ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రమాదకరంగా పేరేచర్ల-కొండమోడు రహదారి

'ప్రమాదాలు చెప్పిరావు... ప్రాణాలు తిరిగిరావు' అంటుంటారు. కానీ గుంటూరు జిల్లాలో పేరేచర్ల నుంచి కొండమోడు మధ్యనున్న రహదారి.. తాను ప్రమాదకారినంటూ నిత్యం హెచ్చరిస్తూనే ఉంది. ప్రాణాలు తిరిగిరావని తెలిసినా ఈ మార్గంలో ప్రయాణాలు తప్పడం లేదు. హైదరాబాద్ వెళ్లే మార్గంలోని ఈ 25 కిలోమీటర్లు నరకానికి ప్రవేశ ద్వారాలుగా మారాయి. రోడ్డు విస్తరణ ప్రతిపాదనలు మాత్రం ముందుకు కదలడం లేదు.

By

Published : Nov 8, 2020, 11:00 PM IST

road problem
ప్రమాదకరంగా పేరేచర్ల-కొండమోడు రహదారి

ప్రమాదకరంగా పేరేచర్ల-కొండమోడు రహదారి

గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో ఉన్న ప్రమాదకర రహదారి విస్తరణ.. కాగితాలకే పరిమితమవుతోంది. ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా.. ప్రతిపాదనలు కార్యరూపం దాల్చడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా.. మారని రహదారి దుస్థితిని చూసి ప్రజలు నిట్టూరుస్తున్నారు.

అసలేంటి సమస్య?

గుంటూరు జిల్లా పేరేచర్ల నుంచి కొండమోడు మధ్య 25 కిలోమీటర్ల మేరన ఉన్న కీలక రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. ఏటా ప్రమాదాలు పెరుగుతున్నా.. రోడ్డు విస్తరణకు నోచుకోవడం లేదు. సత్తెనపల్లి మండలం నందిగామ నుంచి ధూళిపాళ్ల వరకు ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉంది. హైదరాబాద్ వెళ్లాలంటే గుంటూరు నుంచి పేరేచర్ల వరకు... పిడుగురాళ్ల నుంచి నార్కెట్ పల్లి వరకు సాఫీగా ప్రయాణం సాగుతోంది. మధ్యలోని పేరేచర్ల నుంచి రాజుపాలెం మండలం కొండమోడు వరకు ఉన్న 25 కిలోమీటర్ల రహదారి మాత్రం నరకం చూపిస్తోంది. ప్రమాదాలతో నెత్తురోడుతోంది.

కారణాలు.. పర్యవసానాలు

నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే ఈ కీలక మార్గం వెడల్పు 5.5 మీటర్లే. రోడ్డు ఇరుకుగా ఉండటంతో ముందు వెళ్తున్న వాహనాన్ని అధిగమించే ప్రయత్నంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దానికితోడు మూడు నెలలుగా కురిసిన వర్షాలకు రహదారి ఇరువైపులా దెబ్బతింది. రాజుపాలెం నుంచి కొండమోడు వరకు పరిస్థితి దారుణంగా ఉంది. ఏటా మరమ్మతుల నిర్వహణతో సరిపెడుతున్నారు. రద్దీ పెరిగి ట్రాఫిక్ స్తంభించడం నిత్యకృత్యంగా మారింది. సత్తెనపల్లి పట్టణంలో ట్రాఫిక్​పై తీవ్రప్రభావం పడుతుంది. వర్షాకాలమైతే వెన్నాదేవి, ధూళిపాళ్ల వద్ద వాగులు పొంగుతూ రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. తరచూ అవాంతరాలతో ప్రయాణ సమయం బాగా పెరిగిపోతుందని ప్రయాణికులు నిట్టూర్చడమూ సాధారణమైపోయింది. ఎంత అనుభమున్న డ్రైవరైనా అత్యంత అప్రమత్తంగా వాహనాన్ని నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అంతే సంగతులు.

ప్రభుత్వం స్పందన..

కొండమోడు నుంచి అద్దంకి-నార్కెట్ పల్లి రహదారి నాలుగు వరుసలుగా అభివృద్ధి చేశారు. పేరేచర్ల నుంచి గుంటూరు వరకు రోడ్డునూ విస్తరించారు. పేరేచర్ల నుంచి కొండమోడూరు మార్గాన్ని నాలుగు వరుసలుగా విస్తరించడానికి ప్రతిపాదనలైతే సిద్ధమయ్యాయి. గత ప్రభుత్వంలో శంకుస్థాపన సైతం చేశారు. పీపీపీ విధానంలో మార్గం విస్తరణకు మూడుసార్లు ప్రాథమిక సర్వే పూర్తి చేసి.. పనులు చేపట్టడానికి గుత్తేదారు సంస్థలనూ ఆహ్వానించారు. టోల్ వసూలు ఆశించినంత ఉండదన్న ఉద్దేశంతో ఆ సంస్థలు ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం రహదారి అలైన్ మెంటును మార్చి కొత్త డీపీఆర్ ను రూపొందించేందుకు రహదార్లు, భవనాల శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మార్గంలో పేరేచర్ల నుంచి పెదకూరపాడు కూడలి వరకు 6.7 మీటర్ల రోడ్డు వెడల్పు, సత్తెనపల్లి నుంచి కొండమోడు వరకు 5.5 మీటర్ల వెడల్పు ఉంది. కొత్త ప్రతిపాదనల ప్రకారం రోడ్డును మరో 4.5 మీటర్ల వెడల్పు మేర విస్తరించడానికి యోచిస్తున్నారు.

ప్రయాణికుల వేడుకోలు..

ఈ ప్రమాదకర రహదారిపై ఏటా వాహనాల సంఖ్య పెరుగుతున్నా.. రోడ్డు మాత్రం విస్తరణకు నోచుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విపరీతమైన ట్రాఫిక్ దృష్ట్యా కీలకమార్గాన్ని విస్తరించాలని కోరుతున్నారు. ఈ దిశగా ప్రభుత్వం స్పందించి.. తగిన చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి:

'తాడికొండ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా'

ABOUT THE AUTHOR

...view details