ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇది పర్ణశాల.. రామ కుటీరం.. కాదు! గుంటూరులోని ఓ రెస్టారెంట్​..!

Innovative Restaurant శ్రీ రాముడు వనవాసానికి వెళ్లిన సమయంలో ఏర్పాటు చేసుకున్నదే పర్ణశాల. ఆనాటి కాలంలో అడవిలో జీవనం కొనసాగించాలంటే అక్కడ దొరికే వస్తువులతోనే కుటీరాలు నిర్మించుకునే వారు. ఇప్పుడు అదే తరహాలో గుంటూరులో ప్రకృతి సిద్ధంగా దొరికే వస్తువులను ఉపయోగించి రెస్టారెంట్​ ఏర్పాటు చేశారు. అసలు నిర్వహకులు దానిని ఇలా ఎందుకు నిర్మించాల్సి వచ్చింది, దాని విశేషాలు తెలియాలంటే పూర్తిగా చదివి తెలుసుకుందాం పదండి..

By

Published : Feb 14, 2023, 3:12 PM IST

Updated : Feb 15, 2023, 9:26 AM IST

గుంటూరులో ఓ రెస్టారెంట్
గుంటూరులో ఓ రెస్టారెంట్

ఇది పర్ణశాల.. రామా కుటీరం.. కాదు! గుంటూరులోని ఓ రెస్టారెంట్​..!

Innovative Restaurant in Guntur : రోజురోజుకీ ప్రజల ఆలోచనలు, అభిరుచులు మారుతున్నాయి. కొత్త రుచులు, విభిన్న వాతావరణం కోరుకుంటున్నారు. ఆ మేరకు రెస్టారెంట్ల ఏర్పాట్లులోనూ కొత్త పోకడలు వస్తున్నాయి. గుంటూరు జిల్లాలోని ఓ రెస్టారెంట్‌ నిర్వాహకులు సైతం విభిన్నంగా ఆలోచించారు. పర్ణశాల పేరుతో గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. ఇది వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

గ్రామీణ వాతావరణానికి కొత్త సొబగులు అద్దినట్లు ఈ రెస్టారెంట్​ను ఏర్పాటు చేశారు. ఇలా వినూత్నంగా ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్‌ పేరు పర్ణశాల. పురాణాల్లో శ్రీరాముడు వనవాస సమయంలో పర్ణశాల ఏర్పాటు చేసుకుని అందులో నివసించినట్లు చదువుకున్నాం. అదే ఆలోచనతో రెస్టారెంట్ నిర్వాహకులు ఈ పేరు పెట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జాతీయ రహదారి పక్కనే ఉంటుంది. రెస్టారెంట్ నిర్మాణ సమయంలో ఇనుము, ప్లాస్టిక్ వస్తువులు ఉపయోగించకుండా సహజసిద్ధమైన వాటిని ఉపయోగించారు.

తాటిచెట్లను స్థంభాలుగా మార్చారు. చెక్క, వెదురు బొంగులతో గోడలు ఏర్పాటు చేశారు. రెల్లు గడ్డిని పైకప్పు కోసం ఉపయోగించారు. కేన్‌ ఫర్నీచర్‌, నులక మంచాలు ఇలా ఇంటీరియర్‌ కూడా ప్రత్యేకంగా ఎంపిక చేశారు. గ్రామీణ వాతావరణానికి అద్దం పట్టే అందమైన వర్ణచిత్రాలను గోడలపై ఉంచారు. అంతా పల్లెటూరి వాతావరణం, అడవిలో ఉండే కుటీరం తరహాలో రెస్టారెంట్‌ నిర్మించారు. సహజసిద్ధమైన వాటితో ఏర్పాటు చేసినందున వేసవిలో కూడా చల్లగా ఉంటుందని.. అందుకే రెస్టారెంట్లో ఏసీలు కూడా ఏర్పాటు చేయలేదని వివరించారు.

"సహజ సిద్ధంగా ఉండాలని అన్ని ప్రకృతి సిద్ధంగా దొరికిన వాటినే వినియోగించాము. వేసవిలో కూడా చల్లగా ఉండేందుకు పై కప్పును గడ్డితో ఏర్పాటు చేశాము. పల్లెటూరి వాతావరణం రావటానికి కుటీర తరహలో రెస్టారెంట్​ను ఏర్పాటు చేశాము. గ్రామీణ వాతావరణం ఉండేందుకు పూర్తి ఏర్పాట్లను చేశాము." జి.మధు, పర్ణశాల రెస్టారెంట్‌ యజమాని

రెస్టారెంట్‌ పేరుతో పాటు లోపలి వాతావరణం ఆకట్టుకునేలా ఉందని.. ఇంటిల్లిపాదీ సరదాగా గడపొచ్చని వినియోగదారులు చెబుతున్నారు.

"రెస్టారెంట్​ను పూర్తిగా సంప్రదాయ పద్ధతిలో ఏర్పాటు చేశారు. ఏ హోటల్​లో ఏర్పాటు చేయని విధంగా వినూత్నంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చిన్న పిల్లలు చాలా ఎంజాయ్​ చేస్తారు. చిన్న పిల్లలు ఆడుకోవటానికి ప్రత్యేకంగా ఉంది." -వినియోగదారుడు

ఇవీ చదవండి :

Last Updated : Feb 15, 2023, 9:26 AM IST

ABOUT THE AUTHOR

...view details