ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 8, 2020, 6:34 PM IST

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: కష్టంగా మారిన వృద్ధాశ్రమాల నిర్వహణ

కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న వేళ వృద్ధాశ్రమాలు వణుకుతున్నాయి. వాటి నిర్వహణకు కొవిడ్ వైరస్ భయంతోపాటు ఆర్థికభారం తోడైంది. దాతల వితరణతో నడుస్తున్న చాలా ఆశ్రమాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఆదుకునే చేతుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నాయి.

corona effect on oldage homes in ap
వృద్ధాశ్రమాలపై కరోనా ప్రభావం

కరోనా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వృద్ధాశ్రమాల నిర్వహణ అగమ్యగోచరంగా మారింది. వాటిలో చాలా ఆశ్రమాలు దాతలు ఇచ్చే విరాళాలతో నడుస్తున్నవే. లాక్ డౌన్ కారణంగా నిధులు రాక ఆశ్రమాల నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. దానికి తోడు మాస్కులు, శానిటైజర్ల రూపంలో ఖర్చు ఎక్కువైంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు, దాతలు స్పందించి వృద్ధాశ్రమలను ఆదుకోవాలని కోరుతున్నారు.

పాత గుంటూరులోని ఓ వృద్ధాశ్రమంలో దాదాపు 100 మంది వరకు ఆశ్రయం పొందుతున్నారు. వారిలో ఎక్కువమంది ఎవరూలేని అభాగ్యులు, నిరాశ్రయులే. 14 ఏళ్లుగా ఈ ఆశ్రమం దాతల సహకారంతోనే నడుస్తోంది. అయితే లాక్ డౌన్ కారణంగా ఆశ్రమానికి వచ్చే నిధులు ఆగిపోయాయి. ఆంక్షలు సడలించినప్పటికీ దాతలు రావడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వృద్ధాశ్రమాల నిర్వహణ భారంగా మారిందని నిర్వాహకులు చెప్తున్నారు. దీనికి తోడు కరోనా కారణంగా నిర్వహణ వ్యయం ఎక్కువైంది. వృద్ధులకు మాస్కులు, శానిటైజర్లు, యూరిన్ బ్యాగులు ఇవ్వడం తప్పనిసరైంది. దీంతో ఖర్చు పెరుగుతోందని అంటున్నారు నిర్వాహకులు.

'గత 14 ఏళ్లుగా వృద్ధాశ్రమం నడుపుతున్నాం. ఇలాంటి ఇబ్బంది ఎప్పుడూ రాలేదు. లాక్ డౌన్ కారణంగా విరాళాలు రావడంలేదు. పైగా శానిటైజేషన్ ఖర్చు పెరిగింది. దాతలు స్పందించి ఆదుకోవాలని కోరుతున్నాం..'-- ఆశ్రమ నిర్వాహకురాలు

వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో వృద్ధులను కాపాడుకోవడం సవాల్​గా మారిందంటున్నారు. అయితే ఎన్ని ఇబ్బందులున్నప్పటికీ తమను జాగ్రత్తగా చూసుకుంటున్నారని చెప్తున్నారు ఆశ్రయం పొందుతున్న వృద్ధులు.

ఇవీ చదవండి... : నిజాంపట్నం హార్బర్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్

ABOUT THE AUTHOR

...view details