YCP STICKERS: ప్రశ్నిస్తే పథకాలు తీసేస్తామంటున్నారు.. ఒక ఎమ్మెల్యే అయితే ఏకంగా 'ఇంకా మాట్లాడితే పళ్లు పీకేస్తా'నంటూ హూంకరించారు. 'నీకు పథకాలన్నీ రద్దు చేయిస్తా, నీ కథ చూస్తా' అంటూ ప్రత్యర్థి పార్టీ సానుభూతిపరుడిపై మరో ఎమ్మెల్యే గాండ్రించారు. ఇంకోచోట ఇంటికి స్టిక్కర్ అతికించొద్దన్నందుకు సొంత పార్టీకి చెందిన వ్యక్తినే వైసీపీ కౌన్సిలర్ అనుచరులు చితకబాదారు. 'జగనన్నే మా భవిష్యత్తు' అంటూ అధికార వైసీపీ శనివారం వరకు సాగించిన ప్రచార యాత్రలో.. 'మా నమ్మకం నువ్వే జగన్' అనే స్టిక్కర్లు ఇళ్లకు, జనాల సెల్ఫోన్లకూ అతికించారు. అదే సమయంలో ప్రశ్నించిన వారిని ఇష్టారీతిగా బెదిరించారు. ఇదేనా వైకాపా ప్రభుత్వం చెబుతున్న భవిష్యత్తు..? స్టిక్కర్లు అతికించొద్దన్నందుకు దాడికి తెగబడతారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
'కులం చూడం.. పార్టీ చూడం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు ఇస్తాం' ఎన్నికల ప్రచారంలో, తర్వాత అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్ గొప్పగా చెప్పే మాటలివి. కానీ, 'రైతు భరోసా వద్దా? నీవు టీడీపీ కార్యకర్తవని తెలుసు.. ఈసారి ఊరుకున్నాం, మళ్లీ తెదేపా వెంట తిరిగితే మీకు వచ్చే సంక్షేమ పథకాలన్నీ రద్దు చేయిస్తాం. మళ్లీ వచ్చేది మా ప్రభుత్వమే, నీ కథ చూస్తా' అని వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తన నియోజకవర్గంలో ఒక లబ్ధిదారుడిని హెచ్చరించారు.
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం నాగులాపల్లిలో ఎమ్మెల్యే రమణమూర్తి రాజును ఓ విద్యార్థి విద్యాదీవెన పథకంపై నిలదీశాడు. ఇవ్వకుండానే విద్యాదీవెన మంజూరైందని ఎలా చెబుతారని ఎమ్మెల్యేను ప్రశ్నించడంతో 'మీ స్కూల్లో ఇచ్చాంలే, ఇక్కడి నుంచి వెళ్లు' అంటూ విద్యార్థిపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. 'మళ్లీ ఓట్ల కోసం మా దగ్గరకు వస్తారు కదా? అప్పుడు మేం కూడా వెళ్లు వెళ్లు అంటాం..' అనేసరికి, 'ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా పళ్లు పీకేస్తా అట్టుకెళ్లి' అంటూ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు విద్యార్థి పైకి దూసుకువెళ్లారు.
ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి తన నియోజకవర్గం గంగాధర నెల్లూరులో పర్యటించిన సమయంలో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేయలేదంటూ కార్వేటి నగరంలో సోమశేఖర్, డీఎస్సీ వేయలేదని గురవరాజగుంట గ్రామంలో రేఖ అనే యువతి ఆయన్ను ప్రశ్నించగా..ఆయన దాటవేత వైఖరి ప్రదర్శించారు.
తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఒక కౌన్సిలర్.. తన వార్డులో అనుచరులను స్టిక్కర్లను అతికించేందుకు పంపారు. వారొచ్చినపుడు 'వార్డులో సమస్యలు చాలా ఉన్నాయి, నేను పార్టీ మనిషినే అయినా మా ఇంటికి స్టిక్కర్లు అతికించొద్దు' అని వైకాపాకు చెందిన ఒక వ్యక్తి అడ్డుచెప్పారు. అదేరోజు రాత్రి ఆ వ్యక్తిని మాట్లాడాలి రమ్మని భౌతికదాడి చేశారు.
విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఒకరోజు రాత్రిపూట వెళ్లి స్టిక్కర్లు అతికించే ప్రయత్నం చేయగా స్థానికులు వ్యతిరేకించారు. ఇలాగైతే మీకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇవ్వకుండా చేస్తామని వైసీపీ నాయకులు బెదిరించడంతో.. 'మీ జేబుల్లో నుంచి ఇస్తున్నారా? పథకాలు ఎందుకు ఆపేస్తారు?' అని స్థానికులు నిలదీశారు. దీంతో మెల్లగా జారుకున్నారు.
ఏలూరు జిల్లా కలిదిండి మండలం పెదలంకలో స్థానిక వైకాపా నాయకులు స్టిక్కర్లతో వెళ్లగా మా ఇళ్లకు అతికించొద్దంటూ గ్రామస్థులు అడ్డు చెప్పారు. నూజివీడులోని ఒక వార్డులో, వేలేరుపాడు, యలమంచిలి, వీవీ లంకలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తాడేపల్లిగూడెంలో రహదారులు, తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ వైసీపీ నేతలను స్థానికులు ప్రశ్నించారు. నిధులు రాగానే పనులు చేయిస్తామని చెప్పి నేతలు అక్కడ నుంచి వెళ్లిపోయారు.
తిరుపతి జిల్లాలోని వెంకటగిరిలో వైసీపీ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి 7వ వార్డు ఎన్టీఆర్ కాలనీలో తిరిగినపుడు మూడు నెలల నుంచి కుళాయిల్లో నీరురావడం లేదని జ్యోతి, ఉపాధ్యాయులకు జీతాలు సరిగా ఇవ్వడం లేదంటూ విశ్రాంత ఉపాధ్యాయిని రాజేశ్వరమ్మ నిలదీయంతో రామ్కుమార్ వేరే విషయాల గురించి ఏదో చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు.