Farmers not Getting Crop Insurance: ఈ-క్రాప్లో నమోదైతే ఉచిత బీమా వర్తిస్తుందన్నది ఒట్టిమాటే. ఈ సంవత్సరం ఖరీఫ్లో రాష్ట్రవ్యాప్తంగా 5.43 లక్షల ఎకరాల్లో మిరప సాగవగా.. ఉచిత బీమా చేసింది 3.29 లక్షల ఎకరాలకే. అంటే 61 శాతం లోపే. మిగిలిన 39 శాతం మిరప రైతులకు.. తమకు బీమా లేదనే సంగతి కూడా తెలియదు. రాష్ట్రంలోనే మిరప అధికంగా సాగయ్యే ఉమ్మడి గుంటూరు జిల్లాలో పరిస్థితి మరీ దారుణం. మొత్తం సాగులో కేవలం 18 శాతానికే బీమా కల్పించారు. దీనివల్ల 82 శాతం విస్తీర్ణంలో సాగైన పంటకు నష్టం జరిగితే.. పైసా కూడా పరిహారం అందని దుస్థితి. సీఎం మాటలపై నమ్మకంతో తమకూ పంటల బీమా వర్తిస్తుందని రైతులు భావిస్తున్నా.. తీరా సీఎం బటన్ నొక్కాక వారికి సొమ్ములు అందడం లేదు.
రైతుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటోంది. పంటల బీమాలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని, రైతులు పైసా చెల్లించాల్సిన పనిలేకుండా వారి తరఫున ప్రీమియం మొత్తాన్ని తామే చెల్లిస్తున్నామని, ఈ-క్రాప్లో నమోదైన ప్రతి ఎకరాకూ వర్తింపజేస్తున్నామని.. మూడేళ్లుగా సీఎం జగన్మోహన్రెడ్డి వల్లె వేస్తున్నారు. కానీ ఈ-పంటలో నమోదైన వారందరి పంటలకు బీమా వర్తింపజేయడం లేదు. వర్షాధారం, సాగునీటి వసతి, దిగుబడి, వాతావరణ ఆధారితం అంటూ వివిధ నిబంధనల పేరిట కోత పెట్టి.. కొంత విస్తీర్ణానికే అమలు చేస్తున్నారు.
రాష్ట్రంలోనే మిరప అధికంగా సాగయ్యే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ ఏడాది 82 శాతం విస్తీర్ణాన్ని పక్కనబెట్టి.. కేవలం 18 శాతం విస్తీర్ణానికి పంటల బీమా వర్తింపచేశారు. కర్నూలు జిల్లాలోనూ 36 శాతం విస్తీర్ణంలో మిరప వేసిన రైతులకు ఉచిత పంటల బీమా లేదు. ఆ సంగతి కూడా వారికి తెలియదు. 2020-21, 2021-22 సంవత్సరాల్లో రబీకి పంటలకు బీమాను ప్రభుత్వం పూర్తిగా పక్కనబెట్టేసింది. సర్కారు బీమా లెక్కలేమిటో, నష్టం అంచనాకు ప్రామాణికత ఏమిటో.. ఆ రంగంలోని నిపుణులకు కూడా అంతుపట్టడం లేదు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో సాగునీటి వసతి కింద మిరప వేస్తుంటే.. దాన్ని వర్షాధారం కిందకు తేవడం ప్రభుత్వ కుదింపు ధోరణికి అద్దం పడుతోంది. అందుకే గత రెండు సంవత్సరాలుగా పంట నష్టపోయిన చాలా మంది రైతులకు పరిహారం అందడం లేదు. ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించకపోగా, రైతులు సొంతంగా ప్రీమియం చెల్లించుకుంటే పరిహారం వచ్చే అవకాశమున్నా.. అదీ లేకుండా చేస్తోంది. ఈ-క్రాప్ చేసిన ప్రతి ఎకరాకూ బీమా వర్తింపజేయడం లేదనే అంశాన్ని దాస్తోంది. 2021 ఖరీఫ్లో రైతులకు 2 వేల 977.82 కోట్ల పరిహారం చెల్లించామని గొప్పగా చెబుతోంది. భారీ వర్షాలు, వరదలు, పురుగు, తెగుళ్లు, నల్లతామరతో రైతులకు అంతకుమించిన నష్టం ఎదురైందనే అంశాన్ని కావాలనే విస్మరిస్తోంది.