ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శ్మశానవాటికల్లో ఉచితంగా అంత్యక్రియలు: గుంటూరు మేయర్, కమిషనర్

చనిపోయినవారి అంత్యక్రియల నిర్వహణకు.. శ్మశాన వాటికల్లో ఉండే సిబ్బంది కొందరు డబ్బులు దండుకుంటున్నారు. గుంటూరులో నెలకొన్న ఈ పరిస్థితిపై నగర మేయర్, మున్సిపల్ కమిషనర్ స్పందించారు. ఇకపై... ఉచితంగానే అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు స్పష్టం చేశారు.

By

Published : May 10, 2021, 7:32 PM IST

Published : May 10, 2021, 7:32 PM IST

free funerals at guntur
free funerals at guntur

గుంటూరు నగరంలో కొవిడ్​తో పాటు ఇతర కారణాలతో మరణించిన వారి మృతదేహాలకు.. ఉచితంగా అంత్యక్రియలు జరపాలని నగరపాలక సంస్థ నిర్ణయించింది. మే 11 నుంచి నగరంలోని 7 హిందూ శ్మశాన వాటికల్లో అంత్యక్రియలు ఉచితంగా నిర్వహించనున్నట్లు నగర మేయర్ కావటి మనోహర నాయుడు తెలిపారు. వీటిలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మూడు, ప్రైవేటు ట్రస్టుల చేతిలో మరో నాలుగు శ్మశాన వాటికలున్నాయని వివరించారు. ట్రస్టుల ఆధ్వర్యంలో నడిచే శ్మశానవాటికల్లో అంత్యక్రియలకు కార్పొరేషన్ తరపున రూ.3వేలు చెల్లించనున్నట్లు తెలిపారు. ముస్లిం, క్రైస్తవ శ్మశానవాటికల్లోనూ ఉచితంగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తామన్నారు.

ఫిర్యాదులు వెల్లువెత్తటంతో ఈ నిర్ణయం: మేయర్ మనోహర నాయుడు

అంత్యక్రియలకు అధిక మొత్తం వసూళ్లపై ఫిర్యాదులు రావటంతో.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మేయర్ తెలిపారు. కొరిటపాడు శ్మశాన వాటికలో అధిక వసూళ్లపై ఫిర్యాదులు వెల్లువెత్తాయన్నారు. సంబంధిత కమిటీకి షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. వారి వివరణ అందాక తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. కొరిటపాడు శ్మశానవాటిక నిర్వహణ కమిటీలో తెదేపా వారే ఉన్నారని.. కాని తెదేపా శ్రేణులు నగరపాలక సంస్థపై సామాజిక మాద్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

వసూళ్లు చేస్తే కఠిన చర్యలు: కమిషనర్ అనురాధ

జిల్లాలోని వివిధ ప్రాంతాల వారు గుంటూరు ఆసుపత్రుల్లో మరణిస్తుండటంతో.. ఇక్కడ శ్మశానాల్లో రద్దీ ఏర్పడిందని మున్సిపల్ కమిషనర్ అనురాధ అన్నారు. అవకాశంగా తీసుకుని కొందరు ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తున్నట్లు తెలిపారు. అందుకే తాము నిర్దేశించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలని.. వాటికల నిర్వాహకుల్ని ఆదేశించినట్లు వివరించారు. కానీ దాన్ని కూడా కొందరు వక్రీకరించారని.. అందుకే ఇపుడు ఉచితంగా అంత్యక్రియల నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇకపై శ్మశానవాటికల్లో ఎలాంటి వసూళ్లు ఉండవని.. ఎవరైనా ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తప్పవని హెచ్ఛరించారు. మృతుల కుటుంబీకులు.. నగరపాలక సంస్థ హెల్ప్ లైన్ నంబర్ల (91770 01859, 91770 01882) కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. కార్పొరేషన్ తరపున మరణ ధృవీకరణ పత్రం రావాలంటే హెల్ప్ లైన్ నంబర్లకు తప్పనిసరిగా ఫోన్ చేయాలన్నారు.

ఇదీ చదవండి:

టీకా కోసం ప్రజల ఎదురుచూపులు.. అధికారుల జాడేది?

ABOUT THE AUTHOR

...view details