Granite Trader Kidnap in Guntur: గుంటూరు జిల్లాకు చెందిన ఓ గ్రానైట్ వ్యాపారిని ఆదే రంగానికి చెందిన సహచర వ్యాపారులు కొందరు బంధించడం కలకలం రేగింది. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి ఫిరంగిపురం పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానికంగా గ్రానైట్ వ్యాపారం నిర్వహించే వ్యాపారి తనను బంధించారంటూ పోలీసు కంట్రోల్ రూమ్కు ఫిర్యాదు చేయగా వెంటనే వారు ఫిరంగిపురం పోలీసుల్ని అప్రమత్తం చేశారు. ఆ రాత్రే పోలీసులు.. వారు ఉన్న గ్రానైట్ కొండ వద్దకు వెళ్లి అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. తొలుత వారిలో ఒకరు తాము రాయలసీమ జిల్లాకు చెందిన ఓ మంత్రి తాలూకా అని ఆయనే తమల్ని పంపారని చెప్పినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఇరువర్గాలను కూర్చొబెట్టి కౌన్సెలింగ్ చేశారు. మీ మధ్య ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలే తప్ప వ్యాపారిని బంధించి ఇబ్బంది పెడితే ఊరుకోబోమని.. కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Granite Trader Kidnap గుంటూరులో గ్రానైట్ వ్యాపారి నిర్బంధం.. పోలీసుల రాకతో మారిన సీన్..! - ఏపీ తాజా వార్తలు
Granite Trader Kidnap in Guntur: గ్రానైట్ రంగానికి చెందిన ఓ వ్యాపారిని బంధించడం గుంటూరు జిల్లాలో స్థానికంగా కలకలం రేపింది. అదే రంగానికి చెందిన కొందరు వ్యాపారులు ఈ ఉదంతానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

తీసుకున్న అప్పులు ఇవ్వలేదనే కారణం: ఫిరంగిపురానికి చెందిన గ్రానైట్ వ్యాపారి ఒకరు ఖమ్మం, రాజ మహేంద్రవరానికి చెందిన వ్యాపారుల నుంచి అప్పులు తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో ఆ బకాయిలు పేరుకుపోయాయి. వాటిని వసూలు చేసుకోవడానికి గత వారం రాజమహేంద్రవరం వ్యాపారులు ఇతనిని తీసుకెళ్లగా వారికి కొంత ముట్టజెప్పి మిగిలిన మొత్తానికి ప్రామిసరీ నోటీసులు రాసివ్వడం వంటివి చేశారని తెలుసుకున్న ఖమ్మం, హైదరాబాద్కు చెందిన ఐదుగురు వ్యాపారులు.. మరి తమ సంగతి ఏమిటని చెప్పి గురువారం ఆ వ్యాపారి వద్దకు వచ్చారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వారి మధ్య ఆ లావాదేవీల విషయమై గొడవలు జరగడం రాత్రికి అవి తారాస్థాయికి చేరి వ్యాపారిని బంధించే వరకు వెళ్లడంతో కలకలం రేగింది. ప్రాణభయంతో బాధితుడు కంట్రోల్ రూమ్కు ఫిర్యాదు చేశారని ఈ మేరకు తమ సిబ్బందిని పంపి వారిని పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపా మని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మంత్రి అనుచరుల మంటూ ఎవరూ చెప్పలేదని బహుశా అదేమైనా రాజమండ్రిలో జరిగిందేమో అన్నారు. లావాదేవిలకు సంబంధించి కోర్టులోనే తేల్చుకోమని సూచించి వారిని పంపించి వేశామని తెలిపారు.
మరో గ్రానైట్ వ్యాపారి హత్య: ఇలాంటి తరహా ఘటనే రెండు రోజుల క్రితం ప్రకాశం జిల్లాలో జరిగింది. గ్రానైట్ ఫ్యాక్టరీ విషయంలో ఇరువురి మధ్య ఆర్థిక లావాదేవీల కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సుమారు రెండు కోట్ల మేర డబ్బులు ఇవ్వడం లేదని.. అడిగితే పోలీసుల ద్వారా బెదిరిస్తున్నారని మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు.