Doctor Rajesh Maddipati Interview on amnesia: వయసు పెరుగుతున్న కొద్దీ వ్యాధులూ ముసురుతాయి. అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, గుండె, మెదడు జబ్బుల బారినపడే అవకాశాలుంటాయి. ఇవన్నీ నియంత్రణలో లేకపోతే మెదడులోని కొన్ని భాగాల్లో సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతింటాయి. మెదడుకు తగినంత రక్తం సరఫరా కాదు. ఫలితంగా ప్రాణవాయువు సరిగా అందక మెదడు కణాలు బలహీనమవుతాయి. ఆ ప్రభావం జ్ఞాపకశక్తిపై పడి మతిమరుపునకు దారితీస్తుంది. వృద్ధాప్యంలో మతిమరుపు ముప్పును తగ్గించుకోవడం మన చేతుల్లోనే ఉంటుందని చెబుతున్నారు యూకేలోని ఫ్యామిలీ ఫిజీషియన్ డాక్టర్ రాజేశ్ మద్దిపాటి. ఇందుకోసం అవలంబించాల్సిన విధానాలను 'ఈటీవీ భారత్' ముఖాముఖిలో డాక్టర్ రాజేశ్ పంచుకున్నారు.
- వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి తగ్గకుండా ఉండేందుకు మార్గమేమిటి ?
వయసు పెరుగుతున్న కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ఏ విషయంపైనా సరైన నిర్ణయం తీసుకోలేరు. పదిమందితో కలిసి మాట్లాడలేరు. బయటకు వెళ్తే తిరిగి ఇంటికొచ్చే దారిని కూడా మరిచిపోతుంటారు. వీటన్నిటికీ ప్రధానంగా మెదడులో జరిగే మార్పులే కారణం. రకరకాల వ్యాధుల వల్ల ఇలా జరుగుతుంది. విటమిన్ బి 1, బి 12 లోపం, అదుపు లేని హైపోథైరాయిడిజం, మధుమేహం, అధిక రక్తపోటు, తలకు బలమైన గాయాలైనప్పుడు, మాదక ద్రవ్యాలకు బానిసలైనవారిలోనూ, దీర్ఘకాలంగా ఆందోళన, కుంగుబాటుతో బాధపడేవారిలోనూ మతిమరుపు రావచ్చు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, గుండె, పక్షవాతం, పార్కిన్సన్స్ వంటి జబ్బుల్లోనూ రక్తనాళాలు సంకోచించడంతో మెదడుకు రక్తం సరఫరా తగ్గుతుంది. హెచ్ఐవీ, క్షయ వంటి వ్యాధుల్లోనూ ఈ సమస్య వస్తుంది. ఈ వ్యాధుల నివారణ లేదా నియంత్రణకు జాగ్రత్తలు అవసరం.
- ఆరోగ్యకరమైన అలవాట్లకు.. మతిమరుపు నిరోధానికి సంబంధమేమిటి?
కచ్చితంగా ఉంది. ఉదాహరణకు పొగ తాగడం వల్ల ఊపిరితిత్తులపై విపరీతమైన దుష్ప్రభావం పడుతుంది. గుండె, మెదడు భాగాల్లోని రక్తనాళాలు సన్నబడతాయి. పొగాకు వల్ల విడుదలయ్యే రసాయనాలు రక్తనాళాల గోడలను దెబ్బతీస్తాయి. మెదడు పనితీరుపైనా దుష్ప్రభావం చూపుతాయి. ఫలితంగా మెదడు కణాలు తగ్గిపోయి, మతిమరుపునకు దారి తీస్తుంది. మద్యపానం వల్ల కూడా మెదడు కణాలపై దుష్ప్రభావం పడుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వృద్ధాప్యంలో ఎనలేని మేలు చేస్తుంది. తద్వారా రోగ నిరోధక శక్తి, గుండె, ఊపిరితిత్తుల్లో రక్త ప్రసరణ వేగం పెరుగుతాయి. వ్యాయామం చేయనివారు బరువు పెరిగి.. గుండె, మెదడు రక్తనాళాల్లో సమస్యలు ఎదుర్కొనే ప్రమాదముంది. కనీసం 30-40 నిమిషాలైనా శారీరక వ్యాయామం చేయడం యుక్తవయసు నుంచే అలవాటు చేసుకోవాలి.
- ఈ సమస్యను అధిగమించడంలో కుటుంబసభ్యుల తోడ్పాటు ఎలా ఉండాలి?
మనిషి సగటు ఆయుర్దాయం 70 ఏళ్లకు చేరుకుంది. చిన్న కుటుంబాలు కావడం.. తల్లిదండ్రులను వదిలి పిల్లలు ఎక్కడో విదేశాల్లోనో, దూర ప్రాంతాల్లోనో నివసిస్తుండడంతో.. ఇప్పుడు భారత్లోనూ మతిమరుపు బాధిత వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. మతిమరుపు పెరిగితే.. వారిని సంరక్షించడం కుటుంబానికి పెద్ద సమస్యగా మారుతుంది. అందుకే కుటుంబసభ్యులు దూరంగా ఉన్నా.. అధునాతన పరిజ్ఞానం సాయంతో వివిధ మాధ్యమాల ద్వారా వారితో తరచూ మాట్లాడాలి.
- ఈ అంశంపై అధ్యయనాలున్నాయా?