచ్చే ఏడాది నుంచి 40 ప్రభుత్వ పాఠశాలలకు దీన్ని విస్తరించనున్నారు. కాకతీయ సాండ్బాక్స్ సంస్థ ద్వారా శిక్షణ పొందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉన్నత విద్యలో సత్తా చాటుతున్నారు. గతేడాది ఎనిమిది మంది విద్యార్థులు బాసర త్రిపుల్ ఐటీలోనూ చోటు సంపాందించారు.
డిగ్రీ విద్యార్థులకు స్కిల్స్ పెంచుకొనేలా కోర్సులు: డిగ్రీ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ కోసం కాకతీయ సాండ్బాక్స్ స్కిల్ ప్లస్, స్కిల్ ప్లస్-ఆర్ అనే కార్యక్రమాలు నిర్వహిస్తోంది. బీఏ, బీకాం, బీజెడ్సీ వంటి డిగ్రీ పాసైన వారి కోసం సుసంది, కౌటిల్య అనే రెండు కోర్సులు ఉన్నాయి. సుసంది కింద బీఏ, బీఎస్సీ, కౌటిల్య కింద బీకాం విద్యార్థులకు కోర్సులు అందిస్తున్నారు. వీటికి నాలుగు నెలల కాల పరిమితి ఉంటుంది. దీనిలో ఇంగ్లిష్ కమ్యునికేషన్ స్కిల్, రీజనింగ్ అండ్ అప్టిట్యూడ్, ఐసీటీ-ఇన్ఫర్మేషన్ కమ్యునికేషన్ టెక్నాలజీ, కంప్యూటర్, టైపింగ్, ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్, లీడర్ షిప్ డెవలప్ మెంట్ ను ప్రాక్టికల్, థియరికల్ గా నేర్పిస్తారు. శిక్షణ తర్వాత ఉద్యోగాలు పొందేందుకు సైతం సహకారం అందిస్తోంది కాకతీయ సాండ్బాక్స్.
కళాశాల్లోనే అన్ని అంశాలు నేర్పిస్తారు: విద్యార్థులు డిగ్రీ పాసైన తర్వాత తమ శిక్షణా కేంద్రానికి వచ్చి నేర్చుకునే బదులు కాకతీయ సాండ్బాక్స్ ఉద్యోగులే కళాశాలలకు వెళ్లి నేర్పిస్తారు. దీన్ని స్కిల్ ప్లస్గా వ్యవహరిస్తున్నారు. ఇందుకోసం కళాశాలలతో ఎంఓయూ చేసుకుంటున్నారు. రెసిడెన్షియల్లో నేర్పిన అన్ని అంశాలను కళాశాలల్లోనూ నేర్పిస్తారు. ఈ సంస్థ ద్వారా శిక్షణ తీసుకున్న78మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. ఒక విద్యార్థిని దిగ్గజ సంస్థ గూగుల్లో మంచి ప్యాకేజీతో ఉద్యోగం సాధించింది. కాకతీయ సాండ్బాక్స్ నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిద్దిపేట క్లస్టర్లుగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఒక్కో క్లస్టర్ లో మూడు నుంచి నాలుగు కళాశాలలు ఉంటాయి.