ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కరోనా ఎఫెక్ట్: మరోసారి మూతపడే దశలో గుంటూరు మిర్చి యార్డు

By

Published : Jun 24, 2020, 7:42 PM IST

కరోనా కేసుల కారణంగా గుంటూరు మిర్చియార్డు మరోసారి మూతపడే సూచనలు కనిపిస్తున్నాయి. మార్కెట్​లోని ఇద్దరు కమిషన్ ఏజెంట్లకు వైరస్ సోకటమే దీనికి కారణం. వ్యాపారులైతే కొద్ది రోజులు యార్డుని మూసివేయటమే మేలని అంటున్నారు. వేలాది మంది వచ్చిపోయే మార్కెట్ లో వైరస్ ప్రబలితే దాన్ని కట్టిడి చేయటం కష్టం కావున.. లాక్​డౌన్ విధించడం మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

corona effect to guntur mirchi yard
కరోనా ఎఫెక్ట్: మూతపడే దశలో మిర్చి యార్డు

గుంటూరు మిర్చి యార్డుని కోవిడ్ వీడటం లేదు. లాక్​డౌన్ కారణంగా మిర్చియార్డును రెండు నెలల పాటు మూసివేసి, మే 23న తెరిచారు. ఒక హమాలీకి కరోనా పాజిటివ్ రావటంతో మళ్లీ వారం రోజుల పాటు నిలిపివేయగా... ఆ తర్వాత జాగ్రత్తలు తీసుకుని యార్డులో కార్యకలాపాలు మొదలుపెట్టారు. రైతులు తమ పంటను అమ్ముకునేందుకు వస్తున్న సమయంలో మళ్లీ ఇద్దరు కమిషన్ ఏజెంట్లు కరోనా బారిన పడటం కలకలం రేపింది. వెంటనే మిర్చియార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు.

రైతులు, వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు, గుమస్తాలు, హమాలీలు భయంతో మిర్చి యార్డుకు వస్తున్నారు. కరోనా వచ్చినవారు యార్డులో తిరగటంతో అందరిలో ఆందోళన మొదలైంది. కొద్దిరోజులు యార్డు మూసివేస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యార్డులో గతంలో మాదిరిగా కార్యకలాపాలు లేకపోయినప్పటికీ కనీసం వెయ్యి నుంచి రెండు వేల మంది తప్పనిసరిగా ఉంటారు. ఈ తరుణంలో వైరస్ విజృంభిస్తే ప్రమాదకరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇద్దరు కమిషన్ ఏజెంట్లకు కరోనా పాజిటివ్..

మూడు రోజుల క్రితం యార్డులోని ఇద్దరు కమిషన్ ఏజెంట్లకు కరోనా నిర్ధరణ అయిందని మిర్చి యార్డు ఛైర్మన్ చంద్రగిరి ఏసురత్నం తెలిపారు. వెంటనే పారిశుద్ధ్య చర్యలు చేపట్టి... మార్కెట్​కు వచ్చే ప్రతి ఒక్కరికి శానిటైజర్​తో చేతులు శుభ్రం చేసుకునేలా ఏర్పాట్లు చేశామని ఆయన అన్నారు. యార్డుకు నాలుగు రోజులు సెలవు ప్రకటిస్తే మేలనే అభిప్రాయం వ్యక్తమైనట్లు ఆయన వెల్లడించారు. వ్యాపారుల నుంచి ఆ మేరకు ప్రతిపాదన వచ్చిందని.... అందరి అభిప్రాయాలను అధికారులకు తెలిపి యార్డు కొద్దిరోజులు మూసేలా చర్యలు చేపడతామని అన్నారు.

ఇదీ చదవండి: అంత్యక్రియలయ్యాక వచ్చిన నివేదిక..కరోనా పాజిటివ్ నిర్ధరణ

ABOUT THE AUTHOR

...view details