Delay in Inauguration of Gandhi Park: గుంటూరు నగరంలోని గాంధీ పార్కుకి ఎంతో ఘన చరిత్ర ఉంది. స్వాతంత్రోద్యమ సమయంలో గాంధీజీ ఈ ప్రాంతంలోనే సమావేశం ఏర్పాటు చేశారు. మొదట్లో స్వరాజ్ మైదానంగా పిలిచేవారు. ఆ తర్వాత గాంధీ పార్కు అని పేరు పెట్టారు. కొన్ని దశాబ్దాలుగా నగరవాసులకు ఆహ్లాదం, వినోదం పంచటంతో పాటు కార్పోరేషన్కు ఆదాయం తెచ్చిపెడుతోంది. అలాంటి పార్కుని ఆధునీకరణ పేరిట మూడు సంవత్సరాలకు పైగా మూసివేశారు. రూ.5కోట్లకు పైగా వ్యయంతో పార్కుని తీర్చిదిద్దారు. అయితే అధికార పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య పంతాలు.. పట్టింపుల కారణంగా పార్కు ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఆధునికీకరణ పనులు పూర్తై మూడు నెలలైనా ప్రజలకు అందుబాటులోకి రాలేదు.
పార్కుని ప్రారంభించి ఉంటే వేసవి సెలవుల్లో పిల్లలకు ఆటవిడుపుగా ఉపయోగపడేది. పనులు పూర్తయినా రాజకీయ కారణాలతో పార్కు ప్రారంభం కాలేదు. నగరం నడిబొడ్డున మార్కెట్ సెంటర్లో ఉన్న పార్కు వినియోగంలోకి రాకుండా పోయింది. అధికార పార్టీ నేతల కాసుల యావ కారణంగా పార్కు ప్రారంభించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. పార్కులో సైకిల్స్టాండ్, ఫుడ్కోర్టుల నిర్వహణ టెండర్లు లేకుండా నేరుగా తనకివ్వాలని.. వైసీపీ ముఖ్య ప్రజాప్రతినిధి ఒత్తిడి తెస్తున్నారు. అధికార పార్టీలోని మరికొందరు టెండర్లు పిలవాల్సిందేనని పట్టుబట్టారు. అలాగే కార్పొరేటర్లు అందరి పేర్లు శిలాఫలకంపై ఎక్కించాలని కమిషనర్ను కలిసి కోరారు. స్థానిక కార్పొరేటర్ పేరు మాత్రమే ఉండాల్సిన చోట.. అందరి పేర్లు అనేసరికి అధికారులకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. నగరంలో విరివిగా ఎగ్జిబిషన్లకు అనుమతులు ఇచ్చి నిర్వాహకుల నుంచి కమీషన్లు దండుకొనేందుకు.. పార్కుని ప్రారంభించటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.