ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"చదువులమ్మ"కు 75 ఏళ్లు.. కాకుమాను పాఠశాలలో నేడు, రేపు వజ్రోత్సవ వేడుకలు! - ap latest news

వ్యవసాయం కడుపు నింపితే.. చదువు విజ్ఞానం పెంచుతుంది. ఈ విషయాన్ని 8 దశాబ్దాల క్రితమే గ్రహించారు అక్కడి గ్రామస్థులు. చదువుల కోసం వేరే చోట్లకి వెళ్లకుండా.. ఊళ్లోనే బడిని ఏర్పాటు చేసుకున్నారు. డబ్బున్న ఆసామి నిధులిస్తే.. భూమి ఉన్న పెద్దాయన స్థలమిచ్చారు. గ్రామస్థులు శ్రమనే పెట్టుబడిగా పెట్టి బడి కోసం భవనాన్ని నిర్మించారు. పిల్లల భవిష్యత్తుకు వారు వేసిన పునాదులు వేలాది మందికి వెలుగులు పంచాయి. ఇప్పటికీ పంచుతూనే ఉన్నాయి. తమకు జీవితాన్నిచ్చిన పాఠశాల 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకలకు సిద్ధమయ్యారు ఆ పాఠశాల విద్యార్థులు.. గ్రామస్థులు!

industrialist prasad helps for his village in kakumanu at guntur
పురిటిగడ్డ అభివృద్ధికి పారిశ్రామికవేత్త ప్రసాద్‌ తోడ్పాటు

By

Published : Jan 16, 2022, 3:17 PM IST

Updated : Jan 16, 2022, 8:40 PM IST

పురిటిగడ్డపై పారిశ్రామికవేత్త ప్రసాద్‌ మమకారం

ఓ వైపు గత వైభవానికి అద్దం పట్టేలా కనిపిస్తున్న పాత భవనం. మరోవైపు కొత్తదనానికి సంకేతంగా నిలుస్తున్న నిర్మాణం. ఈ రెండూ ఆ ప్రాంతంలో వేలాది మందికి విద్యను ప్రసాదించిన ఆలయాలు. గుంటూరు జిల్లా కాకుమానులో 75 సంవత్సరాల క్రితం ఏర్పాటైంది ఈ పాఠశాల. చదువుకోవడానికి పిల్లలు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఊళ్లోనే బడి నిర్మించాలని భావించిన ఆ గ్రామస్థులు అదే సంకల్పంతో ముందుకెళ్లారు. నన్నపనేని నాగయ్య రూ.11 వేల పాటు 1.63 ఎకరాల పొలాన్ని విరాళంగా అందించి తొలి అడుగు వేశారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మరి కొందరు తోచినంత సాయం చేశారు. బడి నిర్మాణాన్ని అందరి బాధ్యతగా.. ఇంటికొకరు శ్రమదానంలో పాల్గొన్నారు. ఎద్దుల బండ్లతో మట్టి తోలారు. భవన నిర్మాణానికి కావాల్సిన ఇసుకను కొమ్మునూరు కాల్వ ద్వారా పడవల్లో తెప్పించారు. అలా 1946లో పాఠశాల నిర్మాణం పూర్తై.. విద్యాబోధన మొదలైంది.

విద్యా వాలంటీర్ల నియామకం..
పాఠశాల మొదలైనప్పటి నుంచి కాకుమాను సహా చుట్టుపక్కల గ్రామాల్లోని రెండు, మూడు తరాల పిల్లలు ఇక్కడే చదువుకున్నారు. ఇప్పటికీ చదువుతూనే ఉన్నారు. కాలక్రమంలో పాఠశాల భవనం పాడైపోయింది. విరిగిన కిటికీలు, పై కప్పు నుంచి కారుతున్న వర్షపు నీరు వల్ల.. చదువులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాంటి సమయంలో చదువులమ్మ రుణం తీర్చుకునేందుకు పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చి.. భవనాలకు మరమ్మతులు చేయించారు. బోధనకు అవసరమైన సామగ్రి అందజేశారు. అధ్వానంగా ఉన్న ఆట మైదానానికి మెరక తోలించి.. వాకింక్ ట్రాక్‌ సహా అదనపు హంగులు చేర్చారు. విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినేందుకు.. షెడ్డు, వేడుకలు జరిపేందుకు కళావేదిక నిర్మించారు. పాఠశాలకు కంప్యూటర్లు, విద్యార్థులకు సైకిళ్లు అందించారు. ఉపాధ్యాయుల కొరత తీర్చేందుకు విద్యా వాలంటీర్లను నియమించారు. వారికి జీతాలనూ పూర్వ విద్యార్థులే సమకూర్చారు.

ఇక్కడ చదివిన చాలా మంది ఉన్నత స్థానంలో స్థిరపడ్డారు..
మాజీ మంత్రి జేడీ శీలం, బాపట్ల మాజీ ఎమ్మెల్యే ముప్పలనేని శేషగిరిరావు, పారిశ్రామికవేత్త కారుమంచి ప్రసాద్‌బాబు వంటి చాలా మంది ప్రముఖులు కాకుమాను పాఠశాలలోనే విద్యను అభ్యసించారు. ఇక్కడ చదివిన చాలా మంది వివిధ రంగాల్లో మంచి స్థాయిలో స్థిరపడ్డారు. పాఠశాల ప్రారంభమై నేటితో 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా చాలా మంది పూర్వ విద్యార్థులు.. వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. పాఠశాలను అత్యున్నతంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. పాఠశాల భవనాలకు రంగులు వేయించారు. జాతీయ నాయకులు, శాస్త్రవేత్తల విగ్రహాలను ఏర్పాటు చేశారు. అత్యాధునిక సదుపాయాలతో అదనపు తరగతి నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు.

పాఠశాలకు అనేక సౌకర్యాలు..
పాఠశాలకు కొత్తగా 25 కంప్యూటర్లు కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు, గ్రంథాలయం ఏర్పాటుతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని పూర్వ విద్యార్థుల కమిటీ నిర్ణయించింది. హైస్కూల్‌కు అదనంగా జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. ఉత్సవాల సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకుడు నన్నపనేని నాగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్వ విద్యార్ధులు ఇచ్చిన తోడ్పాటుపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతుగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు.

వజ్రోత్సవ వేడుకలు..
చదువుల తల్లి రుణం తీర్చుకోవాలన్న పూర్వవిద్యార్థుల సంకల్పంతో.. కాకుమాను ఉన్నతపాఠశాల సరికొత్త రూపు సంతరించుకుంటోంది. ఇవాళ, రేపు జరిగే వజ్రోత్సవ వేడుకల్లో.. పూర్వ విద్యార్థులతో పాటు.. గ్రామస్థులు పాల్గొననున్నారు. వేడుకలకు హోం మంత్రి సుచరిత, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను ఆహ్వానించారు.

ఇదీ చదవండి:

cock fight : రికార్డు పందెం... సోషల్ మీడియలో వైరల్

Last Updated : Jan 16, 2022, 8:40 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details