కృష్ణానది వరదలతో గుంటూరు జిల్లాలోని కృష్ణా డెల్టాలో పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. భారీ వరద ప్రవాహం ముంచెత్తటంతో పసుపు, కంద, అరటి, దొండ, మొక్కజొన్న, తమలపాకు పంటలు నీట మునిగాయి. వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో అనుకోని వరదలు రైతులను దారుణంగా దెబ్బతీశాయి. ఎకరానికి రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టామని రైతులు అంటున్నారు. కొన్నిరోజుల వ్యవధిలోనే అతివృష్టి, అనావృష్టిని చవిచూశామని అంటున్నారు. ప్రభుత్వం కనికరించి.. ఎకరాకు కనీసం 30- 40 వేల వరకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.