ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 18, 2019, 5:57 PM IST

Updated : Aug 18, 2019, 7:18 PM IST

ETV Bharat / state

వరదలతో సుమారు 4 వేల ఎకరాల్లో పంటనష్టం: హోంమంత్రి సుచరిత

గుంటూరు జిల్లా కొల్లూరు లంక గ్రామాల్లో వరద పరిస్థితిపై అధికారులతో హోంమంత్రి మేకతోటి సుచరిత సమీక్ష నిర్వహించారు. వరదలకు నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

హోంమంత్రి

అధికారులతో హోంమంత్రి సమీక్ష

కృష్ణా నది వరద బాధితులను ప్రభుత్వం సమర్థవంతంగా ఆదుకుంటుందని.. హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. కృష్ణా వరద ఉద్ధృతి తగ్గిందని.. వరదల అనంతరం మరింత వేగంగా సహాయ చర్యలు చేపట్టాలని ఆమె అధికారులను ఆదేశించారు. కృష్ణా వరదలపై గుంటూరు జిల్లా కొల్లూరు మండల పరిషత్ కార్యాలయంలో హోంమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. వరదలు గుంటూరు, కృష్ణా జిల్లాలపై ఎక్కువ ప్రభావం చూపాయన్నారు. కృష్ణా జిల్లాలో 34 గ్రామాలు, గుంటూరు జిల్లాలో 53 గ్రామాలు వరద బారిన పడ్డాయన్నారు. ముందస్తు చర్యలతో ప్రాణనష్టాన్ని తగ్గించగలిగామని.. రెండు జిల్లాలో ఇద్దరు చనిపోయారని మంత్రి సుచరిత వెల్లడించారు. కృష్ణా జిల్లాలో 2239 ఎకరాల్లో, గుంటూరు జిల్లాలో 2470 ఎకరాల్లో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. కృష్ణా జిల్లాలో 1398, గుంటూరు జిల్లాలో 654 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. పంట నష్టాన్ని అంచనా వేసి బాధిత రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని హోంమంత్రి సుచరిత భరోసా ఇచ్చారు. వరద సహాయక చర్యల పురోగతిని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి నివేదిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం లంక గ్రామాల్లో ప్రజలకు మంచినీరు, ఆహారం, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నామని.. అధికారులు చురుగ్గా సహాయ చర్యలు చేపట్టాలని మంత్రి సుచరిత ఆదేశించారు. ఈ సమావేశంలో కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పాల్గొన్నారు. సమీక్ష అనంతరం వెల్లటూరులోని పునరావాస కేంద్రాలను సందర్శించి బాధితులను హోంమంత్రి పరామర్శించారు.

Last Updated : Aug 18, 2019, 7:18 PM IST

ABOUT THE AUTHOR

...view details