ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 10, 2023, 12:09 PM IST

ETV Bharat / state

కానిస్టేబుల్‌ అభ్యర్థుల వ్యాజ్యంపై కౌంటర్‌ దాఖలు చేయండి: హైకోర్టు

HIGH COURT ORDERS TO GOVT : పోలీసు కానిస్టేబుల్‌ ప్రాథమిక రాత పరీక్షలో 8 ప్రశ్నలకు సరైన జవాబులు నిర్ణయించలేదంటూ 80 మంది అభ్యర్థులు దాఖలు చేసిన వ్యాజ్యంలో.. కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసు నియామక బోర్డు, రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

HIGH COURT ORDERS TO GOVT
HIGH COURT ORDERS TO GOVT

HIGH COURT ORDERS TO GOVT : పోలీసు కానిస్టేబుల్‌ పరీక్షలో ఎనిమిది ప్రశ్నలకు సరైన జవాబులు నిర్ణయించలేదంటూ 80 మంది అభ్యర్థులు దాఖలు చేసిన వ్యాజ్యంలో కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసు నియామక బోర్డు, రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో దేహదారుఢ్య పరీక్షకు పిటిషనర్లను అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. బోర్డు వేసే కౌంటర్‌ పరిశీలించాక తగిన ఉత్తర్వులిస్తామని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఈ మేరకు స్పష్టం చేశారు.

పోలీసు కానిస్టేబుల్‌ ప్రాథమిక రాతపరీక్ష ప్రశ్నా పత్రంలో ఎనిమిది ప్రశ్నలకు సరైన సమాధానాలను నిర్ణయించలేదని, దీంతో తాము దేహదారుఢ్య పరీక్షకు అనర్హులయ్యామని పేర్కొంటూ 80 మంది హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పిటిషనర్ల తరఫున న్యాయవాది ఉమేశ్‌ చంద్ర వాదనలు వినిపించారు. అకాడమీ పుస్తకాల్లో ఉన్న జవాబులకు భిన్నంగా తుది ‘కీ’ విడుదల చేశారన్నారు. ఆ ఎనిమిది ప్రశ్నల జవాబులను నిపుణుల కమిటీ తేల్చేలా ఆదేశించాలని.. ఈ లోపు పిటిషనర్లను దేహదారుఢ్య పరీక్షకు అనుమతించాలని కోరారు. కీ లో తప్పుల కారణంగా అభ్యర్థులకు అన్యాయం చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్లు గుర్తు చేశారు. కీ లో నిర్దిష్టమైన తప్పులున్నప్పుడు న్యాయస్థానం జోక్యం చేసుకోవచ్చని తెలిపారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. పిటిషనర్ల జవాబులను మరోసారి పరిశీలించాలని ప్రభుత్వం, పోలీసు నియామకం బోర్డు తరఫు న్యాయవాది కిశోర్‌కుమార్‌కు సూచించారు.

ఆ సూచన పై కిశోర్‌కుమార్‌ సైతం అభ్యంతరం తెలిపారు. ఆ తరహా ఆదేశాలు ఇవ్వడం అంటే నియామక ప్రక్రియలో న్యాయస్థానం జోక్యం చేసుకోవడం అవుతుందని వెల్లడించారు. అత్యంత అరుదైన సందర్భాల్లో తప్ప నియామక ప్రక్రియలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. పిటిషనర్లను దేహదారుఢ్య పరీక్షలకు అనుమతిస్తే.. చాలా మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించే ప్రమాదం ఉందన్నారు. నిపుణుల కమిటీ పరిశీలించాకే కీ విడుదల చేశామన్నారు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం కౌంటర్​ వేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే కౌంటర్‌ వేసేందుకు సమయం కావాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరగా.. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్​లో 6,100 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి 2023 జనవరి 22న ప్రాథమిక పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 4లక్షల 59వేల 182 మంది హాజరుకాగా 95వేల 209 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాలను పోలీసు నియామక మండలి విడుదల చేసింది. ఫలితాల ఆధారంగా ఒక్కో పోస్టుకు సుమారు 16 మంది పోటీ పడుతున్నారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన 95వేల 209 మందికి త్వరలో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details